Rahul Gandhi : రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టిన తర్వాత దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో కొత్త జోష్ వచ్చింది. రాహుల్ ఇమేజ్ రోజురోజుకు పెరుగుతోంది. సామాన్యులతో ఆయన మమేకమవుతున్న తీరు అందర్నీ ఆకట్టుకుంటోంది. ఇలా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ పాదయాత్ర సాగిస్తున్న రాహుల్ కాంగ్రెస్ కు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో శివసేన నేత సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కొత్తచర్చకు దారితీశాయి.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నాయకత్వం 2022లో కొత్త వైభవం సంతరించుకుందని సంజయ్ రౌత్ పేర్కొన్నారు. ఈ వైభవం 2023లోనూ కొనసాగితే.. వచ్చే సాధారణ ఎన్నికల నాటికి దేశ రాజకీయాల్లో కొత్త మార్పు వస్తుందని జోస్యం చెప్పారు. ప్రతి ఆదివారం పార్టీ అధికారిక పత్రిక సామ్నాలో రాసే వ్యాసంలో ఈ విషయాన్ని సంజయ్ రౌత్ ప్రస్తావించారు. 2023లోనైనా భారత్ భయం గుప్పిట్లో నుంచి బయటపడాలన్నారు. రాహుల్ భారత్ జోడో యాత్ర విజయవంతమవ్వాలని ఆకాంక్షించారు.
మరోవైపు బీజేపీపైనా రౌత్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశంలో విద్వేష, విభజన విత్తనాలు నాటొద్దని హితవు పలికారు. సంకుచిత ఆలోచనా ధోరణిని విడనాడాలని మోదీ తరచూ చెబుతూ ఉంటారని కానీ ఆ వైఖరి బీజేపీలోనే అధికంగా ఉందన్నారు. విపక్ష పార్టీలకు ఉన్న హక్కుల్ని గుర్తించడానికి పాలకులు సుముఖంగా లేరని మండిపడ్డారు.
రామ మందిర నిర్మాణ అంశానికి పరిష్కారం దొరికిందని సంజయ్ రౌత్ తెలిపారు. ఈ అంశాన్ని ఆసరాగా చేసుకొని ఓట్లు అడిగే పరిస్థితులు లేవన్నారు. ఈ నేపథ్యంలో లవ్ జిహాదీ అనే అంశాన్ని బీజేపీ తెరపైకి తీసుకొచ్చిందని ఆరోపించారు. ఈ ఆయుధాన్ని వాడుకుని ఓ వర్గంలో భయాన్ని సృష్టించి తద్వారా ఎన్నికల్లో లబ్ధిపొందాలనుకుంటున్నారా? అని కాషాయ పార్టీని ప్రశ్నించారు. నటి తునీషా శర్మ, శ్రద్ధా వాకర్ హత్యలు లవ్ జిహాదీ హత్యలు కాదని తెలిపారు. మహిళలు ఏ వర్గానికి చెందిన వారైనా.. వారిపై దాడులు సరికాదన్నారు. మొత్తంమీద రౌత్ తన పాత మిత్రపక్షం బీజేపీని ఘాటుగా విమర్శిస్తూనే… రాహుల్ గాంధీ నాయకత్వం దేశానికి అవసరమని వివరించారు.