MLC kodandaram : గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళనలను ఉద్దేశించి ఎమ్మెల్సీ కోదండరాం కీలక వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ జిల్లా జేఏసీ తరపున టీఎన్జీవో సమావేశంలో ఆయనకు అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ, పదేళ్లు పరిపాలించిన బీఆర్ఎస్ ఏనాడూ నిరుద్యోగులను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు.
ఆనాడు పట్టించుకోని కేసీఆర్, కేటీఆర్ ఇప్పుడు కల్లబొల్లి మాటలతో నిరుద్యోగులను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక, ఉద్యోగాల భర్తీకి తొలి ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి అన్ని చర్యలు తీసుకుందని, ఇటీవల డీఎస్సీ నోటిఫికేషన్తో పాటు, ఎన్నో ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందని వివరించారు.
నిరుద్యోగుల ఆందోళనలను, సూచనలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికీ గుర్తిస్తుందన్నారు కోదండరాం. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ వల్లే రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య రెట్టింపు అయిందని ఆరోపించారు. గ్రూప్ 1 అభ్యర్థులను రెచ్చగొట్టే ధోరణిలో కేటీఆర్ వ్యాఖ్యలు ఉన్నాయని, అటువంటి మాటలను మానుకోవాలని కోదండరాం సూచించారు. అసలు, గ్రూప్ 1 పరీక్షల గురించి మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్, కేటీఆర్లకు లేదని, అభ్యర్థులు కూడా జీవో 55, 29ల అమలు వెనుక కోర్టు సూచనలు ఉన్నాయన్న సంగతిని తెలుసుకోవాలని చెప్పారు.
ALSO READ : గ్రూప్ 1 అభ్యర్థులకు ప్రభుత్వం భరోసా
కాంగ్రెస్ పార్టీ నిరంతరం నిరుద్యోగ సమస్యపై పోరాడుతూనే ఉంటుందని తెలిపారు. యువతను బీఆర్ఎస్ నేతలు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని, అటువంటి వాటిని సహించకుండా చట్టరీత్యా చర్యలు తీసుకునేలా ప్రభుత్వం అడుగులు వేయాలని సూచించారు. గత ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి తీసుకున్న చర్యలు, ఇచ్చిన నోటిఫికేషన్లు ఎన్నో అందరికీ తెలుసని మండిపడ్డారు. ఉద్యోగాల భర్తీ మీద ఎన్ని సార్లు అడిగినా వివరాలు ఇవ్వలేదని గుర్తు చేశారు. జీవో 55, 29ల అమలు వెనుక కోర్టు సూచనలున్నాయన్న సంగతి తెలుసుకోవాలని సూచించారు.