ఏలూరు, స్వేచ్ఛ: వైసీపీ అధికారంలో ఉండగా విర్రవీగిన బోరుగడ్డ అనిల్ కుమార్ పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయాడు. ఇప్పటికే పలు కేసుల్లో ఇరుక్కుని జైలుపాలైన ఆయనపై ఏలూరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఫిర్యాదు చేశారు. 2023లో అనిల్ తనను వ్యక్తిగతంగా దూషించారని చింతమనేని ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘మా పార్టీ తలుచుకుంటే నీ అంతు చూస్తుంది. మీ సామాజిక వర్గాన్ని ఖతం చేస్తాం’ అంటూ బెదిరించారని ప్రభాకర్ ఆరోపించారు. ఎమ్మెల్యే ఫిర్యాదుతో
బోరుగడ్డపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు బీజేపీ నేతలు కూడా గుంటూరు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నారు. గతంలో అమరావతి రైతులకు మద్దుతుగా వెళ్లిన ప్రస్తుత మంత్రి సత్యకుమార్పై దాడి అంశంపై బీజేపీ ఫిర్యాదు చేయనుంది. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో అనిల్ ఉన్నాడు.
ప్రభుత్వానిదే బాధ్యత
బోరుగడ్డ అనిల్ అరెస్ట్, వరుస ఫిర్యాదులపై ఆయన సతీమణి మౌనిక ఆవేదన వ్యక్తం చేశారు. ‘నా భర్తపై అక్రమ కేసులు బనాయించి, దుర్భాషలాడుతూ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనకు ఏ హాని జరిగినా ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి. ప్రభుత్వం ఆయనపై కక్ష గట్టి వేధిస్తోంది. జాతీయ ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేశాం. కమిషన్ తక్షణమే స్పందించి కేసును విచారించేందుకు ముందుకొచ్చింది. ఏదైనా తప్పు జరిగి ఉంటే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి. అంతేకానీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం ఎంతవరకు సబబు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిల్లలను నా భర్త ఎప్పుడు దూషించలేదు. నాకు కూడా పిల్లలు ఉన్నారు. అనిల్ ఎప్పుడూ ఆడపిల్లలపై అనుచిత వ్యాఖ్యలు చేయలేదు. రాజధానిలో మా పొలాలను ప్రభుత్వం అనధికారికంగా తీసుకోవడాన్ని అడ్డుకున్నామనే కక్షతో రౌడీషీట్ ఓపెన్ చేశారు’ అని మౌనిక వెల్లడించారు.