Nerella Sharada: మీకు విద్యార్థుల ప్రాణాలంటే లెక్కలేదా.. అసలు ఆత్మహత్యలకు విద్యార్థులు ఎందుకు పాల్పడుతున్నారు? కారణాలు ఆరా తీశారా.. ఏమనుకుంటున్నారు.. ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. ఓవర్ చేయవద్దంటూ మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాద్ బాచుపల్లి లోని నారాయణ కళాశాలలో ఇంటర్ విద్యార్థిని మృతి చెందడంపై, మహిళా కమిషన్ చైర్మన్ సీరియస్ అయ్యారు.
బాచుపల్లి లోని నారాయణ కళాశాలకు చెందిన ఇంటర్ ఫస్టియర్ విద్యార్థిని అనూష (16) స్వగ్రామం సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం నాగిరెడ్డిపల్లి. అయితే దసరా సెలవులకు ఇంటికి వెళ్ళిన అనూష, తన తల్లిదండ్రులతో పండుగను ఆనందంగా జరుపుకుంది. ఇక సెలవులు ముగిశాయి.. కళాశాలకు వెళ్లాల్సిన సమయం రాగానే, తల్లిదండ్రులు ఆమెను కళాశాల వద్ద విడిచిపెట్టి వెళ్లారు.
అలా వదిలి వెళ్లిన వారు, కొద్ది దూరం కూడా వెళ్లకముందే, కళాశాల సిబ్బంది వారికి ఫోన్ చేసి, మీ అమ్మాయి స్పృహ కోల్పోయిందంటూ సమాచారమిచ్చారు. ఇప్పుడు కళాశాల వద్ద వదిలి వచ్చిన తమ కుమార్తె, వెంటనే అనారోగ్యానికి గురైందంటూ, ఫోన్ రావడంతో ఆ తల్లిదండ్రులు హుటాహుటిన కళాశాల వద్దకు చేరుకున్నారు. ఇక అంతే అనూష ఉరి వేసుకుని చనిపోయినట్లు వారితో సిబ్బంది చెప్పారు. ఇక అంతే ఆ తల్లిదండ్రుల రోదనలతో కళాశాల మిన్నంటింది.
తమ కుమార్తెను కళాశాల వద్ద విడిచి, కనీసం 30 నిమిషాల సమయం కూడా కాకమునుపే, తమ బిడ్డను శవంగా చూడాల్సిన పరిస్థితి వారిది. దీనితో తమ బిడ్డ ఆత్మహత్యకు కళాశాలకు చెందిన సిబ్బంది కారణమని వారు ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మీలాంటి ప్రాణాలు కావా.. సీరియస్ యాక్షన్ కు రెడీగా ఉండండి
కాగా మంగళవారం బాచుపల్లి నారాయణ కళాశాలను మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థిని అనూష ఆత్మహత్యకు పాల్పడడం చాలా బాధాకరమైన విషయంగా పరిగణించిన ఆమె, కళాశాల సిబ్బందిపై సీరియస్ అయ్యారు. గత కొద్దిరోజులు క్రితమే తాను కళాశాలను తనిఖీ చేయడం జరిగిందని, విద్యార్థులు చెప్పిన పలు సమస్యలను పరిష్కరించాలని యాజమాన్యానికి సూచించడం జరిగిందన్నారు.
అయితే యాజమాన్యం పట్టించుకోలేదని, విద్యార్థుల ఆత్మహత్యల వెనుక యాజమాన్యం నిర్లక్ష్యం ఖచ్చితంగా ఉందన్నారు. మొత్తం కళాశాల స్టాఫ్ ను మార్చాలని యాజమాన్యంకు ఛైర్మన్ సూచించారు. ఈ ఆత్మహత్యలపై ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉందని, చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని మహిళా కమిషన్ చైర్మన్ హెచ్చరించారు. తాను ప్రతి ఇన్స్టిట్యూట్ తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని, విద్యార్థుల ప్రాణాలంటే, మీకు లెక్క లేదా.. మీలాంటి ప్రాణాలు కావా అంటూ శారద ఆగ్రహం వ్యక్తం చేశారు.