CJI Chandrachud Ayodhya Case| అయోధ్య రామజన్మభూమి – బాబ్రీ మసీదు కేసులో తాను దేవుని ముందు కూర్చొని సరైన తీర్పు కోసం ప్రార్థించానని, ఈ కేసులో తీర్పు కోసం తనకు ఓ మార్గం చూపమని ఆ భగవంతుడిని వేడుకున్నానని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ అన్నారు. రామజన్మభూమి – బాబ్రీ మసీదు కేసులో సుప్రీం కోర్టు 2019లో తీర్పు వెలువరించింది. రామజన్మభూమి – బాబ్రీ మసీదు వివాదం కేసులో అయిదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనంలో జస్టిస్ డివై చంద్రచూడ్ కూడా ఒకరు.
అయితే ఆదివారం అక్టోబర్ 20, 2024న జస్టిస్ డివై చంద్రచూడ్ పుణెలోని ఖేడ్ తాలుకా కాన్హెర్సార్ గ్రామంలో ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. “చాలా సార్లు మా (న్యాయమూర్తుల) ముందు కొన్ని క్లిష్టమైన కేసులు వస్తాయి. ఆ కేసుల్లో మేము త్వరగా ఒక నిర్ణయానికి రాలేము. అలాంటిదే అయోధ్య (రామజన్మభూమి – బాబ్రీ మసీదు) వివాదం కేసులో జరిగింది. నా ముందు ఈ కేసుల మూడు నెలలకు పైగా పెండింగ్ లో ఉంది. కానీ సమస్యకు సరైన పరిష్కారం ఏంటో కచ్చితంగా చెప్పడం చాలా కష్టంగా మారింది. అలాంటి సమయంలో నేను దేవుని ముందు కూర్చొని ప్రార్థించాను. ఆ కేసులో ఒక సరైన నిర్ణయం కోసం నాకు మార్గం చూపాలని ఆ భగవంతుడిని అడిగాను. నేను ప్రతి రోజు పూజ చేస్తాను. ఆ భగవంతుడిని నమ్మే వారికి ఆయనే ఓ దారి చూపిస్తాడు. ఇది నా నమ్మకం” అని చెప్పారు.
అయోధ్య రామజన్మభూమి – బాబ్రీ మసీదు వివాదం కొన్ని దశాబ్దాలు నడిచింది. ఈ కేసులో 16వ శతాబ్దం మొఘల్ చక్రవర్తి బాబర్ పేరిట అయోధ్యలో నిర్మించిన ఒక మసీదుని 1992 డిసెంబర్ లో హిందువులు ప్రధానంగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కూల్చివేయడం జరిగింది. ఆ మసీదు స్థానంలోనే భగవంతుడు రాముడు జన్మించాడని వారి వాదన.
Also Read: పండుగ రోజు విషాదం.. ఇడ్లీ తిని వ్యక్తి మృతి.. అత్యాశకు పోయి ఎన్ని తిన్నాడంటే?..
మసీదు కూల్చివేత కారణంగా ఆ సమయంలో దేశవ్యాప్తంగా మత ఘర్షణలు, అల్లర్లు జరిగాయి. సుప్రీం కోర్టులో కేసు రెండు దశాబ్దాలకు పైగా విచారణలో ఉంది. అయితే ఈ కేసుని నవంబర్ 2019న అప్పటి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని అయిదుగురు న్యాయమూర్తలతో కూడిన ధర్మసనం తీర్పు వెలువరించింది. వివాదిత స్థలాన్ని హిందువులకు కేటాయించి, ముస్లింలు మసీదు నిర్మించుకునేందుకు అయోధ్యలోనే మరో ప్రదేశంలో ఒక అయిదు ఎకరాల భూమిని కేటాయించడం జరిగింది.
ఆ తరువాత ఈ సంవత్సరం బాలరాముని మందిర నిర్మాణం అయోధ్యలో జరిగింది. విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో జనవరి 22, 2024లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరిగింది. ఆ తరువాత ప్రస్తుత సిజెఐ డివై చంద్రచూడ్ కూడా బాల రాముని దర్శనం కోసం అయోధ్య వెళ్లారు.
అయితే కార్యక్రమంలో జస్టిస్ చంద్రచూడ్ (Justice Chandrachud) ప్రతి ఒక్కరూ పర్యవరణ పరిరక్షణ కోసం పాటుపడాలని చెప్పారు. ఇది అన్ని సామాజిక వర్గాలకు వర్తిస్తుందని.. ఎందుకంటే ప్రకృతిని కాపాడే బాధ్యత అందరిపై ఉందని అన్నారు. అభివృద్ధి పేరుత మనిషి టెక్నాలజీ, ఫ్యాక్టరీల వెంట పడ్డాడు. దాని పర్యవరణంలో కాలుష్యం పెరుగుతోంది. అందరూ పర్యావరణాన్ని కాపాడేందుకు తమ వంతు కృషి చేయాలని.. లేకపోతే ప్రకృతి ప్రకోపానికి జాతి, మతం, ధనికులు, పేదవారు అని తేడా ఉండదని అన్నారు.