CM Revanth on Hydra: సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల తన ప్రసంగంలో హైడ్రాను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే సీఎం చేసిన వ్యాఖ్యలపై హైడ్రా అధికారులు సైతం స్పందించి.. తాజాగా ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనతో.. కొందరిలో ఉన్న పలు ఆందోళనలకు తెరపడినట్లయింది.
హైదరాబాదులోని చెరువుల పరిధిలో గల అక్రమ కట్టడాలను తొలగించేందుకు తెలంగాణ ప్రభుత్వం, హైడ్రాను ప్రవేశపెట్టింది. ఎఫ్టిఎల్, బఫర్ జోన్ పరిధిలలో గల అక్రమ కట్టడాలను తొలగించడమే హైడ్రా ముఖ్య ఉద్దేశం. దీనికి ప్రధాన కారణం భవిష్యత్తులో భారీ వరదలు తలెత్తినప్పుడు.. వరద నీరుకు చోటుదక్కని పరిస్థితుల్లో నగర జనాభాకు పెను ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉంది. అందుకే హైడ్రా ద్వారా.. చెరువుల పరిధిలో గల ఆక్రమణలను తొలగించడమే ధ్యేయంగా ప్రభుత్వం ముందడుగు వేసింది.
తొలుత హైదరాబాద్ ప్రజలలో కొంత వ్యతిరేకత కనిపించినా.. సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు కేవలం ఆక్రమణదారులు ఆక్రమించుకున్న భవనాలను మాత్రమే తొలగించడం జరుగుతుందన్నారు. అది కూడా ముందుగా నోటీసులు జారీ చేయడం, ఆ తర్వాత తగిన కాలవ్యవధి ఇవ్వడం, అనంతరమే భవనాలను కూల్చివేత కార్యక్రమాన్ని హైడ్రా కొనసాగిస్తుందన్నారు. హైదరాబాద్ నగరవాసుల రక్షణ కొరకే చెరువుల ఆక్రమణలను తొలగిస్తున్నట్లు సీఎం చెప్పిన నేపథ్యంలో.. ప్రజలలో కూడా మార్పు వచ్చిందని చెప్పవచ్చు.
రానురానూ హైడ్రాకు ప్రజల నుండి మద్దతు లభిస్తుండగా, బీఆర్ఎస్ మాత్రం హైడ్రా లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తోంది. రాష్ట్రంలో హైడ్రాతో రియల్ ఎస్టేట్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని, రాష్ట్ర ఆర్థిక మూలాలను కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బతీసిందంటూ బీఆర్ఎస్ విమర్శించింది. ఈ విమర్శలపై తాజాగా సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. హైదరాబాదులో రియల్ ఎస్టేట్ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయిందన్న అవాస్తవాలు ప్రచారం చేయడం తగదన్నారు. హైడ్రా వ్యవస్థతో అనుమతులు ఉన్న వెంచర్లకు ఎలాంటి భయం అవసరం లేదని, రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందేందుకు తన వంతు సహకరిస్తానన్నారు.
Also Read: CM Reventh Reddy: హైదరాబాద్ను రోల్ మోడల్గా మార్చాలి: సీఎం రేవంత్ రెడ్డి
సీఎం ఈ మాట ప్రకటించిన మరుసటి రోజు హైడ్రా సైతం ప్రకటన విడుదల చేసింది. రియల్ ఎస్టేట్ పై సీఎం ఇచ్చిన ఆదేశాలను తాము తప్పక పాటిస్తామని, అనుమతులు ఉన్న వెంచర్లకు ఎలాంటి ఢోకా ఉండదన్నారు. చెరువుల సమీపంలో అనుమతులు ఉన్న నిర్మాణాలను కూల్చి వేయడం జరగదని, అలాంటి ప్రచారాలు నమ్మవద్దని హైడ్రా ప్రకటించింది. సీఎం ఆదేశాలకు హైడ్రా కట్టుబడి ఉంటుందని, ప్రజలు అనవసర భయాందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. ఈ ప్రకటనతో అనుమతులు ఉన్న వెంచర్లకు ఎటువంటి ఇబ్బందులు ఉండవన్న విషయాన్ని హైడ్రా భరోసా కల్పించింది.