Ys Jagan Sharmila :
⦿ చెల్లి, తల్లిపై రోడెక్కిన వైఎస్ జగన్
⦿ సరస్వతి పవర్లో షేర్లు లాక్కున్నారని ఆరోపణ
⦿ గిఫ్ట్ డీడ్ చేశారంటున్న వైఎస్ షర్మిల
⦿ వివాదంపై ఎన్సీఎల్టీలో పిటిషన్
⦿ 2019లో ఇద్దరి మధ్య ఆస్తుల పంపకాలు
⦿ మధ్యవర్తులుగా ఉన్న విజయమ్మ, వైవీ
⦿ ఒప్పందం ప్రకారం ఆస్తులివ్వని అన్న
⦿ డాక్యుమెంట్లను బయటపెట్టిన చెల్లి
⦿ తీవ్ర విమర్శలు చేస్తూ టీడీపీ ట్వీట్
అమరావతి, స్వేచ్ఛ : వైఎస్ ఫ్యామిలీ మరోసారి రోడెక్కింది. ఇప్పటి వరకూ రాజకీయంగా మాత్రమే అన్న చెల్లి మధ్య యుద్ధం నడిచింది. అయితే ఇప్పుడు ఆస్తి పంపకాల విషయంలో కూడా వివాదాలు తలెత్తాయి. ఈ వ్యవహారం తారాస్థాయికి చేరడంతో రాజకీయ ప్రత్యర్థులు బంతాట ఆడుకుంటున్నారు. తల్లి వైఎస్ విజయమ్మ, చెల్లి వైఎస్ షర్మిలపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ను ఆశ్రయించారు. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ షేర్ల వివాదంపై సెప్టెంబర్ 9న జగన్ దంపతులు తరపున వై. సత్యనారాయణ కంపెనీల యాక్ట్ 59 కింద పిటిషన్ దాఖలు చేశారు. ఇదంతా గత నెలలో జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గతంలో షర్మిలకు కేటాయించిన వాటాలను రద్దు చేయాలని పిటిషన్లో పేర్కొన్నారు. సోదరి అనే భావంతో షర్మిలకు వాటాలు ఇవ్వాలని భావించానని, అయితే ఇటీవల రాజకీయంగా తనకు వ్యతిరేకంగా మారడంతో ఆ ఆఫర్ను విరమించుకున్నట్లు పిటిషన్లో జగన్ స్పష్టం చేశారు. ఈ పిటిషన్ స్వీకరించిన ఎన్సీఎల్టీ ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. ఇందులో ప్రతివాదులుగా సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, షర్మిల, విజయమ్మ, చాగరి జనార్ధన్ రెడ్డి, కేతిరెడ్డి యశ్వంత్ రెడ్డి, రిజినల్ డైరెక్టర్ సౌత్ ఈస్ట్ రీజియన్, రిజిస్ట్రారర్ ఆఫ్ కంపెనీస్ తెలంగాణలను ప్రతివాదులుగా చేర్చారు. తదుపరి విచారణను నవంబర్ 8కి వాయిదా వేసింది.
నాడు.. నేడు
సోదరి వైఎస్ షర్మిలకు ఏమేం ఇవ్వాలనే దానిపై 2019 ఆగస్టు 21న ఒప్పందం చేసుకున్నారు. ఇరువురూ అగ్రిమెంట్ రాసుకున్నారు. ఈ పంపకాలకు వైఎస్ విజయమ్మ, వైవీ సుబ్బారెడ్డి మధ్యవర్తిత్వం వహించారు. హైదరాబాద్లోని బంజారాహిల్స్ రోడ్ నెం.2, సాగర్ సొసైటీలో ఉన్న ఇళ్లను ఇవ్వడానికి వైఎస్ జగన్ ఒప్పుకున్నారు. దీంతో పాటు కాటేదాన్లోని 9,880 చదరపు అడుగుల స్థలం, సరస్వతి పవర్లోని షేర్లు అన్నీ ఇచ్చేందుకు అంగీకరించారు. సాక్షిలో జగన్ షేర్లలో 40 శాతం, భారతి సిమెంట్స్లో జగన్ పేరిట ఉన్న షేర్లలో 40 శాతం, ఆకాశ్ ఎస్టేస్ట్స్లో వైఎస్ భారతీకి ఉన్న షేర్లన్నీ షర్మిలకు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. అయితే సరస్వతి కంపెనీల షేర్ల బదిలీల విషయంలో జగన్-షర్మిల మధ్య రగడ మొదలైంది. కోర్టు కేసులతో ఆస్తుల పంపకాలు కొలిక్కి రాలేదు. జగన్ ఎన్సీఎల్టీని ఆశ్రయించడంతో గిఫ్ట్ డీడ్ డాక్యమెంట్లను షర్మిల బయటపెట్టారు. అయితే ఆ కంపెనీ అభివృద్ధికి తానే కృషి చేశానని జగన్ చెబుతున్నారు. షేర్లు కేటాయించిన మాట వాస్తవమే కానీ కొన్ని పరిణామాలు, మరికొన్ని కారణాలతో కేటాయింపులు జరగలేదని ఎన్సీఎల్టీలో వేసిన పిటిషన్లో ఆయన పేర్కొన్నారు. అందుకే ఆ కంపెనీకి చెందిన షేర్లను విత్ డ్రా చేసుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు. ట్రిబ్యునల్ తదుపరి విచారణతో ఈ వ్యవహారానికి ఫుల్ స్టాప్ అవకాశం కనిపిస్తోంది.
ఇలా మొదలై..
