Cm MK Stalin On Childrens : కొత్తగా పెళ్లైన దంపతులు 16 రకాల ఆస్తులు పోగేసే బదులు 16 పిల్లలను ఎందుకు కనకూడదని ఎంకే స్టాలిన్ అన్నారు. నూతన జంటలు 16 రకాల ఆస్తులను పొందాలని పూర్వం పెద్దలు ఆశీర్వాదించేవారని, ప్రస్తుతం కాలంలో ఆస్తికి బదులుగా 16 మంది పిల్లలను కనాలని సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు.
31 జంటల కల్యాణం…
తమిళనాడులోని తిరువాన్మియూర్లోని మరుంధీశ్వరార్ ఆలయం కళ్యాణ మండపంలో సోమవారం 31 జంటల కల్యాణోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం స్టాలిన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం మాట్లాడిన ఎంకే స్టాలిన్, జనాభా నియంత్రణ విధానాలపై ఆవేదన వ్యక్తం చేశారు.
నిధుల్లోనూ తగ్గింపులే…
దక్షిణాది రాష్ట్రాలు పకడ్బందీగా బర్త్ కంట్రోల్ చేశాయని, దీంతో పార్లమెంటులో దక్షిణాది ప్రాతినిధ్యం తగ్గుతూ వస్తోందన్నారు. ఇందులో భాగంగానే నిధుల కేటాయింపులోనూ కోతపడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
జనాభా నియంత్రణ కారణంగా ఎంపీ సీట్ల సంఖ్య తగ్గిపోతోందని, పరిస్థితులకు తగ్గట్టుగా మారాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరూ 16 మంది పిల్లలను కనాలనే ఆలోచనతో ఉంటే బాగుంటుందన్న అభిప్రాయాన్ని స్టాలిన్ వ్యక్తం చేశారు.
దక్షిణాదిలే ముందున్నాయి…
ఇక కుటుంబ నియంత్రణలో విజయం సాధించిన దక్షిణ భారత్ రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్అన్నారు. కుటుంబ నియంత్రణ పథకాన్ని దక్షిణాది రాష్ట్రాలు సమర్థంగా అమలు చేశాయని గుర్తు చేశారు.
ఎంపీ సీట్లూ తగ్గింపే…
1988లో కేరళ, 1993లో తమిళనాడు, 2001లో ఆంధ్రప్రదేశ్, 2005లో కర్ణాటక జనాభా పెరుగుదల నియంత్రణలో మొదటి స్థానం పొందాయన్నారు. ఈ విజయాలు లోక్ సభ, రాజ్యసభ స్థానాలను తగ్గిస్తోందన్నారు. 2001లో వాజ్పేయీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు, 84వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా లోక్సభ సభ్యుల సంఖ్యను 2026 వరకు మార్పు చేయడానికి వీల్లేదని స్పష్టం చేసిందన్నారు.
ఇప్పటికీ వాటికే గతిలేదు…
2031 జనాభా లెక్కల మేరకు నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ ఉంటుందని చెప్పారు. అయితే 2021 జనాభా లెక్కలనే నేటికీ చేపట్టలేని దుస్థితి నెలకొందన్నారు. ఒకవేళ లెక్కిస్తే లోక్సభ సీట్ల కోసం వాటిని పరిగణలోకి తీసుకుంటారో లేదో వేచి చూడాల్సిన పరిస్థితి ఉందన్నారు.
Also Read : జైల్లో ఉన్న లారెన్స్ బిష్ణోయ్ తన గ్యాంగ్ను ఎలా ఆపరేట్ చేస్తున్నాడు? సినిమా కంటే కిక్ ఎక్కించే స్కెచ్!