BRS : తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ విస్తరణపై మరింత ఫోకస్ పెట్టారు. పొరుగు రాష్ట్రాలకు విస్తరించే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఏపీలో బీఆర్ఎస్ కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే పలువురు నేతలు బీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. గతంలో జనసేనలో పని చేసిన తోట చంద్రశేఖర్, మాజీ మంత్రి రావెల కిశోర్బాబు, బీజేపీ నేత పార్థసారధి గులాబీ కండువా కప్పుకోబోతున్నారు.
తోట చంద్రశేఖర్ ఐఏఎస్ అధికారిగా ఉన్న సమయంలో స్వచ్ఛంద పదవీ విరమణ చేసి ప్రజారాజ్యం పార్టీలో చేరారు. 2009లో గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత వైసీపీలో చేరారు. 2014లో వైసీపీ తరఫున ఏలూరు నుంచి ఎంపీగా బరిలో దిగి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత జనసేనలో క్రియాశీలకంగా పనిచేశారు. 2019లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం చవిచూశారు. ఇలా మూడు పార్టీల తరఫున మూడు ప్రాంతాల్లో పోటీ చేసినా ఆయన గెలవలేకపోయారు. తోట చంద్రశేఖర్ 2020 నుంచి జనసేన పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఆ పార్టీ కార్యక్రమాల్లో కూడా ఎక్కడా కనిపించటం లేదు.
మాజీ మంత్రి రావెల కిశోర్బాబు ఐఆర్ఎస్ అధికారిగా రాజీనామా చేసి 2014లో టీడీపీలో చేరారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి రావెల ఎమ్మెల్యేగా గెలిచి చంద్రబాబు కేబినెట్లో స్థానం దక్కించుకున్నారు. రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గ విస్తరణలో పదవిని రావెల కోల్పోయారు. 2018లో రావెల జనసేనలో చేరారు. 2019 ఎన్నికల్లో ప్రత్తిపాడు నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు. ఓటమి తర్వాత రావెల బీజేపీలో చేరారు. అక్కడ కూడా ఇమడలేక పోయారు. దాదాపు ఏడాది క్రితం కాషాయ పార్టీని వీడారు. అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు.
పార్థసారధి గతంలో ఐఆర్ఎస్ అధికారిగా పనిచేసి ముందస్తు పదవీ విరమణ చేసి రాజకీయాల్లోకి వచ్చారు. 2019లో అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి జనసేన తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు.ఆ తర్వాత బీజేపీలో చేరారు. కానీ ఆ పార్టీలో అంత యాక్టివ్ గా పనిచేయలేదు.
ఏపీలో అడుగు పెట్టేందుకు కేసీఆర్కు నాయకుల అవసరం ఉంది. ఆ మేరకు వివిధ పార్టీల్లో పనిచేసి, స్థానికంగా పరిచయాలున్న వారిని బీఆర్ఎస్ చేర్చుకోవాలని భావిస్తున్నారు. విజయవాడలో బీఆర్ఎస్ కార్యాలయం ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అతి త్వరలోనే కార్యాలయం ప్రారంభిస్తారని తెలుస్తోంది. ఈ లోగా కొందరు ఏపీ నేతలను బీఆర్ఎస్ లో చేర్చుకోవాలని కేసీఆర్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోనూ బీఆర్ఎస్ తరఫున కార్యకలాపాలు మొదలయ్యాయి. బీఆర్ఎస్ విద్యార్థి, యువజన విభాగాలను ఏర్పాటు చేసేందుకు కొందరు ముందుకొచ్చారు. ఏపీ స్టూడెంట్స్, యూత్ జేఏసీకి చెందిన రాయపాటి జగదీష్ ఈ మేరకు ప్రకటన చేశారు.