జీఓ నెం 55 అమలుకు డిమాండ్…
తెలంగాణ ఏర్పాటైన పదేళ్ల తర్వాత తొలిసారిగా మెయిన్స్ పరీక్షలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మేరకు పరీక్షలకు అంతా రెఢీ అవుతోంది. నిరుద్యోగులు జీఓ 29ను రద్దు చేయాలంటూ పట్టుబట్టారు. ఇదే సమయంలో జీఓ నెం. 55ను అమలు చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తూ ఆందోళనలకు దిగుతున్నారు. దీంతో నగరంలోని పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది.
స్టోరీ ఏంటంటే…
గ్రూప్ 1 మెయిన్స్కు తెలంగాణ సర్కారు ఏర్పాట్లు పూర్తి చేసింది. దీంతో ఈనెల 21 నుంచి 27 వరకు మెయిన్స్ పరీక్షలు జరగాల్సి ఉంది. ఎటువంటి పొరపాట్లు లేకుండా పరీక్షలు పటిష్ట బందోబస్తు నడుమ జరిపించేందుకు చర్యలు తీసుకున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వెల్లడించారు.
ఇక గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష తుది కీలో తప్పులున్నాయని, ఫలితంగా పరీక్షను రద్దు చేయాలన్న డిమాండ్ ఊపు అందుకుంది. ఈ క్రమంలోనే మెయిన్స్ను నిలుపుదల చేయాలని కోరుతూ హైకోర్టు డివిజన్ బెంచ్లో అప్పీలు దాఖలైంది. ఫైనల్ కీలో తప్పులు ఉండటం సహా పలు కారణాలతో ప్రాథమిక పరీక్షను రద్దు చేయాలన్న పిటిషన్ ను సింగిల్ జడ్జి బెంచ్ కొట్టేసింది.
దీంతో సింగిల్ బెంచ్ ఆదేశాలను సవాలు చేస్తూ అప్పీల్ పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై విచారణ చేపట్టిన హైకోర్టు డివిజన్ బెంచ్ వాటినీ కొట్టివేస్తూ చివరి నిమిషంలో పరీక్ష రద్దు సాధ్యంకాదని సూచించింది. ఇలాంటి సమయంలో పరీక్షల వాయిదాకు ఆదేశాలు ఇవ్వలేమని హైకోర్టు ధర్మాసనం స్పష్టనిచ్చింది. ఫలితంగా గ్రూప్ 1 పరీక్షలకు గ్రీన్ సిగ్నల్ లభించినట్టైంది.