ED Raids Ex-MP: తెలుగు రాష్ట్రాల్లో ఈడీ దూకుడు పెంచిందా? ఓ వైపు హైదరాబాద్.. మరోవైపు విశాఖపట్న రియల్టర్లపై ఫోకస్ చేసిందా? లేటెస్ట్గా విశాఖ మాజీ ఎంపీ వైసీపీ నేత ఎంవీవీ సత్యనారాయణ ఇంట్లో ఈడీ సోదాలు చేపట్టింది. భూకబ్జాలు ఆరోపణల నేపథ్యంలో సోదాలు చేస్తున్నట్లు సమాచారం.
శుక్రవారం సాయంత్రానికి విశాఖ చేరుకున్నారు ఈడీ అధికారులు. శనివారం ఉదయం లాసన్స్ బే కాలనీలోని ఎంవీవీ సత్యనారాయణ ఇంట్లోనే ఫస్ట్ ఫ్లోర్లో తనిఖీలు చేపట్టారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు. అటు మధురువాడ లోని ఎంవీవీ సిటీ ఆఫీసులో సోదాలు చేస్తున్నారు. మాజీ ఎంపీతోపాటు ఆడిటర్ జీవీ ఇంట్లో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు ఈడీ అధికారులు.
ఎంవీవీ సత్యనారాయణకి చెందిన హైగ్రీవా ఇన్ఫ్రాటెక్ కార్యాలయాల్లోనూ తనిఖీలు చేస్తున్నారు. ఏకకాలంలో ఐదు చోట్ల సోదాలు చేస్తున్నారు. ముఖ్యంగా మధురవాడ భూమి కొనుగోలు కేసుతోపాటు రూ.12.5 కోట్ల లావాదేవీల వ్యవహారంలో ఎంవీవీపై ఈడీ కేసు నమోదు అయ్యింది. వాటిపై ఫోకస్ చేసినట్టు సమాచారం.
ఈడీ సోదాల విషయం తెలియగానే వైసీపీ నేతలు ఉలిక్కిపడ్డారట. పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత, అధినేతకే కాదు తమకు కష్టాలు మొదలయ్యాయని అంటున్నారు. వైసీపీ ఓటమి తర్వాత రాజకీయా ల నుంచి వైదొలగాలని ఎంవీవీ భావించారట. కాకపోతే కొన్ని కారణాల వల్ల సైలెంట్ అయిపోయారు.
ALSO READ: విశాఖ.. అధికారుల మొద్దు నిద్ర, ప్రభుత్వాలు మారినా మారని తీరు.. మంత్రి లోకేష్ ఆకస్మిక తనిఖీలు
ఒక్కసారి వెనక్కి వెళ్తే.. విశాఖలో భూముల కబ్జా వ్యవహారంలో విజయసాయిరెడ్డిపై ఎంవీవీ సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెల్సిందే. ఈ క్రమంలో విజయసాయిరెడ్డి మళ్లీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్గా రావడం, ఎంవీవీ ఇంటిపై ఈడీ సోదాలు చేయడంపై ఆయన మద్దతుదారుల్లో అనుమానాలు మొదలయ్యాయి.