KTR – Amberpet: ఇటీవల అంబర్ పేట్లో దారుణం జరిగింది. వృద్ద దంపతులు లింగా రెడ్డి, ఊర్మిళ దేవిని దారుణంగా హత్య చేశారు దుండగులు. వీరి కుమార్తెలు ఇద్దరూ అమెరికాలో స్థిర పడ్డారు. దీంతో వీళ్లు ఒంటిరిగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఇంట్లోకి చొరబడిన దుండగులు.. వాళ్లద్దరిని దారుణంగా నరికి చంపారు. ఈ ఘటన మూడు రోజుల క్రితం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.. తాజాగా అంబర్ పేట్ సాయిబాబా నగర్లో హత్యకు గురైన వృద్ద దంపతులు లింగా రెడ్డి, ఊర్మిళ దేవి కుటుంబ సభ్యులను కేటీఆర్ పరామర్శించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. అంబర్ పేట్ సాయి బాబా నగరంలో ఎన్నో ఏళ్ల నుంచి ప్రజలు శాంతియుతంగా ఉంటున్నారు. కానీ ఇటీవల లింగారెడ్డి, ఊర్మిళా దేవిని పట్టపగలే అతి దారుణంగా చంపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరంలో ప్రతి మనిషినీ.. ఈ జంట హత్య కలిచివేసిందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదిలా ఉంటే..లింగా రెడ్డికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ లోని అనేక చోట్ల 10 లక్షల సీసీ కెమరాలు ఏర్పాటు చేయడం జరిగింది. బస్తీ, బస్తీకి సీసీ కెమరాలు పెట్టాం అన్నారు. అలాగే శాంతి భద్రతల విషయంలో ఎక్కడా రాజీపడలేదని కేటీఆర్ పేర్కొన్నారు. తమ హయాంలో పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి పని చెయ్యండని చెప్పామన్నారు. శాంతి భద్రతలు బాగుంటే రాష్ట్రంలో పెట్టుబడులు వస్తాయని కేటీఆర్ తెలిపారు. ఇప్పటి వరకూ లింగారెడ్డి, ఊర్మిళ జంట హత్య కేసును పోలీసులు చేదించలేకపోయారని కేటీఆర్ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని జగిత్యాల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డే అంటున్నారు. హోంశాఖ మంత్రిని నియమించమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వేడుకుంటున్నా అని.. కేటీఆర్ అన్నారు.
Also Read: కేటీఆర్.. తాటాకు చప్పుళ్లకు భయపడేదు-బండి సంజయ్
పోలీస్లను తమ మీద, అశోక్ నగర్లో చదువుకునే పిల్లలు మీద కాంగ్రెస్ నేతలు ఉసుగొల్పడం సరికాదన్నారు. సమర్ధవంతమైన పోలీసు అధికారులు చాలా మంది ఉన్నారు. వారికి ఫ్రీడమ్ ఇవ్వండి.. పని చేయమని చెప్పండన్నారు. ఎవరో వస్తారు.. ఏదో చేస్తారు అని ప్రజలు ఎదురు చూడవద్దన్నారు. హైదరాబాద్లో నివసించే ఎవరికైనా ఇబ్బంది కలిగితే తమకు చెప్పుకోవచ్చన్నారు. బీఆర్ఎస్ ప్రజలకు అండగా ఉంటుందని మీడియా ముందు కేటీఆర్ తెలియజేశారు. పని చేయని సీసీ కెమరాలను బాగు చేయించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందన్నారు. చేతకాకపోతే చెప్పండి.. మా సొంత ఖర్చులతో అయినా చేయిస్తాం.. అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.