Sharmila on YS Jagan: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాల్సిన మాజీ సీఎం వైఎస్ జగన్, అందుకు భిన్నంగా ప్రధాని మోడీ ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటూ మోడీ వారసుడిగా గుర్తింపు పొందుతున్నట్లు తాను భావిస్తున్నానని ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. షర్మిళ చేసిన ఈ కామెంట్.. ప్రస్తుతం ఏపీలో పొలిటికల్ హాట్ టాపిక్ గా మారింది. దీనికి ప్రధాన కారణం.. మాజీ సీఎం జగన్, షర్మిళ అన్నా చెల్లెలు కావడమే.
ఏపీలో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేతబట్టిన షర్మిళ.. దివంగత ముఖ్యమంత్రి వైయస్సార్ కుమార్తెగా రాష్ట్ర ప్రజలందరికీ సుపరిచితమే. తన అన్న వైయస్ జగన్ వైసీపీని ఏర్పాటు చేసిన సమయంలో షర్మిళ (YS Sharmila) బ్యాక్ బోన్ అని చెప్పవచ్చు. జగన్ అరెస్ట్ సమయంలో.. నేనున్నా అంటూ రాష్ట్ర పాదయాత్ర నిర్వహించారు ఆమె. ఆ సమయంలో వైసీపీ నెంబర్-2 నేత షర్మిళ అనుకున్నారు అంతా. కానీ పార్టీ అధికారంలోకి రాగానే ఆమె సైడ్ అయ్యారు అలాగే సైలెంట్ అయ్యారు.
పొలిటికల్ గా రాణించాలని, ప్రజాసేవలో ఉండాలనే భావన ఉన్న షర్మిళ.. అనూహ్యంగా తెలంగాణలో కొత్త పార్టీ స్థాపించారు. మారిన రాజకీయ పరిణామాలతో ఆమె కాంగ్రెస్ వైపుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడే కాంగ్రెస్ వేసిన వ్యూహం ఫలించిందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఏపీలో అధికారంలో ఉన్న జగన్, ఎదురుతిరిగి పార్టీ ఏర్పాటు చేసుకోగా.. అన్నకు పోటీగా చెల్లెలిని రంగంలోకి దింపింది కాంగ్రెస్ అధిష్టానం. ఏపీ రాష్ట్ర కాంగ్రెస్ అద్యక్షురాలిగా ప్రకటించి.. ఆల్ పొలిటికల్ పార్టీస్ కి షాకిచ్చిందని చెప్పవచ్చు.
ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలో అన్ని నియోజకవర్గాలలో కాంగ్రెస్ అభ్యర్థులను నిలబెట్టడంలో షర్మిళ (YS Sharmila) విజయవంతమయ్యారు. కడప ఎంపీగా బరిలో నిలిచిన షర్మిళ (YS Sharmila) దురదృష్టవశాత్తు ఓటమి చవిచూసినా.. గట్టిపోటీ ఇచ్చారని చెప్పవచ్చు. కాగా తాజాగా మాజీ సీఎం జగన్ పరిపాలనపై షర్మిళ ఘాటు వ్యాఖ్యలు చేశారు. షర్మిళ మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి మానస పుత్రిక ఫీజు రీయింబర్స్మెంట్ పథకంను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మక పథకంగా ప్రవేశపెట్టిందన్నారు. పేద బిడ్డల జీవితాల్లో వెలుగులు నింపి, ఎంతో మంది ఇంజనీర్లను, డాక్టర్లను తయారు చేసిన గొప్ప పథకమన్నారు.
నాడు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని వైయస్సార్ అద్భుతంగా అమలు చేస్తే.. సొంత కొడుకై ఉండి జగన్ మోహన్ రెడ్డి తన హయాంలో పథకాన్ని నీరు గార్చారని విమర్శించారు. విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజులు రూ.3500 కోట్లు పెండింగ్ పెట్టడం నిజంగా సిగ్గుచేటని, బకాయిలు చెల్లించకుండా వారి జీవితాలతో చెలగాటం ఆడారన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులను మనోవేదనకు గురి చేశారని, దోచుకొని దాచుకోవడం మీద ఉన్న శ్రద్ధ, విద్యార్థుల సంక్షేమం మీద గత వైసీపీ ప్రభుత్వం దృష్టి సారించలేదన్నారు. వైయస్సార్ తన జీవితం మొత్తం మత పిచ్చి బీజేపీనీ వ్యతిరేకిస్తే.. అదే బీజేపీకి జగన్ దత్తపుత్రుడని ఘాటుగా విమర్శించారు.
బీజేపీతో చెట్టా పట్టాలు వేసుకొని తిరిగిన మోడీ వారసుడుగా జగన్ ను తాను భావిస్తున్నట్లు, అలాంటి వాళ్లకు వైయస్సార్ ఆశయాలు గుర్తుకు ఉంటాయని అనుకోవడం, ఆశయాలకు వారసులవుతారనడం పొరపాటు అవుతుందన్నారు. నాడు వైసీపీ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని నీరుగార్చి నిర్వీర్యం చేయాలని చూస్తే.. నేడు కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. వైసీపీ చేసింది మహా పాపమైతే.. కూటమి సర్కారు విద్యార్థులకు పెడుతున్నది శాపమని షర్మిళ వ్యాఖ్యానించారు. ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. బకాయిలు ఎవరు పెండింగ్ పెట్టినా.. అవి రిలీజ్ చేసే బాధ్యత ఇప్పుడు మీపై ఉందని, వెంటనే నిధులు విడుదల చేయాలని, పథకానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.
YSR మానస పుత్రిక ఫీజు రీయింబర్స్మెంట్ పథకం. మహానేత హయాంలో, కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన ఒక ప్రతిష్ఠాత్మక పథకం. పేద బిడ్డల జీవితాల్లో వెలుగులు నింపి, ఎంతో మంది ఇంజనీర్లను, డాక్టర్లను తయారు చేసిన గొప్ప పథకం.
నాడు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని YSR అద్భుతంగా అమలు చేస్తే.. సొంత కొడుకై…
— YS Sharmila (@realyssharmila) October 21, 2024