Bandi Sudhakar : మూసీ నది పునరుజ్జీవం అంశంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ చేసిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ అంతా ఆత్మస్తుతి, పరనింద లాగా ఉన్నదని టీపీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్ విమర్శించారు. హైదరాబాద్ గాంధీభవన్లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ వాస్తవాలను వక్రీకరించి, అవాస్తవాలను వల్లెవేస్తూ, తెలంగాణ సమాజాన్ని తప్పుదోవ పట్టించాలని ఏకపాత్రాభినయం చేసేందుకు ప్రయత్నించినా, అది అట్టర్ ప్లాప్ అయిందని ఎద్దేవా చేశారు.
ALSO READ:శవాలు మిస్సింగ్.. మాయా లేదు మర్మం లేదు.. ఆ మిస్టరీ వెనుక ఉన్నది ఎవరంటే?
ఇదీ తెలియదా?
ప్రభుత్వాలు ప్రాజెక్టును ప్రారంభించే ముందే ప్రాధాన్యతలను తెలియజేస్తే, నిపుణులు విధి,విధానాలను, పునరావాస ప్యాకేజీలను, బడ్జెట్ అంచనాలను రూపొందించి నివేదిక సమర్పిస్తారని, తర్వాత ప్రభుత్వం ఆ నివేదికపై పూర్తిస్థాయి సమీక్ష జరిపి పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తుందన్నారు. పదేళ్లు మంత్రిగా ఉన్న కేటీఆర్ కు ఈ మాత్రం తెలియదా ? అని సుధాకర్ గౌడ్ చురకలు అంటించారు. కుర్చీ పోయాక కేటీఆర్ ఏదేదో మాట్లాడుతున్నాడని, ఆయన మాటలు జనం పట్టించుకోవటం లేదని తేల్చిపారేశారు.
ఇంత అహంకారమా?
అనంతగిరి నుంచి కృష్ణలో కలిసే వరకు 3.25 లక్షల ఎకరాలకు నీరిస్తున్న నదిని మురికికూపమని, దాన్ని పట్టించుకోవాల్సిన పనేలేదన్నట్లు కేటీఆర్ మాట్లాడటం అతని అహంకారం తప్ప మరొకటి కాదని బండి మండి పడ్డారు. మూసీకి రూ.లక్షా 50 వేల కోట్లు ఖర్చు అంటూ కేటీఆర్ చెబుతున్న మాటలు గోబెల్స్ ప్రచారం తప్ప మరోటి కాదన్నారు. కేటీఆర్ మంత్రిగా ఉన్నపుడు మూసీపై ఎఫ్టీఎల్, బఫర్ జోన్లు ఫిక్స్ చేసి, నిర్వాసితులకు టీడీఆర్ బాండ్లు, డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలనుకున్నది నిజం కాదా? అని బండి నిలదీశారు.