GO 317 : కేసీఆర్ ప్రభుత్వంలో 317 జీవో ఎన్నో వివాదాలకు కారణమైంది. స్కూళ్లలో పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులు రోడ్డెక్కి నిరసనలు చేపట్టారు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడారు. ఎన్నికల సమయంలో 317 జీవో బాధితులకు అండగా ఉంటామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం, అధికారం చేపట్టాక సమస్య పరిష్కారం కోసం కేబినెట్ సబ్ కమిటీ వేసింది. తాజాగా, ఆ కమిటీ నివేదికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేసింది.
సుదీర్ఘ చర్చల తర్వాత
కేబినెట్ సబ్ కమిటీకి రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధ్యక్షత వహించారు. సభ్యులుగా మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ వ్యవహరించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో పాటు నిష్ణాతులైన మేధావులతో సుదీర్ఘంగా చర్చించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల అభిప్రాయాలను సేకరించారు. వినతుల రూపంలో ప్రత్యక్షంగా, వెబ్సైట్ ద్వారా అప్లికేషన్స్ను స్వీకరించి సమస్య పరిష్కారం అయ్యేలా రిపోర్ట్ సిద్ధం చేశారు. తుది నివేదిక పత్రాలను సీల్డ్ కవర్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి అందజేశారు.
ALSO READ : నిరుద్యోగులు గులాబీ మాయలో పడొద్దు – ఎమ్మెల్సీ కోదండరాం
గాంధీ భవన్లోనూ మంతనాలు
ఈమధ్య 317 బాధితులను గాంధీ భవన్కు పిలిచి మాట్లాడారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్. త్వరలోనే సమస్యను పరిష్కారిస్తామని హామీ ఇచ్చారు. 317 జీవో తీసుకొచ్చిన వారే ఇప్పుడు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. పలు కారణాల వల్ల సమస్య పరిష్కారం వాయిదా పడిందని, కమిటీ అనేక అంశాలపై అధ్యయనం చేస్తోందని అన్నారు. ఇది జరిగిన కొద్ది రోజులకే తుది నివేదికను సిద్ధం చేసి సీఎంకు అందించింది కేబినెట్ సబ్ కమిటీ.
అసలేంటీ వివాదం?
కేసీఆర్ పాలనలో కొత్త జోన్ల వ్యవస్థ అమల్లోకి వచ్చాక, కొత్త జిల్లాలకు, జోన్లకు, మల్టీ జోన్లకు ఉద్యోగులను సర్దుబాటు చేశారు. ఈ క్రమలోనే 2021 డిసెంబర్ 6న 317 జీవోను జారీ చేశారు. దీనివల్ల పాత జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్లలోని ఉద్యోగులు, కొత్త జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్లలో తాము కోరుకున్న చోటకు వెళ్లే ఆప్షన్ ఇచ్చారు. సీనియారిటీ కండిషన్ పెట్టారు. దివ్యాంగులు, వితంతువులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారికి కొంత వెసులుబాటు కల్పించారు. అయితే, దీనివల్ల స్థానికత సమస్య ఏర్పడింది. గతంలో సొంత జిల్లా నుంచి వేరే జిల్లాకు బదిలీ అయితే, కొన్నాళ్లకైనా సొంత జిల్లాకు వెళ్తామన్న ఆలోచన చేసేవారు ఉద్యోగులు. కానీ, 317 జీవోతో పర్మినెంట్గా కొత్త జిల్లాలకు వెళ్లాల్సి వస్తుందని, సొంత ఏరియాల్లో కాకుండా పరాయి జిల్లాల్లోనే బతకాల్సి వస్తుందని ఉద్యోగులు నిరసన బాేట పట్టారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.