Corona : భారత్లో ఒమిక్రాన్ ఉపరకం కేసు వెలుగుచూసింది. XBB.1.5 తొలి కేసు గుజరాత్లో బయటపడినట్లు ఇన్సాకాగ్ వివరాల్లో వెల్లడైంది. ప్రస్తుతం అమెరికాలో కరోనా కేసుల పెరుగుదలకు ఈ సబ్ వేరియంటే కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎక్స్బీబీ.1.5 వేరియంట్ వల్ల వారం వ్యవధిలోనే అమెరికాలో కేసులు 21.7 శాతం నుంచి 41 శాతం పెరిగాయని యూఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది. ఈ వైరస్ కేసులతో న్యూయార్క్లో ఆస్పత్రుల్లో చేరుతున్నవారి సంఖ్య పెరుగుతోంది.
ఒమిక్రాన్కు చెందిన రెండు వేర్వేరు బీఏ.2 సబ్- వేరియంట్ల సమ్మేళనమైన ‘ఎక్స్బీబీ’ రూపాంతరమే ‘ఎక్స్బీబీ.1.5’. దీన్ని సూపర్ వేరియంట్గా పిలుస్తున్నారు. అదనపు మ్యుటేషన్ కారణంగా మానవ శరీరంలోని కణాలను అంటిపెట్టుకునే లక్షణం ఈ వైరస్ కు అధికంగా ఉందని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయ వైరాలజిస్ట్ ఆండ్రూ పెకోస్జ్ తెలిపారు. బీక్యూ, ఎక్స్బీబీ సబ్ వేరియంట్లతో పోల్చితే రోగనిరోధకతను ఏమార్చే సామర్థ్యం ఎక్కువ ఉందని పేర్కొన్నారు. ఈ వైరస్ కు వ్యాప్తి అవకాశాలు ఎక్కువేనని అంటువ్యాధుల నిపుణుడు ఎరిక్ ఫీగల్-డింగ్ ట్వీట్ చేశారు.
రోగనిరోధక శక్తిని ఏమార్చే బలమైన వేరియంట్లలో ఇదీ ఒకటి. మానవ శరీరంలో ప్రవేశించడం, కణాలపై వేగంగా దాడి చేస్తుంది. పాత ఎక్స్బీబీ లేదా బీక్యూ రకాల కంటే చాలా వేగంగా వ్యాపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఉపరకం ప్రబలంగా ఉన్న చోట్ల ఆసుపత్రుల్లో చేరికలు పెరుగుతున్నాయి.
గుజరాత్లో మొదటి ఎక్స్బీబీ.1.5 కేసు గుర్తించడంతో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలో ప్రస్తుతం 275కుపైగా ఎక్స్బీబీ కేసులు ఉన్నాయి. దీంతో ఎక్స్బీబీ.1.5 ఉపరకంపై దృష్టి సారించారు. ఇది ఎక్స్బీబీ రూపాంతరమే కాబట్టి.. కొన్ని మార్పులు ఉండొచ్చని సమాచారం. ఏదేమైనా వైరస్ నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని 100 శాతం జీనోమ్ సీక్వెన్సింగ్ నిర్వహిస్తున్నామని రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.