Tirumala Tickets Issue: నాకే పాపం తెలియదు. నన్ను టార్గెట్ చేసి ఎవరో కుట్ర పన్నుతున్నారు. నాకు ఈ విషయంపై ఎన్నో అనుమానాలు ఉన్నాయంటూ ప్రకటించారు ఏపీ శాసనమండలి డిప్యూటీ చైర్ పర్సన్ జకియా ఖానమ్. తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని, తాను ఎటువంటి అవినీతికి పాల్పడలేదని ఆమె అన్నారు.
అయితే తాజాగా బెంగుళూరుకు చెందిన సాయి కుమార్ అనే భక్తుడు.. తన వద్ద బ్రేక్ దర్శనం సిఫార్సు లేఖ కోసం రూ.65 వేలు తీసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. మొత్తం పది టికెట్ల కోసం భక్తుడు సంప్రదించగా.. ఒక్కో టికెట్ రూ.10 వేలకు విక్రయించినట్లు, ముందుగా రూ. 65 వేలు తీసుకున్నారని, ఉదయం నుండి అన్ని మాధ్యమాలో వైరల్ అవుతోంది. అయితే బయట ధరల కంటే తన వద్ద ఎక్కువగా డబ్బులు తీసుకున్నారనే కారణంతో, సిఫార్సు లేఖ ఇచ్చిన ఎమ్మెల్సీ జకియా ఖానమ్, ఆమె పీఏ, మరొకరిపై కూడా టీటీడీ అధికారులకు ఫిర్యాదు చేశాడు ఆ భక్తుడు. దీనితో షాక్ తిన్న టీటీడీ అధికారులు సైలెంట్ గా విచారణలో భాగంగా.. తిరుమల వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదుదారుల వద్ద పూర్తి వివరాలు తెలుసుకున్న పోలీసులు వెంటనే చంద్రశేఖర్, ఎమ్మెల్సీ జకియా ఖానమ్, కృష్ణ తేజలపై కేసు నమోదు చేశారు. ఏకంగా శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లు విక్రయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటూ సాక్షాత్తు ఎమ్మెల్సీపై కేసు నమోదు కావడం సంచలనంగా మారింది. అయితే తాజాగా తనపై వచ్చిన ఆరోపణలు, ఫిర్యాదు పట్ల డిప్యూటీ చైర్ పర్సన్ జకియా ఖానమ్ స్పందించారు.
తనకు దర్శనం టికెట్ల వివాదానికి సంబంధించి ఎటువంటి సంబంధం లేదన్నారు. అలాగే తనకు ఎవరూ పీఆర్ఓ లు లేరని , తనపై కుట్ర జరుగుతోందని జకియా ఖానమ్ తెలిపారు. అలాగే తన పేరును ఎవరో ఉపయోగించినట్లు తాను భావిస్తున్నానని, అనవసరంగా తనను కేసుల్లో ఇరికించే ప్రయత్నం జరుగుతున్నట్లు భావిస్తున్నానన్నారు.
ఇది ఇలా ఉంటే జకియా ఖానమ్ వైసీపీ ఎమ్మెల్సీ అంటూ మీడియాలో జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చాక, జకియా ఖానమ్ వెళ్లి మంత్రి నారా లోకేష్ ను కలిశారని, తమ పార్టీ కార్యకలాపాలలో కూడా ఆమె పాల్గొనడం లేదన్నారు. ఎమ్మెల్సీ జకియా ఖానమ్ ఎప్పుడో పార్టీ వీడినట్లు తెలిపారు. ఈ విషయాన్ని మీడియా గమనించాలని బొత్స కోరారు.