China : చైనాలో కొవిడ్ మరణమృదంగం మోగిస్తోంది. డ్రాగన్ దేశంలో కరోనా పరిస్థితులను యూకేకు చెందిన హెల్త్డేటా విశ్లేషణ సంస్థ ‘ఎయిర్ఫినిటీ’ వెల్లడించింది. జీరో కొవిడ్ పాలసీని చైనా ఎత్తివేసిన తర్వాత రోజుకు సగటున 9వేల మరణాలు సంభవిస్తున్నాయని అంచనా వేసింది. ఈ లెక్కలు చెప్పేందుకు ‘ఎయిర్ఫినిటీ’ అనేక అంశాలను పరిశీలించింది.
చైనాలోని రీజనల్ ప్రావిన్స్ల్లో ఇన్ఫెక్షన్ల సంఖ్యను రిపోర్టు చేసే విధానంలో మార్పులకు ముందు నమోదైన గణంకాలు పరిగణనలోకి తీసుకుంది. గతంలో జీరో కొవిడ్ను పాటించిన దేశాల్లో ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత నమోదైన కేసుల రేటును విశ్లేషించింది. దీని ఆధారంగా ఈ అంచనాకు వచ్చింది. డిసెంబర్లోనే చైనాలో లక్ష మంది కొవిడ్తో మరణించి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేసింది. ఈ సమయంలో 1.8 కోట్ల కొవిడ్ కేసులు నమోదై ఉండొచ్చని అంచనా వేసింది. జనవరి నాటికి రోజువారీగా 34 లక్షల కేసులు రావొచ్చని వెల్లడించింది.
పలు దేశాల చైనా తీరుపై మండిపడుతున్నాయి. చైనా కొవిడ్ గణాంకాల్లో పాదర్శకత లేకపోవడంతో మెరుగైన నిర్ణయాలు తీసుకోవడం కష్టమవుతుందని బ్రిటన్కు చెందిన ‘బయోసైన్స్ రిసోర్స్ ప్రాజెక్ట్’ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జోనాథన్ లాథమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చైనా కొవిడ్ కేసుల సంఖ్యను దాచిపెట్టడం సమస్యను తీవ్రం చేస్తోందని ఆస్ట్రేలియా పత్రిక ‘న్యూస్.కామ్.ఏయూ’ పేర్కొంది. ప్రపంచంలోనే అతిపెద్ద కొవిడ్ అవుట్ బ్రేక్ ఉందని చైనా నేషనల్ హెల్త్ కమిషన్ ధ్రువీకరించిన విషయాన్ని వెల్లడించింది. డ్రాగన్ దేశంలో మార్చినాటికి 100 కోట్ల మందికి వైరస్ సోకవచ్చని పేర్కొంది. చైనాపై విమర్శలు పెరగడంతో ఇటీవల ఆ దేశ అధికారులు ప్రపంచ ఆరోగ్య సంస్థతో భేటీ అయ్యారు. చైనా నుంచి జన్యు సమాచారం, మరణాల వివరాలు, ఆసుపత్రుల్లో చేరుతున్న రోగుల గణంకాలు ఇవ్వాలని డబ్ల్యూహెచ్వో అధికారులు చైనాను కోరారు.
మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు చైనాపై ఆంక్షలు విధిస్తున్నాయి. తాజాగా చైనా నుంచి వచ్చేవారికి కొవిడ్ టెస్టుల్లో నెగెటివ్ రావాలని కెనడా స్పష్టం చేసింది. చైనా నుంచి వచ్చేవారిని తమ దేశంలోకి అనుమతించమని మొరాకో ప్రకటించింది. మొత్తంమీద చైనాలో వస్తున్న కరోనా కేసులతో ప్రపంచలోని చాలా దేశాలు అప్రమత్తమవుతున్నాయి.