Rahul Gandhi : భారత్ జోడో యాత్ర చేపట్టిన తర్వాత సరికొత్త రాహుల్ గాంధీ కనిపిస్తున్నారు. గతంలో ప్రత్యర్థులపై ఆచితూచి మాట్లాడేవారు. కానీ ఇప్పుడు దూకుడు పెంచారు. తనపై చేస్తున్న విమర్శలకు గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు. ముఖ్యంగా బీజేపీపై తగ్గేదేలే అంటూ ఎటాక్ చేస్తున్నారు. భారత్ జోడో యాత్ర నుంచి విరామం తీసుకున్న రాహుల్..శనివారం ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో BJP, RSSపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
భారత్ జోడో యాత్ర తాను కేవలం యాత్రగానే ప్రారంభించానని ఇది ప్రజల గొంతుక అవుతుందని ఇప్పుడు తెలుసుకున్నానని రాహుల్ అన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలకు తాను కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నానని చెప్పారు. వారు ఎంతగా టార్గెట్ చేస్తే.. అంతగా దృఢంగా మారుతానని స్పష్టం చేశారు. వారు మరింత దూకుడుగా విమర్శలు సాగించాలని కోరుకుంటున్నానని అన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ను గురువుల్లా భావిస్తానని సెటైర్లు వేశారు. వారిని చూసే ఎలా ఉండకూడదో.. ఎలాంటి పనులు చేయకూడదో నేర్చుకుంటున్నానని స్పష్టం చేశారు.
భద్రతా ఉల్లంఘనల వ్యవహారంపై రాహుల్ స్పందించారు. తాను బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో వెళ్లాలని కేంద్ర హోంశాఖ చెబుతోందని అలా ఎలా చేయగలను? అని ప్రశ్నించారు. అది ఎలా సాధ్యమని నిలదీశారు. కానీ భద్రత విషయంలో కావాలనే రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ఏ కారణం లేకపోవడంతో భద్రతా నిబంధనలను ఉల్లంఘిస్తున్నానని తనపై కేసులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ యాత్రలు చేసినప్పుడు ఎలా భద్రత ఇస్తున్నారు? అని ప్రశ్నించారు. ఇప్పటివరకు భారత్ జోడో యాత్ర విజయవంతంగా సాగిందని రాహుల్ తెలిపారు. ప్రజలు కొత్త మార్గంలో ఎలా ఆలోచించాలో చెప్పేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. భారత్ జోడో యాత్ర దేశ భావోద్వేగాలకు సంబంధించిందని, తనకు చాలా విషయాలు నేర్పిందని అన్నారు. తాను ఊహించిన దానికంటే ఎక్కువే నేర్చుకున్నట్లు వివరించారు.
పాదయాత్రలో తాను ధరించిన టీషర్టుపై ఎందుకంత రగడ అని రాహుల్ ప్రశ్నించారు. తనకు చలి అంటే భయం లేదన్నారు. పెద్దగా చలి అనిపించలేదని అందుకే స్వెటర్ వేసుకోలేదని తెలిపారు. ఒకవేళ చలి ఎక్కువైతే స్వెటర్ గురించి ఆలోచిస్తానని స్పష్టం చేశారు. ఈ యాత్రలో ఉత్సాహంగా ఉండటం వెనుక ఉన్న సీక్రెట్ పై ఓ వీడియో విడుదల చేస్తానని రాహుల్ గాంధీ ప్రకటించారు.
2024లో ప్రతిపక్షాలన్నీ ఏకమైతే బీజేపీ గెలవడం కష్టమని రాహుల్ జోస్యం చెప్పారు. ప్రతిపక్షాలు ప్రత్యామ్నాయ విజన్తో ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. తన దృష్టంతా విద్వేషం, ఆగ్రహావేశాలపై పోరాడటమేనని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.