CM Revanth on Group 1: హైదరాబాద్ లో గత రెండు రోజులుగా గ్రూప్-1 అభ్యర్థులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. అయితే మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలన్న ప్రధాన డిమాండ్ తో అభ్యర్థులు నిరసనను ఉధృతం చేశారు. అలాగే తమ డిమాండ్ల పరిష్కారానికి మద్దతు ఇవ్వాలని, మాజీ మంత్రి కేటీఆర్ కు అభ్యర్థులు ట్వీట్ చేశారు కూడా. దీనిపై కేటీఆర్ కూడా స్పందించి మద్దతు పలికిన విషయం కూడా తెలిసిందే. అంతేకాదు ఇదే గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళన చివరకు కేంద్ర మంత్రి బండి సంజయ్ వర్సెస్ మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మాటల యుద్దానికి కూడా దారి తీసింది. అయితే గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళనపై తాజాగా సీఎం రేవంత్ కూడా స్పందించారు.
వాయిదా పడితే మీకే నష్టం.. సీఎం
గ్రూప్-1 పరీక్ష వాయిదా పడితే విధ్యార్థులకు నష్టం వాటిల్లుతుందని, ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. అలాగే ఒకసారి నోటిఫికేషన్ విడుదలయ్యాక, నిబంధనలు మార్చడం సరికాదని, నోటిఫికేషన్ సమయంలోనే జీవో 29 తెచ్చామన్నారు. ఒకసారి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత నిబంధనలు మారిస్తే కోర్టులు ఆ ప్రకటనను రద్దుచేసే ప్రమాదం ఉంది. జీవో 55 ప్రకారం పోతే.. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు నష్టం జరిగేదని, గ్రూప్-1 మెయిన్స్లో 1:50కి కూడా రిజర్వేషన్లు పాటిస్తున్నామని గుర్తుచేశారు. కొందరు కావాలనే అభ్యర్థులను రెచ్చగొడుతున్నారన్నారు. విపక్షాలకు చెందిన నాయకులు వేసే ట్రాప్లో అభ్యర్థులు పడొద్దని సీఎం కోరారు. డీఎస్సీ ముందు కూడా ఇలాగే గందరగోళం సృష్టించారని, మరలా డీఎస్సీ అభ్యర్థులు తమకు ఉద్యోగాలు దక్కిన అనంతరం ఆనందం వ్యక్తం చేశారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక, గత పదేళ్లు పాలించిన పాలకులు, ఒక్క గ్రూప్-1 నోటిఫికేషన్ కూడా నిర్వహించలేదన్నారు. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించి, కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న పరీక్షకు సహకరించాలన్నారు.
ఒక్క లాఠీ దెబ్బ కూడా తగలవద్దు.. సీఎం రేవంత్
ఆందోళన చేస్తున్న అభ్యర్థులపై ఒక్క లాఠీ దెబ్బ కూడా పడకూడదని సీఎం రేవంత్, పోలీసులకు సూచించారు. గ్రూప్-1 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులపై కేసులు నమోదైతే, కెరీర్ కు నష్టం వాటిల్లుతుందని, అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలన్నారు. అలాగే అభ్యర్థులపై ఒక్క లాఠీ దెబ్బ పడ్డా.. సహించనని, కేసులు కూడా నమోదు చేయవద్దని పోలీసులకు సీఎం సూచించారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూడాలని, ప్రశాంత వాతావరణానికి భంగం కలగకుండా పోలీస్ అధికారులు చూడాలన్నారు.
కాగా.. గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష నిర్వహణకు సీఎం రేవంత్ సర్కార్ ఏర్పాట్లు పూర్తి చేసింది. దీనితో ఈనెల 21 నుంచి 27 వరకు మెయిన్స్ పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే పరీక్షలు పటిష్ట పోలీస్ బందోబస్తు నడుమ జరిపేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ప్రకటించారు. ఇక అభ్యర్థులు కూడా పరీక్షలకు సన్నద్దం కావాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది. మరి సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపుకు ఆందోళన చేస్తున్న అభ్యర్థులు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి.