Online Nikah: గత కొంతకాలంగా భారత్, పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇరు దేశాల మధ్య ఎలాంటి సంబంధాలు కొనసాగడం లేదు. పొరుగుదేశం భారత్ మీద చీటికి మాటికి బురద జల్లే ప్రయత్నం చేయడంతో భారత సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఆదేశంతో ఎలాంటి దౌత్య, వర్తక, వ్యాపార సంబంధాలు ఉండవని ప్రకటించింది. కానీ, రెండు దేశాలకు చెందిన యువతీ యువకుల పెళ్లి సంబంధాలు కుదురుతున్నాయి. తాజాగా యూపీకి చెందిన ఓ బీజేపీ నాయకుడు తన కుమారుడికి పాకిస్తాన్ అమ్మాయితో నిఖా జరిపించాడు. ఆన్ లైన్ వేదికగా ఈ వివాహం జరిపించడం సంచలనంగా మారింది.
వీసా దొరక్కపోవడంతో ఆన్ లైన్ వివాహం
ఉత్తరప్రదేశ్ లోని జౌన్ పూర్ కు చెందిన బీజేపీ నాయకుడు, కార్పొరేట్ అయిన తహషీన్ షాహిద్ తన పెద్ద కొడుకు మహమ్మద్ అబ్బాస్ హైదర్ కు పాకిస్తాన్ లోని లాహోర్ కు చెందిన బంధువుల అమ్మాయి అండ్లీప్ జహ్రాతో ఎంగేజ్ మెంట్ జరిపించారు. పెళ్లి కోసం పాకిస్తాన్ కు వెళ్లేందుకు వెళ్లేందుకు అబ్బాస్ హైదర్ వీసాకు అప్లై చేసుకున్నాడు. కానీ, ఇరు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తతలకారణంగా అతడికి వీసా దొరకలేదు. మరోవైపు పెళ్లి కూతురు తల్లి రాణా యాష్మిన్ జైదీ అనారోగ్యంతో హాస్పిటల్ లో చేరారు. ఈ నేపథ్యంలో పెళ్లి ఆపడం సరికాదని భావించి ఆన్ లైన్ వేదికగా పెళ్లి జరిపించాలని భావించారు. తహసీన్ ఈ విషయాన్ని వధువు కుటుంబ సభ్యులకు చెప్పారు. వారు కూడా సరే అని చెప్పడంతో ఆన్ లైన్ వేదికగా పెళ్లి వేడుక నిర్వహించారు. మతపెద్ద మౌల్వీ వారి వివాహాన్ని దగ్గరుండి నిర్వహించారు.
వీసా వచ్చాక భారత్ లోకి అడుగు పెట్టనున్న అండ్లీప్
ఈ పెళ్లికి ఇరు కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు హాజరయ్యారు. వరుడి బంధువులు జౌన్పూర్ కు రాగా, వధువు బంధువులు లాహోర్ లోని పెళ్లి కూతురు ఇంటికి వెళ్లారు. అందరి సమక్షంలో ఈ పెళ్లిని ఘనంగా జరిపించారు. పెళ్లి కూతురుకు వీసా లభించిన తర్వాత ఆమె యూపీలోని అత్తారింట్లో అడుగు పెట్టనుంది. తన భార్య అండ్లీప్ కు భారత వీసా తప్పకుండా వస్తుందని అబ్బాస్ హైదర్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
తహసీన్ ను అభినందించిన బీజేపీ నాయకులు
పాక్ లోని బంధువుల అమ్మాయితో తన కొడుకు పెళ్లి చేసిన బీజేపీ కార్పొరేటర్ తహసీన్ ను పలువురు బీజేపీ నాయకులు అభినందించారు. బీజేపీ ఎమ్మెల్సీ బ్రిజేష్ సింగ్ ప్రిషూ సహా ఇతర బీజేపీ నాయకులు ఈ పెళ్లి వేడుకకు హాజరై వరుడి కుటుంబానికి శుభాకాంక్షలు తెలిపారు. వివాహ జీవితాన్ని సంతోషంగా గడపాలని ఆకాంక్షించారు. దేశాల మధ్య ఉద్రిక్తతలు ఉన్నా, ప్రజల మధ్య మంచి సంబంధాలు ఉండాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇలాంటి వివాహల ద్వారా ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడితే బాగుంటుందన్నారు.
Read Also: వీళ్లేం మగాళ్లండి బాబు, భార్యలు అలా చేస్తే కొట్టేస్తారట.. మీరు ఇంతేనా?