Nalgonda water issue : ముఖ్యమంత్రి మూసీ పునరుజ్జీవానికి పాటు పడుతుంటే హరీష్, కేటీఆర్ అడుగడుగునా అడ్డుపడుతున్నారని, నల్గొండ బాగుపడటం వారికి ఇష్టం లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ… కాళేశ్వరం, మిషన్ కాకతీయ, భగీరథ ఇంకా ఏవో పేర్లు చెప్పి 7 లక్షల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. పదేళ్లు తెలంగాణను దోచుకున్న కేటీఆర్, హరీష్ రావులు పార్లమెంటు ఎన్నికల తర్వాత కూడా ఇంకా తెలంగాణలో తిరిగి, నోటికొచ్చింది మాట్లాడటం చూస్తేంటే రోత కలుగుతోందని మంత్రి విమర్శించారు.
ALSO READ:గ్రూప్-1 లొల్లి – నీ చీకటి బతుకు బయటపెడతా.. కేటీఆర్ కామెంట్స్పై బీజేపీ నేత బండి సంజయ్ ఫైర్
మంచినీళ్లివ్వలే..
తెలంగాణ వచ్చాక ఫ్లోరైడ్ సమస్య పరిష్కారం కోసం అదిచేస్తాం.. ఇదిచేస్తాం అని చెప్పిన కేటీఆర్ ఏమీ చేయకుండా కాలం గడిపారని మంత్రి విమర్శించారు. ఆనాడే 25 వేల కోట్లు ఖర్చు చేసి ఉంటే ఈ సమస్య శాశ్వతంగా పరిష్కారమయ్యేదని, ఏమీ చేయకుండా ఇవాళ తలకాయ లేని మాటలు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. పదేపదే కాంగ్రెస్ వంద అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిందని మాట్లాడుతున్న కేటీఆర్ తమ పాలన చూసి సిగ్గు తెచ్చుకోవాలన్నారు. కాంగ్రెస్ నోటికొచ్చిన హామీలివ్వలేదని, ఇచ్చిన మాటను ఖచ్చితంగా నెరవేర్చుతోందని స్పష్టం చేశారు. ఎంత కష్టం అయినా నెల మొదటి రోజే ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నామని గుర్తుచేశారు.
నీ ఐడెంటిటీ ఏదీ?
తెలంగాణలో కేటీఆర్ అంటే ఎవడికీ తెలియదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎద్దేవా చేశారు. అధికారం కోల్పోయినా కేటీఆర్కు అహంకారం తగ్గలేదన్నారు. పదేళ్ల పాలనలో ఎక్కడ పెట్టుకోవాలో తెలియనంత డబ్బులు సంపాదించారంటూ మండిపడ్డారు. నల్గొండ మంత్రులు రెచ్చగొడితే రెచ్చి పోరని, తమకు సొంత వ్యక్తిత్వం, పౌరుషం ఉందని స్పష్టం చేశారు. కేటీఆర్, హరీష్కు దండుకోవటం తప్ప రాజకీయం ఏమిటో తెలియదని తేల్చి చెప్పారు. నారాయణ సంస్థల్లో హరీష్కు వాటా ఉందని తెలిపారు. అమెరికా వెళ్లి ప్రభాకర్ రావును కలిసి కాళ్ళు పట్టుకుని మరీ ఇండియాకు రావొద్దని బ్రతిమిలాడినట్లు తెలిపారు. కిషన్ రెడ్డికి ఏమీ తెలియదని.. ఆయన నాయకుడే కాదని, ఆయన గురించి మాట్లాడం వేస్ట్ అంటూ కామెంట్స్ చేశారు. ఇకనైనా మూసీపై ఇలాగే వ్యవహరిస్తే, కేటీఆర్ ఇంటిదగ్గర నిరసన చేపడతానని హెచ్చరించారు.
సీఎంను అభినందిస్తున్నా..
ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం ఎస్ఎల్బీసీ నిర్మాణమేనని, ఎస్ఎల్బీసీ, మూసీ శుద్ధీకరణ విషయంలో ముఖ్యమంత్రిని అభినందిస్తున్నట్లు తెలిపారు. ఒక వైపు ఫ్లోరైడ్, మరోవైపు కోటిన్నర మంది వాడిన నీరు నల్గొండలో పారుతోందన్నారు. గత ప్రభుత్వం ఎస్ఎల్బీసీలో 5 వేల కోట్లు దోచుకుతిన్నారని మండిపడ్డారు. నల్గొండలో అనారోగ్యం బారిన పడిన వారు చాలా మంది ఉన్నారని.. ఎన్నో వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఎస్టీపీలతో సమస్య పరిష్కారం కాదని.. స్వచ్ఛమైన నీరు ఇవ్వాలని మంత్రి తెలిపారు.