Minister konda Surekha : తెలంగాణ గంగా జమునా సంస్కృతికి విఘాతం కలిగించే చర్యలను ఏమాత్రం సహించబోమని మంత్రి కొండా సురేఖ అన్నారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు, సంస్థలు, వ్యక్తులు ఎవరూ దేవాలయాలపై రాజకీయాలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. దైవాన్ని మతాల ప్రాతిపదన విభజింవద్దని హితవు పలికారు.
చారిత్మ్రకమైన హైదరాబాద్ నగరం మత సామరస్యతకు, సర్వమతాల సంరక్షణకు ఆలవాలంగా ఉండి, గంగా జమునా తెహజీబ్ను కాపాడుకుంటూ వస్తుందని తెలిపారు. సికింద్రాబాద్లోని ముత్యాలమ్మ విగ్రహ ధ్వంసం ఘటనను రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకున్నదని అన్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే నిందితున్ని అరెస్టు చేశామని గుర్తు చేశారు. నిందితునికి చట్టపరంగా కఠిన శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు.
ALSO READ : ఫుట్ బోర్డుపై విద్యార్థుల ప్రయాణం..అసలేం జరిగింది?
కాంగ్రెస్ సర్కారు చేతల ప్రభుత్వమని, మాటల ప్రభుత్వం కాదని స్పష్టం చేశారు. ఈ ఘటనలో కొంతమంది అల్లరి మూకలు చేరి, మత సామరస్యతకు భంగం కలిగేలా చేస్తున్నారన్నారు సురేఖ. ప్రతిపక్షాలు ఈ అంశాన్ని రాజకీయం చేయడం సరికాదని సూచించారు. ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం ఎక్కడా నిర్లక్ష్యం వహించకుండా చర్యలు చేపట్టిందని వివరించారు. సంఘటన జరిగిన వెంటనే అక్కడికి దేవాదాయ శాఖ అధికారులను పంపించి సమగ్ర వివరాలు సేకరించినట్టు తెలిపారు. నిర్మాణ పనులు కూడా ప్రారంభమయ్యాయని అన్నారు. మిగతా పార్టీల మాదిరి తాము గుడులపై, ప్రజల నమ్మకాలపై రాజకీయాలు చేయదలుచుకోలేదని స్పష్టం చేశారు. దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు బుధవారం ముత్యాలమ్మ ఆలయాన్ని సందర్శించాలని ఆదేశించినట్టు మంత్రి సురేఖ వెల్లడించారు.