Significance of Mukkoti Ekadashi : సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. వైకుంఠంలో శ్రీమన్నారాయణుడి దర్శనం కోసం ముక్కోటి దేవతలు ఉత్తర ద్వారం వైపు వస్తారు. అప్పుడు శ్రీదేవి, భూదేవి సమేతుడై శ్రీ మహావిష్ణువు ఉత్తర ద్వారం వైపు వచ్చి ముక్కోటి దేవతలకు దర్శనమిస్తాడట. అందుకే దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ రోజున వైకుంఠ వాకిళ్ళు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాలలోని ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే భగవద్దర్శనార్థం వేచి ఉంటారు. ఈ రోజు విష్ణు అవతారంలోని దేవుడి దర్శనం చేసుకుంటే ఏడాది మొత్తం విద్య, ఉద్యోగా , వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధి సాధిస్తారని పురాణాలు చెబుతున్నాయి.
ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం, అమృతం రెండూ పుట్టాయి. శివుడు హాలాహలం మింగింది ఇదే రోజు, మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునునికి ఇదే రోజున ఉపదేశించాడని విశ్వాసం ఉంది.వైకుంఠ ఏకాదశి రోజు పూర్తిగా ఉపవాసం చేసి తులసి తీర్థం తప్ప ఏదీ తీసుకోకూడదు. ద్వాదశి నాడు అతిథి లేకుండా భుజించకూడదు. ఉపవాసం ఉద్దేశం దేవునికి దగ్గర కావడమే పూజ, జపం, ధ్యానం లేదా ఉపాసన మొదలైన సాధనల ద్వారా మనసును మాధవుడిపై లగ్నం చేయాలి. ముక్కోటి ఏకదాశి నాడు ఉపవాసం సంవత్సరం అంతా వచ్చే ఏకాదశుల్లో ఉపవాసం ఉన్నంత ఫలితం దక్కుతుందని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. అలాగే మూడు కోట్ల ఏకాదశుల్లో ఉపవాసం చేసిన ఫలితం కలుగుతుంది.
వైకుంఠ దశమి నాడు రాత్రి నిరాహారులై ఉండాలి. అలాగే ఏకాదశి రోజు మొత్తం ఉపవాసం చేయాలి. ఏ సందర్భంలోను అబద్దాలు చెప్పకూడదని, స్త్రీ సాంగత్యం పనికి రాదని శాస్త్రం చెబుతోంది. దుష్ట ఆలోచనలు చేయకూడదు. ఆ రోజు రాత్రంతా జాగరణ చేసి అన్నదానం చేయాలి. ఉపవాసం పూర్తిగా చేయలేని వాళ్లు పాలు, పండ్లు స్వీకరిస్తూ ఉపవాసం చేయవచ్చు.అలా కూడా చేయలేని వాళ్లు ఉడకబెట్టని పదార్దాలు స్వీకరిస్తూ ఉపవాసం చేయచ్చని వాయు పురాణం చెబుతోంది. ఇంట్లో పూజ చేసుకునే వాళ్లు వెండి ప్రమిదలో ఆవు నెయ్యి వేసి మూడు ఒత్తులతో దీపాన్ని వెలిగించాలి. లక్ష్మీనారాయణుడి చిత్రపటం ఉంటే గంధం, కుంకుమ బొట్లు పెట్టి తెల్లగన్నేరు పువ్వులు, నంది వర్థనం పువ్వులు, జాజి పువ్వులతో స్వామికి పూజ చేయాలి. ఇవేమీ లేకపోతే తులసి దళాలు స్వామి వారికి సమర్పించి నమస్కరించుకోవాలి. రుమల శ్రీవారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకుంటే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం.