Jagan vs Sharmila: వైసీపీలో ఏం జరుగుతోంది? అంతర్గత విభేదాలను పరిష్క రించుకునే పనిలో అధినేత జగన్ పడ్డారా? కర్ణాటక కాంగ్రెస్ పెద్దలతో రాయబారం సక్సెస్ అయ్యిందా? ఆస్తుల్లో సగ భాగం ఇచ్చేందుకు జగన్ ఓకే చెప్పారా? ఇకపై ఏపీలో వైసీపీ-కాంగ్రెస్ కలిసి.. కూటమిపై ఎదురుదాడికి దిగుతాయా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
తెలుగులోని ఓ ప్రధాన పత్రిక ఓ వార్తా కథనాన్ని ప్రచురించింది. నాలుగు ముక్కల్లో చెప్పాలంటే తండ్రి వైఎస్ఆర్ సంపాదించిన ఆస్తిలో సగ భాగం చెల్లి వైఎస్ షర్మిలకు ఇచ్చేందుకు జగన్ అంగీకరించాడన్నది అందులోని సారాంశం.
బెంగుళూరు వేదికగా జగన్ చేసిన రాయబారం ఫలించిందని, తండ్రి సంపాదించిన ఆస్తుల పంపకానికి రాజీ పడ్డారని తాటికాయంత అక్షరాలతో రాసుకొచ్చింది. కాంగ్రెస్తో దోస్తీ కోసం చెల్లితో జగన్ రాజీ పడ్డారని పేర్కొంది. దీనికి వెనుక కర్ణాటక కాంగ్రెస్ పెద్దలు ఉన్నారన్నది అంతర్గత సారాంశం.
ఏపీలో అధికారం కోల్పోయాక దిక్కుతోచని స్థితిలోపడ్డారు మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్. చంద్రబాబు సర్కార్ ఎడాపెడా కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు జగన్. వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా మారిన నేతలు సైతం నోరు ఎత్తలేని పరిస్థితి నెలకొంది. ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ అండ లేకపోవడంతో జగన్ పనైపోయిందని భావించారు.
ALSO READ: నారా లోకేష్కు పెరిగిన బాధ్యతలు.. పార్టీతోపాటు, ప్రభుత్వ వ్యవహారాల్లో..
బీజేపీ పెద్దలతో మాట్లాడే సాహసం చేయలేకపోతున్నారు జగన్. కాంగ్రెస్ వైపు వెళ్లాలన్నా, చెల్లి షర్మిల నుంచి అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఇక్కడే తన బుర్రకు పదునుపెట్టారు మాజీ సీఎం. చెల్లి వ్యవహారాన్ని కూల్గా డీల్ చేస్తే కాంగ్రెస్తో జతకట్టేందుకు అడ్డంకులు తొలుగుతాయని భావిస్తున్నారట.
షర్మిల కోరిన విధంగానే వాటా ఇవ్వడానికి జగన్ అంగీకరించినట్టు వార్తలు వస్తున్నాయి. జగన్ తన మాట నిలబెట్టుకుంటే కాంగ్రెస్కు దగ్గరవ్వడం ఖాయం. ఇంతకీ వైసీపీని కాంగ్రెస్లో విలీనం చేస్తారా? అన్న ప్రశ్న వైసీపీ నేతల్లో అప్పుడే మొదలైంది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో కూటమి సర్కార్ను ఎదుర్కోవాలంటే కచ్చితంగా కాంగ్రెస్తో జత కట్టాల్సిన అవసరం జగన్కు ఉంది. లేదంటే యువజన శ్రామిక పార్టీ అయిపోయినట్టేనని అంటున్నారు. చెల్లి వ్యవహారం బయటకు పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారట జగన్. ఒకవేళ కాంగ్రెస్తో దగ్గరైనట్టు తెలిస్తే.. ఆస్తుల కేసు వేగం కావచ్చని జగన్ ఆలోచనగా చెబుతున్నారు.
మోదీ సర్కార్పై కాంగ్రెస్ గట్టి ఫైట్ చేస్తోంది. ఆ పార్టీకి ప్రజల్లో రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. ఇప్పుడే కాంగ్రెస్ వైపు మొగ్గు చూపితే, ఎన్నికల ముందుకు మరింత రిలాక్స్ కావచ్చని భావిస్తున్నారట జగన్. కర్ణాటక కాంగ్రెస్ పెద్దలు సైతం ఈ ఆలోచనను జగన్ ముందు పెట్టినట్టు తెలుస్తోంది.
ఇంతకీ పార్టీని జగన్ విలీనం చేస్తారా? లేకపోతే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్తో కలిసి బరిలోకి దిగుతారా అన్న ప్రశ్నలకు త్వరలో సమాధానం రానుంది. జగన్ నాలుగు అడుగులు వెనక్కి వేశారంటే అది ముమ్మాటికీ సీఎం చంద్రబాబు చలవే. కూటమి సర్కార్ కఠినంగా వ్యవహరించకుంటే.. జగన్ లొంగేవారు కాదన్నది ఆయన అంతరంగికుల మాట.