Revanth Reddy: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ధర్నాకు పిలుపు ఇచ్చారు. కాంగ్రెస్ శ్రేణులు ధర్నాకు సై అన్నారు. ప్రభుత్వం టెన్షన్ లో పడింది. ఎప్పటిలానే పోలీసులు రంగంలోకి దిగారు. రేవంత్ రెడ్డిని హౌజ్ అరెస్ట్ చేశారు. గాంధీ భవన్ లో కాంగ్రెస్ కేడర్ కస్సుమంది. ధర్నాకు అనుమతిలేదంటూ ఎక్కడికక్కడ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఉదయం అంతా రచ్చ రచ్చ నడిచింది. ఆ తర్వాత రేవంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయన్ను ఇంటి నుంచి బొల్లారం పీఎస్ ను తరలించి.. గంటల తరబడి కట్టడి చేశారు. రోజంతా తెలంగాణ రాజకీయం రేవంత్ రెడ్డి చుట్టూనే నడిచింది. సాయంత్రం ఆయన్ను రిలీజ్ చేశారు.
ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు లేదా? అంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధిపత్య పోరులో సర్పంచ్లు సమిధలు అవుతున్నారని అన్నారు. సర్పంచ్ల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే ధర్నాకు పిలుపునిచ్చామని చెప్పారు. నిధులను విడుదల చేయకపోవడం ద్వారా గ్రామపంచాయితీ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని రేవంత్ రెడ్డి విమర్శించారు.
‘‘పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు, కరెంట్ బిల్లులు చెల్లించేందుకు నిధులు లేకుండా చేశారు. బిల్లులు పెండింగ్లో ఉండటంతో సర్పంచ్లు, ఉపసర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కేసీఆర్ అవినీతి, అహంకారంతో రాష్ట్రంలో పంచాయితీరాజ్ వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోయింది. గ్రామసర్పంచ్లకు చెందాల్సిన దాదాపు రూ.35వేల కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం దొంగలించింది. ఇది చట్టవిరుద్ధం. నియమ నిబంధనలను ఉల్లఘించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది’’ అని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
“అరెస్టులు, గృహనిర్బంధాలు చేస్తున్నారు. అయినా మా పోరాటం ఆగదు. ధర్నా చౌక్ వద్ద ఆందోళనలను కొనసాగిస్తాం. బిల్లుల కోసం సర్పంచ్లు మంత్రులను నిలదీయాలని కోరుతున్నాం. మంత్రుల కార్యక్రమాలను అడ్డుకోవాలని సర్పంచ్లకు విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిధులను పంచాయితీ ఖాతాల్లో వెంటనే జమచేయాలి. ఆత్మహత్య చేసుకున్న సర్పంచ్, ఉపసర్పంచ్ల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి’’ అని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.