Tirumala: తిరుమల మాడవీధులు గోవిందా నామస్మరణతో మారుమ్రోగుతున్నాయి. ఎటుచూసినా భక్తజనసందోహం తిరువీధులలో కనిపిస్తోంది. అలిపిరి నుండి గల కాలినడక దారి భక్తులతో నిండుగా కనిపిస్తోంది. శ్రీ శ్రీనివాసా శరణు.. శరణు అంటూ భక్తులు కలియుగ వైకుంఠం శ్రీ శ్రీనివాసుడి దర్శనం కోసం బారులు తీరుతున్నారు. దీనితో భక్తుల సేవలో తరించే టీటీడీ, ఎటువంటి అసౌకర్యం కలగకుండా.. అన్ని చర్యలు చేపట్టింది. అసలే దీపావళి పర్వదినం రాబోతోంది. దీపావళి ఆస్థానం సైతం స్వామి వారి సన్నిధిలో నిర్వహించడం ఆనవాయితీ. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా ఇప్పటికే టీటీడీ పూర్తి చేసింది. తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా, దేశ విదేశాల నుండి స్వామి వారి దర్శనార్థం తిరుమలకు చేరుకుంటున్నారు.
శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతుందంటే?
ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుందని టీటీడీ ప్రకటించింది. అలాగే సోమవారం స్వామి వారిని 64447 మంది భక్తులు దర్శించుకోగా.. 25555 మంది భక్తులు తలనీలాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. అంతేకాదు స్వామి వారికి భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ. 3.38 కోట్ల మేర ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. కాగా 7 కంపార్ట్ మెంట్ లలో భక్తులు, స్వామి వారి దర్శనం కోసం వేచిఉన్నారు.
నేడు టీటీడీ ట్రస్ట్ దాతల దర్శనాల జనవరి నెల కోటా విడుదల..
టీటీడీ నిర్వహిస్తున్న వివిధ ట్రస్ట్ లు, పథకాలతో పాటు శ్రీవేంకటేశ్వర అపన్న హృదయ పథకానికి విరాళం ఇచ్చిన దాతలకు సంబంధించి దర్శనాలు, వసతి గదుల 2025 జనవరి నెల కోటాను వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం తారీఖులు మినహాయించి అందుకు సంబంధించిన దర్శనం టికెట్లను నేడు ఉదయం 11.30 గంటలకు టీటీడీ విడుదల చేయనున్నట్లు ఈవో శ్యామలరావు తెలిపారు.
Also Read: Horoscope 24 october 2024: ఈ రాశి వారికి ఊహించని ధనలాభాలు.. ఇలా చేస్తే ఇంకా బెటర్!