Rahul Gandhi : కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ఆధివారం ఝార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీపై విమర్శల పర్వాన్ని ఎక్కుపెట్టారు. ఆదివాసీలపై కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని ధ్వజమెత్తారు.
రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిందే…
ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల నేరథ్యంలో ‘సంవిధాన్ సమ్మాన్ సమ్మేళన్’ను రాంచీలో నిర్వహించారు. ఈ మేరకు రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్షాలపై ఆయన ఘాటుగా మాట్లాడారు. రాజ్యాంగంపై అన్ని వైపుల నుంచి నిరంతరం దాడి జరుగుతోందన్నారు. అయితే ఇందులో ప్రధాని మోదీ సహా హోం మంత్రి అమిత్ షా ఉన్నారని కుండబద్దలు కొట్టారు.
ఆదివాసీలంటే ఎవరు…
అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి కేంద్రంలోని ప్రభుత్వ పెద్దలు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఎందుకు ఆహ్వానించలేదని రాహుల్ నిలదీశారు. బడా బడా పారిశ్రామికవేత్తలను మోదీ సర్కార్ ఆహ్వానించిందని, కానీ ఒక ఆదివాసి మహిళా, రాష్ట్రపతిగా ఉన్నా సరే పిలవలేదన్నారు.
ఆది నుంచి, మొదటి నుంచి ఉన్నవారే…
కొత్తగా ఆదివాసీలను, వనవాసీలని అంటున్నారని, అసలు ఆదివాసి అంటే ఆది నుంచి, మొదటి నుంచి ఉన్నవారు అని అర్థం కదా. మరి వనవాసి అంటే ఏంటి. అటవీ ప్రాంతంలో జీవించేవారు అని అర్థం కదా. ఘన చరిత్ర కలిగిన ఆదివాసీల వారసత్వాన్ని, చరిత్రను, సంప్రదాయాలను, వైద్య విధానాలను బీజేపీ ధ్వంసం చేస్తోందన్నారు.
కుల గణనను ఆపుతారా …
ఎన్నికల్లో భాగంగా రాహుల్ గాంధీ కుల గణనపైనా మాట్లాడారు. రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని తొలగించడానికి తాము ప్రయత్నిస్తున్నామన్నారు. దీన్ని ఏ శక్తీ అడ్డుకోలేదని సవాల్ చేసి మరీ చెప్పారు. సామాజిక ఎక్స్-రే పొందేందుకు ఉపయోగపడే ఒక సాధనం పేరే కులగణన అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నారన్నారు. దేశవ్యాప్తంగా కులగణన, రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని తొలగించడాన్ని తమను ఆపేందుకు ఏ శక్తీ లేదన్నారు. మీడియా, న్యాయ వ్యవస్థ మద్దతులేనప్పటికీ తాను ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని హామీ ఇచ్చారు.
నవంబర్ 23న భవితవ్యం…
శాసనసభకు ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటించాక, తొలిసారిగా ఝార్ఖండ్లో రాహుల్ గాంధీ పర్యటించారు. ఇక్కడ రెండు దశల్లో ఎన్నికలు సాగనున్నాయి. నవంబర్ 13, 20 తేదీల్లో పోలింగ్ జరగనుంది. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
మోదీ సర్కార్ అధీనంలోనే…
అన్ని వైపుల నుంచి భారత రాజ్యాంగంపై దాడి జరుగుతోందని, దాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థలను, ఎన్నికల కమిషన్, సీబీఐ, ఈడీ, ఐటీ, ప్రభుత్వ అధికారులతో పాటు న్యాయశాఖను కూడా మోదీ సర్కారే నియంత్రిస్తోందని రాహుల్ విమర్శలు సంధించారు.
Also Read : దారి తప్పుతున్న పబ్ కల్చర్.. అమ్మాయిలు డ్యాన్స్ చేస్తే ఏకంగా..!