Revanthreddy : తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లోని ధర్నా చౌక్ వద్ద సర్పంచుల నిధుల సమస్యలపై రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టాలని టీపీసీసీ పిలుపునిచ్చింది. అయితే ఈ ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. అయినా సరే ఆందోళన చేస్తామని టీపీసీసీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో నేతలను ముందస్తుగా పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటి చుట్టూ భారీగా పోలీసులు మోహరించారు.
రాష్ట్రంలోని సర్పంచ్ల సమస్యలపై ధర్నాచౌక్ వద్ద ఆందోళన చేపట్టేందుకు అనుమతి కోసం టీపీసీసీ దరఖాస్తు చేసింది. అయితే పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని టీపీసీసీ హెచ్చరించింది. సర్పంచ్ల పోరాటానికి తాము మద్దతు ఇస్తున్నట్లు టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ప్రకటించారు.
రాష్ట్రంలో ఏ కార్యక్రమం అయినా చేస్తే బీఆర్ఎస్ చేయాలి. లేదంటే బీజేపీ చేయాలన్న చందంగా తయారైంది. కాషాయ నేతల పాదయాత్రలకు, సభలకు ఎలాంటి కండిషన్లు పెట్టకుండా ప్రభుత్వం అనుమతి ఇస్తోంది. పైకి బీఆర్ఎస్ , బీజేపీ మధ్య వైరం కనిపిస్తున్నా..అంతర్గతంగా అవగాహన ఉందనే అనుమానాలు కలుగుతున్నాయి. కాంగ్రెస్ నేతలు ఏ కార్యక్రమం చేపట్టినా కేసీఆర్ సర్కార్ అనేక షరతులు విధిస్తోంది. కొన్ని కార్యక్రమాలకు అనుమతి నిరాకరిస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరిపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ధర్నా చౌక్ వద్దే ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలిపే అవకాశం కల్పించకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ నేతలకు లేని ఆంక్షలు కాంగ్రెస్ నాయకులపైనే ఎందుకని ప్రశ్నిస్తున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ కు అన్ని నియోజకవర్గాల్లోనూ నాయకుల, కార్యకర్తల బలం ఉంది. బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీనే అనే అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ను నిర్వీర్యం చేయాలని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కుట్రలు చేస్తున్నారనేది హస్తం నేతల ఆరోపణ. బీజేపీకి లేని బలాన్ని చూపించి బీఆర్ఎస్ తో పోటీదారుగా చూపిస్తున్నారని విమర్శిస్తున్నారు. ఈ కుట్రలో భాగంగానే కాంగ్రెస్ నేతలు ప్రజాసమస్యలపై పోరాటం చేస్తుంటే అడ్డుకుంటున్నారని మండిపడుతున్నారు.