Vasireddy Padma: వైసీపీలో నేతల రాజీనామాల పరంపర కంటిన్యూ అవుతోందా? పార్టీపై గుర్రుగా ఉన్న నేతలు వీడేందుకు సిద్ధమవుతున్నారా? వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత నెలకు ఒకరు లేదా ఇద్దరు నేతలు ఎందుకు రిజైన్ చేస్తున్నారు? ఫ్యాన్ పార్టీకి లైఫ్ లేదని నేతలు భావిస్తున్నారా? దీపం ఉండగానే ముందుగా ఇల్లు చక్కబెట్టుకుంటున్నారా? ఈ కోవలోకి వైసీపీ ఫైర్ బ్రాండ్ వాసిరెడ్డి పద్మ కూడా చేరి పోయారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
వైసీపీలో ఫైర్బ్రాండ్ అనగానే గుర్తుకొచ్చే నేత వాసిరెడ్డి పద్మ. దశాబ్దమున్నరపాటు ఆ పార్టీకి తన సేవలు అందించారు. ప్రత్యర్థులపై బీభత్సంగా విరుచుకుపడేవారు. మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ దక్కకపోవడంతో మహిళా కమిషన్ ఛైర్పర్సన్ పదవికి రాజీనామా చేశారు. పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చారు.
ప్రస్తుతం వైసీపీలో జరుగుతున్న పరిణామాలను గమనించారు వాసిరెడ్డి పద్మ (Vasireddy padma). ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ మనుగడ కష్టమని భావిస్తున్నారు. కూటమిని ఇప్పుడున్న పరిస్థితుల్లో తట్టుకోవడం వైసీపీ కష్టమనే నిర్ణయానికి వచ్చేశారామె. ఈ క్రమంలో వైసీపీకి రాజీనామా చేశారు. రేపో మాపో రాజీనామా లేఖను అధినేతకు పంపనున్నారు.
మరి వాసిరెడ్డి పద్మ రూటు ఎటు వైపు? టీడీపీ వైపు వెళ్లే ఛాన్స్ లేదన్నది ఆమె వర్గీయుల మాట. అయితే జనసేన, లేదంటే బీజేపీ మాత్రమే ఉన్నాయని అంటున్నారు. అయితే కొద్దిరోజులుగా జనసేన కీలక నేతలతో వాసిరెడ్డి మంతనాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి అందులో నిజమెంత అనేది తెలీదు. జనసేనలోకి ఆమె వెళ్లడం ఖాయమనే వాదన బలంగా వినిపిస్తోంది.
ALSO READ: మద్యం డిస్టిలరీలపై సీఐడీ దాడులు, జగన్ ఉక్కిరి బిక్కిరి.. బండారం బయటకు
రాబోయే ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం నుంచి టికెట్ కావాలని సూచన చేశారు. టికెట్పై నేతల నుంచి ఎలాంటి హామీ రాలేదన సమాచారం. ఎన్నికలకు ఇంకా ఐదేళ్లు సమయం ఉందని, ఇప్పటి నుంచే దానిపై మాట్లాడడం అంత కరెక్ట్ కాదని అంటున్నారట. సందర్భాన్ని బట్టి అధినేత నిర్ణయం తీసుకుంటారని చెప్పారట కొందరు నేతలు. రాబోయే రోజుల్లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశముందని అంటున్నారు.
ఒక్కసారి వెనక్కి వెళ్తే.. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు వాసిరెడ్డి పద్మ. ఆ పార్టీకి అధికార ప్రతినిధిగా పని చేశారు. మీడియాలో పార్టీ గొంతుకు బలంగా వినిపించారు. ప్రత్యర్థులపై విరుచుకుపడడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. అయితే ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో విలీనం తర్వాత సైలెంట్ అయ్యారు. చివరకు వైసీపీలో జాయిన్ అయ్యారు.
2019 వరకు వైసీపీ అధికార ప్రతినిధిగా పని చేశారామె. జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళా కమిషన్ ఛైర్పర్సన్ పదవి అప్పగించారు. అయినా ఆమె సంతృప్తి చెందలేదు. అసెంబ్లీలో అడుగు పెట్టాలన్నది ఆమె బలమైన కోరిక.
గత ఎన్నికల్లో వైసీపీ టికెట్ నిరాకరించింది. దీంతో ఆ పదవికి రిజైన్ చేశారు. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఏపీలో జరుగుతున్న పరిణామాలను గమనించిన వాసిరెడ్డి పద్మ, మరో పార్టీ వైపు మొగ్గు చూపకుంటే లైఫ్ ఉండదని భావించారు. ఆ విధంగా అడుగులు వేస్తున్నారు.