TTD : కలియుగదైవం శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి సాధారణ రోజుల్లో భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది. ఇక ప్రత్యేక పర్వదినాల్లో తిరుమలకు భక్తులు భారీగా పోటెత్తుతారు. అలాగే వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుమలకు తండోపతండాలుగా తరలివస్తారు. అందుకే భక్తల రద్దీకి అనుగుణంగా టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. జనవరి 2 నుంచి జనవరి 11 వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శన భాగ్యం కల్పించనుంది.
తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి తిరుపతిలో టోకెన్ల జారీ ప్రక్రియ ప్రారంభమైంది. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి టోకెన్ల జారీని ప్రారంభిస్తామని తొలుత టీటీడీ ప్రకటించింది. అయితే
భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో వేకువజామున 3 గంటల నుంచే టోకెన్లు అందిస్తున్నారు. దీంతో రద్దీ కాస్త తగ్గింది. నగరంలోని 9 కేంద్రాల ద్వారా స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు ఇస్తున్నారు. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, ఇందిరా మైదానం, రామచంద్ర పుష్కరిణి, జీవకోన జడ్పీ హైస్కూల్, విష్ణునివాసం, శ్రీనివాసం, బైరాగిపట్టెడలోని రామానాయుడు పాఠశాల, ఎమ్మార్పల్లి పోలీస్స్టేషన్ వెనుక శేషాద్రినగర్లోని జడ్పీ ఉన్నత పాఠశాల, గోవిందరాజస్వామి సత్రం, తిరుమల కౌస్తుభం విశ్రాంతి గృహంలో టోకెన్ల జారీ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
రోజుకు 45 వేలు చొప్పున వైకుంఠ ద్వార దర్శన టోకెన్లు కేటాయించారు. పది రోజులకు ఒకేసారి 4.5 లక్షల ఎస్ఎస్డీ టోకెన్ల పంపిణీని టీటీడీ చేపట్టింది. మొత్తం టోకెన్లు పూర్తి అయ్యే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. టోకెన్లు ఎన్ని ఉన్నాయో ఆ వివరాలు ఎప్పటికప్పుడు టీటీడీ వెబ్సైట్, ఎస్వీబీసీ ఛానల్ ద్వారా తెలుసుకొనేలా ఏర్పాట్లు చేశారు. టోకెన్ జారీ కేంద్రాల వద్ద భక్తుల కోసం అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. అన్నప్రసాదాలు, తాగునీరు, పాలు, టీ, కాఫీ అందిస్తున్నారు. మొత్తం 10 రోజులపాటు భక్తులకు వైంకఠ ద్వార దర్శనం కల్పిస్తారు. అందుకు అనుగుణంగా టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. భక్తుల రద్దీకి తగినట్లు సౌకర్యాలు కల్పిస్తోంది.