BRS: వైసీపీ యాక్షన్ లోకి దిగింది. బీఆర్ఎస్ పై డైలాగ్ వార్ స్టార్ట్ చేసింది. కొడాలి నాని, రోజా లాంటి వాళ్లు సాఫ్ట్ గా మాట్లాడితే.. పేర్ని నాని మాత్రం బీఆర్ఎస్ పై ఉప్పు, కారం చల్లారు. మాటల మంట రాజేశారు.
ఏపీకి ద్రోహం చేసింది తెలంగాణ నేతలే.. వాళ్లు ఏపీని ఏం ఉద్ధరిస్తారు? ఏపీకి తెలంగాణ నేతలే వెన్నుపోటు పొడుస్తున్నారు.. ఉమ్మడి ఆస్తులు పంచారా? డబ్బులిచ్చారా? విద్యుత్ బకాయిలు చెల్లించారా? అంటూ నిలదీశారు. ఏపీలో బీఆర్ఎస్ పోటీ చేస్తే తప్పు లేదంటూనే.. కేఏ పాల్ కూడా 175 స్థానాల్లో పోటీ చేశారని గుర్తు చేసి.. గాలి తీసేశారు.
మాజీ మంత్రి పేర్ని నాని కామెంట్ల వెనుక పెద్ద వ్యూహమే ఉందంటున్నారు. మంత్రి పదవి పోయాక కూడా.. ఈమధ్య ఆయనే వరుస ప్రెస్ మీట్లు పెడుతున్నారు. తాడేపల్లి స్క్రిప్ట్ ప్రకారమే పేర్ని నాని మాట్లాడుతారనేది ఓపెన్ సీక్రెట్. మరి, నానితో బీఆర్ఎస్ ను తిట్టించింది కూడా జగనే అనుకోవచ్చు.
కేసీఆర్, జగన్ రహస్య స్నేహితులనేది అంతా అనే మాట. నిజమే కావొచ్చు. కాకపోవచ్చు. ఓపెన్ గా మాత్రం వారిమధ్య ధ్వేషం లేదు, స్నేహం కనిపించదు. అయితే, రాజకీయ ఆవశ్యకత వచ్చినప్పుడల్లా తెలంగాణ మంత్రులు ఏపీని, వైసీపీని, జగన్ ఫ్యామిలీనే తిట్టే స్ట్రాటజీ ఈమధ్య కాలంలో బీఆర్ఎస్ అమలు చేస్తోంది. ప్రతిగా, ఏపీ మంత్రుల నుంచి బీఆర్ఎస్ లీడర్లకు కౌంటర్ అటాక్స్. కొన్నాళ్లుగా సాగుతోంది ఈ తంతు. ఈ తిట్ల వెనుకా.. ప్రాంతీయ విధ్వేశాలను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకునే ఎత్తుగడ ఉందనేది రెండు రాష్ట్రాల్లోని ప్రతిపక్షాల విమర్శ. తాజాగా, పేర్ని నాని బీఆర్ఎస్ మీద చేసిన విమర్శలు సైతం అలానే చూడాలంటున్నారు.
ఇరు పార్టీలు పరస్పరం విమర్శించుకుంటూ.. రెండు రాష్ట్రాల్లో తామే చాంపియన్స్ గా ముందుండాలనేది బీఆర్ఎస్, వైసీపీ స్ట్రాటజీ అంటున్నారు. ప్రతిపక్షాలకు ఛాన్స్ ఇవ్వకుండా.. ఆ రెండు పార్టీలే గొడవ పడుతూ.. ప్రజలంతా తమవైపే వన్ సైడెడ్ గా ఉండేట్టు చేయడమే ఆ ఎత్తుగడ అని అనుమానిస్తున్నారు. పలువురు ఏపీ నేతలు బీఆర్ఎస్ లో చేరిన సందర్భంలోనే.. మాజీ మంత్రి పేర్ని నాని ఏపీకి ద్రోహం, ఏపీకి వెన్నుపోటు, విభజన సమస్యలు ప్రస్తావిస్తూ మాటల దాడి చేయడం ఆసక్తికరం. ఇన్నాళ్లూ గుర్తుకురాని ఆ ఇష్యూలు.. ఇప్పుడే గుర్తుకు రావడం.. బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ తెలంగాణ నేతలను నానామాటలు అనడం.. ఆ విమర్శలన్నిటికీ ఓ రాజకీయ లెక్కుందనేది వాదన. ఇప్పుడే కాదు.. ఇక ముందుముందు బీఆర్ఎస్, వైసీపీ నేతల మధ్య మాటల మంట మరింత పెరుగుతుందని ముందే అంచనా వేస్తున్నారు విశ్లేషకులు.