YSR Family Assets : వైఎస్ఆర్ కుటుంబంలో ఆస్తి విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న వైఎస్ షర్మిల మధ్య ఈ మధ్య కాలం వరకు కేవలం రాజకీయ విమర్శలే ఎక్కువగా ఉండేవి. కానీ ఈసారి ఆస్తి వివాదాలు కూడా బయపడటం రాజకీయాల్లో సంచలనంగా మారింది. అన్నాచెల్లెళ్ల మధ్య ఆస్తుల పంచాయితీ అగ్గిరాజుకుంది. దీంతో తన అన్నకు సోదరి వైఎస్ షర్మిల లేఖ సంధించింది.
గురువారం మధ్యాహ్నం 12 గంటలకు బిగ్ బ్రేకింగ్ న్యూస్, ప్రకటిస్తామని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తర్వాత వైసీపీ కూడా టీడీపీ దారిలోనే బిగ్ బ్రేకింగ్ అంటూ సంచలనానికి తెరలేపింది. దీంతో రేపు ఏపీలో రేపు రెండు పెద్ద ఎక్స్ ప్లోజివ్స్ పేలతాయంటూ ఏపీతో పాటు తెలంగాణలోనూ ఉత్కంఠ చెలరేగింది.
కానీ ముందురోజు రాత్రే, అంటే బుధవారం రాత్రి టీడీపీ మాజీ సీఎం జగన్ కు ఆయన సోదరి వైఎస్ షర్మిల, విజయమ్మల మధ్య ముదిరిన ఆస్తి వివాదంపై ఓ లేఖను టీడీపీ బహిర్గతం చేసింది.
నోటీసులు ఇవ్వడం దురదృష్టకరం :
వైఎస్ ఫ్యామిలీ కుటుంబపెద్దగా ఆస్తులను అందరికీ సమంగా పంచాల్సిన బాధ్యతలో ఉన్న మీరు ఇలా నోటీసులు ఇవ్వడం దురదృష్టకరం అంటూ వైఎస్ షర్మిల, తన అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు.
మీ ఆలోచన మార్చుకోండి…
ఆస్తుల పంపకంపై చట్టబద్దంగా చేసుకున్న అగ్రిమెంట్ ను రద్దు చేయాలన్న ఆలోచన ఎలా ఆచరణ సాధ్యం అవుతుందంటూ ప్రశ్నించారు. మీ నిర్ణయం మార్చుకుని వైఎస్ వారసులకు ఆస్తులు సమంగా పంచకపోతే కోర్టు మెట్లు ఎక్కాల్సి ఉంటుందని ఘాటుగా బదులిచ్చారు.
ఆ రెండింటికీ ముడి ఎందుకు…
రాజకీయాలకు, ఆస్తుల పంపకాలకు ముడిపెట్టడంపై షర్మిల అభ్యంతరం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యుల ఆస్తుల విషయంలో గతంలో జరిగిన చర్చలు, ఒప్పందాలకు తల్లి విజయలక్ష్మి ప్రత్యక్షసాక్షిగా ఉన్నారని షర్మిల గుర్తు చేశారు. తాను రాసిన లేఖలో అమ్మ సంతకం చేశారని, ఇకనైనా మంచి నిర్ణయం తీసుకోవాలంటూ సూచించారు.
ఒక్క శాతం కోసమే…
సరస్వతి పవర్ కంపెనీలో తల్లి విజయమ్మకు జగన్ గతంలోనే 1 శాతం వాటాను గిఫ్ట్ డీడ్గా ఇచ్చారు. అయితే ఇప్పుడా ఒక్క షేర్ వైఎస్ షర్మిల పేరిట బదిలీ అయ్యింది. దీంతో తనకు తెలియకుండా షేర్ షర్మిలకు బదలాయించారని వైఎస్ జగన్ ఫైర్ అవుతున్నారు. దీన్ని రద్దు చేయాలంటూ నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ను ఆశ్రయించారు. సరస్వతీ పవర్ కంపెనీలో జగన్ పేరిట 99 శాతం షేర్లు ఉన్నాయి. 1 శాతం షేర్ విజయమ్మకు ఉండటం గమనార్హం.
ఆస్తి చెరిసగం…
ఆస్తుల పంపకంపై జగన్ లేఖకు షర్మిల ఘాటుగా ప్రతి స్పందించారు. నాన్న సంపాదించిన ఆస్తిని చెరిసగం పంచుకోవాలని సూచించారని షర్మిల అన్నారు. నాన్న వైఎస్ చెప్పిన మాటకు అప్పుడు అంగీకరించిన నువ్వు నాన్న మరణం తర్వాత మాట తప్పడంపై షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.
నాకు మితంగానే ఆస్తులు…
భారతి సిమెంట్స్, సాక్షిలో మెజార్టీ వాటాను దక్కించుకునేందుకు నాపై ఒత్తిడి చేశావని ఆమె గుర్తు చేశారు. అన్న అన్న గౌరవం, కుటుంబం పరువు కోసమే తాను అధిక షేర్లను వదులుకున్నాట్లు చెప్పుకొచ్చారు. 31-8-2019నాడు జరిగిన ఒప్పందాన్ని సైతం ఉల్లంఘించావన్నారు. నాకు మితంగానే ఆస్తులను ఇచ్చారని చెప్పారు. ఇప్పుడేమో కన్న తల్లి, తోబుట్టువుపైనే కేసులు పెట్టావని ఆందోళన వ్యక్తం చేసింది. నాన్న మాటతో పాటు ఒప్పందాన్నీ ఉల్లంఘించావని, మీరు పంపిన లేఖ ఒప్పందం, వాస్తవానికి విరుద్ధమన్నారు.
కలలో కూడా ఊహించలేదన్న…
అమ్మపై, నాపై కేసు వేస్తావని నాన్న కలలో కూడా ఊహించి ఉండరని భావోద్వేగమైన మాటను మాట్లాడారు. పేరు మార్పిడి చేయకుండానే సంవత్సరాలుగా కాలయాపన చేశావన్నారు. భారతి, సండూర్ పవర్లో అమ్మ వాటాను గిఫ్ట్ డీడ్గా ఇచ్చేందుకు మీరు, భారతి సంతకాలు చేశారని గుర్తు చేశారు. ఇప్పుడేమో వాటాలు ఇవ్వకుండా అనవసరంగా కోర్టుకు వెళ్లారన్నారు.
అమ్మకే పూర్తి అధికారం ఇచ్చారు కదా…
సరస్వతి పవర్ వాటాల విషయంలో అమ్మకు పూర్తి అధికారం ఇచ్చారని, అన్నింటికి ఒప్పుకుని ఇప్పుడు వివాదం కోర్టుకు తీసుకెళ్లావన్నారు. సరస్వతి పవర్లో న్యాయబద్ధంగా నాకే వాటా ఉంది, నా రాజకీయ జీవితం నా ఇష్టపూర్వకమేనన్నారు. ఇందులో నాపై ఎవరి ఆంక్షలు ఉండవి తేల్చిచెప్పారు.
also read : అన్నా చెల్లి.. ఆస్తుల లొల్లి