సిద్దిపేట, స్వేచ్ఛ: మల్లన్న సాగర్ నిర్వాసితులను అన్ని రకాలుగా ఆదుకున్నామంటూ మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై బాధితులు మండిపడుతున్నారు. సోమవారం ఆర్ అండ్ ఆర్ కాలనీలో ఆందోళన చేపట్టారు. హరీష్ రావు దిష్టిబొమ్మను దహనం చేశారు ఆందోళన కారులు. దిష్టిబొమ్మను చెప్పులతో కొడుతూ నిరసన తెలిపారు.
మల్లన్న సాగర్ భూ బాధితులకు దేశంలో ఎక్కడా లేని విధంగా న్యాయం చేశామని హరీష్ రావు చెప్పడంపై మండిపడ్డారు. బలవంతంగా భూ సేకరణ చేసి, ఇప్పడు న్యాయం చేశామని గోప్పలు చెప్పడానికి పెస్ మీట్ పెట్టారంటూ ఫైరయ్యారు. హరీష్ రావు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన తెలిపారు నిర్వాసితులు. తమ దగ్గర భూమి తీసుకొని తమకు న్యాయం చేయలేదని మండిపడ్డారు.
మల్లన్నసాగర్ పేరులో అర్హత లేని వాళ్లు కోట్లు గడించారని భూమిచ్చిన తాము మాత్రం దోపిడీకి గురైయ్యామని కన్నీరుమున్నీరయ్యారు. గత ప్రభుత్వ పెద్దలు తమను నిలువునా దోచేశారని మల్లన్న సాగర్ నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు మాయ మాటలతో తమను మోసం చేశారని మండిపడ్డారు. తెలంగాణ వచ్చిన తర్వాత హరీష్ రావు ఆస్తులు పెరిగాయని ఆరోపించారు.
హరీష్ రావుపై మలన్న సాగర్ భూ బాదితులు ఫైరయ్యారు. గత ప్రభుత్వంలో తమకు నష్ట పరిహారం ఇచ్చామని చెబుతున్న ఆయన మాటల్లో ఏమాత్రం నిజం లేదని ఆరోపించారు. 2013 భూ సేకరణ ప్రకారంగా చెల్లింపులు జరిగాయంటున్న బీఆర్ఎస్ నేతలు చర్చకు రావాలని మల్లన్న సాగర్ నిర్వాసితులు సవాల్ చేశారు.