వైఎస్ వారసులుగా వైఎస్ జగన్-షర్మిల ఇద్దరూ చెరిసమానంగా పంచుకోవాల్సి ఉంది. షర్మిల కూడా ఆస్తిలో సగభాగం వస్తుందని భావించారు. దీనికి తోడు పంపకాలపై ఒప్పందాలు కూడా చేసుకోవడంతో కచ్చితంగా అన్న మాట నిలబెట్టుకుంటారని చెల్లి ఎంతో ఆశపడ్డారు. ఇవన్నీ ఒక ఎత్తయితే అన్న కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలబడటం, అరెస్ట్ అయినప్పుడు వైసీపీ కాపాడటంలో ఆమె ప్రధాన పాత్ర పోషించారు. దీనికి తోడు పాదయాత్ర కూడా చేశారు. అంతేకాదు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయానికి శాయశక్తులా కృషి చేశారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తనకు తగిన ప్రాధాన్యత ఉండే పదవి ఇస్తారని అనుకున్నారు. నెల, రెండు నెలలు ఏడాది గడిచినా పదవి ఊసే లేదు. కనీసం పలకరింపు కూడా లేకపోవడంతో ఇక చేసేదేమీ లేక ఆంధ్రప్రదేశ్ను, అన్నను పూర్తిగా వదిలేసి తెలంగాణకు షిఫ్ట్ అయిపోయారు. వైఎస్సార్టీపీని స్థాపించి హైదరాబాద్లోని లోటస్ పాండ్ వేదికగా కార్యకలాపాలు షురూ చేశారు. ఇందుకు విజయమ్మ కూడా తన వంతు సాయం చేస్తూ వచ్చారు. అయితే అనుకున్నట్లుగా రాష్ట్ర రాజకీయాలపై పట్టు సాధించలేకపోయారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడంతో ఏపీ పార్టీ బాధ్యతలు హైకమాండ్ అప్పగించింది. తెలంగాణను పూర్తిగా వదిలేసిన షర్మిల ఏపీకి షిఫ్ట్ అయిపోయారు. రాష్ట్రంలో ఆమె అడుగుపెట్టిన నాటి నుంచి వైసీపీ వర్సెస్ షర్మిలగా పరిస్థితులు నెలకొన్నాయి. ఒకప్పుడు జగనన్న వదలిన బాణం అని చెప్పుకుని జనాల్లోకి వెళ్లిన షర్మిల ఆఖరికి అన్నపైకి అవే విమర్శల బాణాలు ఎక్కుపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది.
ALSO READ : తీవ్ర తుఫానుగా మారనున్న దానా.. గంటకు 90 నుంచి 120km వేగంతో గాలులు
ఇక్కడి దాకా..
నేరుగా వైఎస్ జగన్ను టార్గెట్ చేస్తూ మాట్లాడటం, తీవ్ర విమర్శలు కూడా ఎక్కుపెట్టిన సందర్భాలు కోకొల్లలు. అటు అన్న కూడా విమర్శించిన రోజులు ఉన్నాయి.
ఇలా మాటల యుద్ధం నడుస్తుండగానే ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది. అప్పడిక మరింత ఘాటుగా షర్మిల మాట్లాడటం మొదలుపెట్టారు. ఎన్నికల ప్రచారంలో బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య విషయాన్ని పదే పదే ప్రస్తావించి మరీ జగన్పై దుమ్మెత్తి పోశారు. అసలు సిసలైన వైఎస్ వారసత్వం తనదే అని కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇలా అన్న-చెల్లి మధ్య జరిగిన గొడవలు, విమర్శలు, వివాదాలు అన్నీ ప్రత్యర్థి పార్టీలకు బాగా ప్లస్ అయ్యాయి. దీంతో తల్లి, చెల్లికి న్యాయం చేయలేని జగన్ రాష్ట్రానికి ఏం చేస్తారు? ఎందుకు వైసీపీకి ఓటేయాలి అనే ప్రశ్నలు ప్రత్యర్థులు సంధించడం మొదలుపెట్టారు. ఆఖరికి అన్నకు చెక్ పెట్టాలని కడప పార్లమెంట్ నుంచి ఎంపీగా పోటీ చేశారు. కానీ ఆశించినంతంగా ఓట్లు దక్కలేదు. వైసీపీ ఓడిపోవడం, షర్మిల కూడా ఓటమిపాలవ్వడంతో సైలెంట్ అయ్యారు. అయితే మీడియా సమావేశం, సోషల్ మీడియా ద్వారా మాత్రం విమర్శలు ఆమె ఎక్కుపెడుతూనే ప్రశ్నిస్తూనే వస్తున్నారు. అలా రాజకీయ విమర్శలు, వివాదాలు కాస్త బ్రేక్ ఇచ్చి ఆస్తుల పంపకాలపై దృష్టి సారించారు. దీంతో చాలా ఏళ్లుగా నడిచిన ఆస్తుల వివాదం కోర్టుల దాకా వెళ్లింది. ఎన్సీఎల్టీ ఏం తేలుస్తుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
జగన్ సైకో కాబట్టే..
అన్నా చెల్లి మధ్య నడుస్తున్న ఈ వివాదంపై అధికార టీడీపీ ట్విట్టర్ వేదికగా స్పందించింది. ఈ సైకో జగన్ ప్రజలే కాదు, ఇంట్లో వాళ్లు కూడా సైకో, శాడిస్ట్, పిచ్చోడు అనేది ఇందుకే. ఈ ప్రపంచంలో ఆస్తుల కోసం తల్లి మీద కూడా కేసు వేసింది ఈ శాడిస్ట్ ఫెలో వైఎస్ జగన్ ఒక్కడే. ఇలాంటి సైకో కాబట్టే, ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా తీర్పు ఇచ్చారని తీవ్ర స్థాయిలో తెలుగుదేశం విమర్శలు గుప్పించింది.