Priyanka Gandhi : కేరళలోని వయనాడ్కు ప్రియాంక గాంధీ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేసే ముందు కాల్పేట్టాలో ఏర్పాటు చేసిన రోడ్ షాకు ప్రియాంక హాజరయ్యారు.
ఇది వయనాడ్ గౌరవం…
ముందుగా బుధవారం ఉదయం నామినేషన్ పత్రాలపై ప్రియాంక సంతకం చేశారు. అనంతరం కాల్పేట్టాలో భారీ రోడ్ షో ద్వారా వయనాడ్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్ కార్యకర్తలు, యూడీఎఫ్ శ్రేణులు, ప్రజలు భారీగా తరలివచ్చారు. ఈ మేరకు ప్రసంగించిన ప్రియాంక, వయనాడ్ ప్రజలకు ప్రాతినిధ్యం వహించడం తనకు దక్కిన గౌరవమన్నారు. తల్లి సోనియా, సోదరుడు రాహుల్ గాంధీతో పార్టీ నేతల కోసం తాను నేను గత 35 ఏళ్లుగా ఎన్నికల ప్రచారాలు చేశానన్నారు.
ఇదే తొలిసారి…
అయితే నా కోసం నేను ప్రచారం చేసుకోవడం మాత్రం ఇదే తొలిసారన్నారు. తనకు అవకాశం ఇస్తే వయనాడ్ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తానని, తనకు ఇదో గౌరవమని అన్నారు. మీ కుటుంబంలో భాగం కావడం నాకు గౌరవమని స్థానిక ప్రజలను ఉద్దేశించి ప్రియాంక గాంధీ అన్నారు.
మీ ధైర్యమే నాకు స్ఫూర్తి…
ఇక వరదలు వచ్చి కొండచరియలు విరిగిపడినప్పుడు ఒకరికొకరు సాయం చేసుకోవడం తాను చూశానన్నారు. నాకు స్ఫూర్తినిచ్చింది ఆనాటి మీ ధైర్యమేనన్నారు.
ప్రియాంక గెలిస్తేనే ఇద్దరు ఎంపీలు…
వయనాడ్ లో ప్రియాంక గెలిస్తే ఇక్కడి ప్రజల తరఫున పార్లమెంట్లో ఇద్దరు ఎంపీలు ఉంటారని రాహుల్ గాంధీ చెప్పారు. తాను ఇక్కడ అనధికారిక ఎంపీ అన్నారు. సోదరి ప్రియాంక కుటుంబం కోసం చాలా త్యాగం చేసిందన్న రాహుల్, ఇప్పుడు మీ అందరిని కూడా ఒక కుటుంబలాగానే భావిస్తోందన్నారు. ప్రియాంకను మీరు కూడా అలాగే చూస్తారని ఆశిస్తున్నానన్నారు. మంగళవారం రాత్రే ప్రియాంక వయనాడ్ చేరుకున్నారు.
ఉప ఎన్నిక నామినేషన్ దాఖలు చేసేందుకు తల్లి సోనియా గాంధీతో కలిసి వచ్చారు. బుధవారం ఉదయం నాయకల సమక్షంలోనే తన నామినేషన్ పత్రాలపై సంతకం చేశారు. నామినేషన్ దాఖలు సమయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేశ్ బఘేల్ హాజరయ్యారు.
ఒకే ఇంటి నుంచి మూడో ఎంపీగా…
ఎంపీగా ప్రియాంక గెలిస్తే తొలిసారిగా పార్లమెంట్ లో అడుగుపెడతారు. ఇప్పటికే పార్లమెంట్ లో సోనియా, రాహుల్ లు రాజ్యసభ, లోక్ సభ సభ్యులుగా ఉన్నారు. ప్రియాంక గెలిస్తే ఈ సంఖ్య మూడుకు పెరుగుతుంది.
also read : రాజకీయాల్లో ప్రియాంక్ గాంధీ అధికారిక ఎంట్రీ.. వయనాడ్ ఉపఎన్నికల్లో నామినేషన్ దాఖలు