Cm Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ పేరు చెబితే తెలుగు రాష్ట్రాల్లో అందరికీ గుర్తొచ్చేది నిండైన ఆత్మవిశ్వాసం, పట్టుదల. ఆ తర్వాత అంతకుమించిన ధైర్యం, సాహసాలు, వాడి వేడి ప్రసంగాలు. అలాంటి వ్యక్తి సాధారణ స్థాయి నుంచి ముఖ్యమంత్రి వరకు ఎదిగారంటే అందుకు అకుంఠితమైన దీక్ష తోడ్పాటు అందించింది.
వేగం దూకుడు ఆయన స్టైల్…
ఇక ఆయన ధైర్యం, తాగ్యం, వేగం, దూకుడే నేడు ఆయన్ను రాష్ట్రానికి నాయకుడిగా నిలబెట్టాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇటీవలే సీఎం రేవంత్, ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. అందులో భాగంగానే అక్కడి విద్యార్థులకు కీలక ఉపన్యాసం సైతం చేశారు. జీవితంలో గొప్ప పనులు చేయాలంటే రిస్క్ కూడా తీసుకోవాల్సి ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రిస్క్ తీసుకోకుండా లక్ష్యాలను సాధించలేమన్నారు.
ఈ లక్షణాలు ఉండాల్సిందే…
ఒక వ్యక్తి నాయకుడిగా ఎదగాలంటే, ఈ రెండు లక్షణాలు తప్పనిసరిగా ఉండాల్సిందేనన్నారు. ధైర్యం, త్యాగాలే అసలు సిసలైన నాయకత్వ లక్ష్యణాలు అని బోధించారు. ఈ మేరకు గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్కు చెందిన ఐఎస్బీ లీడర్ షిప్ సదస్సుకి అతిథిగా హాజరైన సీఎం, విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.
ఈ గొప్ప నేతలందరిదీ త్యాగమే
మహాత్మాగాంధీ, పండిత్ జవహార్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇందిరా గాంధీ, పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ లాంటి గొప్పవారంతా ధైర్యం, త్యాగం, సాహసాలు ప్రదర్శించిన వారేనని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇక దేశ రాజకీయాల్లో ఘనమైన చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ దేశానికి అనేక మంది జాతీయ స్థాయి నాయకులను అందించిందన్నారు.
గొప్ప గొప్ప నేతలెప్పుడూ ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారన్నారు. ఇదే సమయంలో తమ జీవితాలను కూడా త్యాగం చేసేందుకు వెనకాడబోరన్నారు.
గ్లోబల్ సిటీలతో పోటీ పడాలి…
ప్రజలతో నేరుగా కలిసి మాట్లాడే లక్షణం కలిగి ఉండాలని, ఎక్కడికి వెళ్లినా హైదరాబాద్, తెలంగాణ గురించి ప్రత్యేకంగా మాట్లాడాలని హితబోధ చేశారు. రాష్ట్రానికి పెట్టుబడుల కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ మహానగరం, భారత్ లోని నగరాలతోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచ నగరాలతో పోటీ పడాలన్నారు.
మంచి ఛాలెంజెస్ ఇస్తాం…
కాస్త కష్టమైన పని కావొచ్చని, కానీ అసాధ్యమయితే కాదని ధైర్యం నూరిపోశారు. ఇక చదువు అయిపోయాక కనీసం రెండు, మూడేళ్లు తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసే దిశగా ఆలోచించాలని సూచించారు. మీరు జీవితంలో ఎదిగేందుకు మంచి చాలెంజెస్ ఇవ్వగలుగుతామన్నారు.
లక్ష్యంపైనే గురిపెట్టండి…
ఇక తాజాగా గ్రూప్ 1 అంశంపైనా సీఎం రేవంత్ స్పందించారు. ప్రతిపక్షాల మాటల విని భవిష్యత్ ను పాడుచేసుకోవద్దని బితం పలికారు. మెయిన్స్ పరీక్షలు రాయనున్న అభ్యర్థులు తమ ప్రిపరేషన్ పై దృష్టి సారించాలని, అనవసర విషయాలతో విలువైన సమయం పాడుచేసుకోవద్దని కోరడం విశేషం. విపక్షాల మాయలో పడి దారితప్పకుండా, లక్ష్యంపైనే గురి పెట్టాలన్నారు.
పదేళ్ల తర్వాత మెయిన్స్…
రేపటి తెలంగాణ పరిపాలన అధికారులుగా, రాష్ట్ర పునర్మిర్నాణ కర్తలుగా ఉజ్వల భవిష్యత్ ఉన్న గ్రూప్ 1 మెయిన్స్ అభ్యర్థులందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పారు సీఎం. ఎట్టకేలకు పదేళ్ల తర్వాత తెలంగాణలో తొలిసారిగా మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. గతంలో పలుమార్లు ప్రిలిమ్స్ లో ఎన్నో అవాంతరాలు ఎదురయ్యాయి. కానీ ఈసారి మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ గ్రూప్ 1 నియమకాలు పూర్తి చేయాలన్న సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం ఉందనడంలో ఎలాంటి అతియోశక్తి లేదు.
Share