YS Jagan Vs YS Sharmila: హరియాణాలో ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలకు భిన్నంగా బీజేపీ గెలిచింది. దాంతో అక్కడ ఈవీఎంలను మేనేజ్ చేసి గెలిచారు అని విమర్శలు వస్తున్నాయి.. ఇక హర్యానా ఫలితాల మీద వైసీపీ అధ్యక్షుడు జగన్ సోషల్ మీడియాలో ట్వీట్ చేసి హరియాణాలో జరిగినట్లే ఏపీలో జరిగిందంటున్నారు. ఈవీఎంల టాంపరింగ్పై జగన్తో పాటు విజయసాయిరెడ్డి కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ పోస్టులు పెట్టారు. మళ్లీ బ్యాలెట్ విధానం రావాలని కూడా జగన్ డిమాండ్ చేశారు. అదంతా ఇండియా కూటమి దగ్గరవ్వడానికే అన్న అభిప్రాయం వ్యక్తమైంది. అయితే జగన్ ట్వీట్లపై కాంగ్రెస్ పెద్దలు ఎవరూ స్పందించలేదు. షర్మిల మాత్రం జగన్ స్టేట్మెంట్ను తప్పుపడుతుండటం హాట్ టాపిక్గా మారింది.
ఏపీలో వైసీపీ 2019 ఎన్నికల్లో అనూహ్యంగా 151 సీట్లతో అధికారంలోకి వచ్చినప్పుడు ఈవీఎంల టాంపరింగ్పై రకరకాల అనుమానాలు వ్యక్తమయ్యాయి . అప్పట్లో టీడీపీ నేతలు సైతం ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేశారు. దాంతో మీడియా ముందుకు వచ్చిన వైసీపీ అధ్యక్షుడు జగన్ ఈవీఎంపై బటన్ నొక్కితే వీవీ ప్యాడ్పై ఏ పార్టీకి ఓటేశామో స్పష్టం అవుతుందని.. అందుకే ఓటేసిన 80 శాతం జనాభాలో ఒక్కరు కూడా కంప్లైంట్ చేయలేదని గొప్పగా చెప్పుకొచ్చారు. అంతేనా అసలు ఈవీఎంలతో పోలింగ్ ప్రారంభమయ్యే ముందు మాక్ పోలింగ్ నిర్వహిస్తారని.. అన్ని పార్టీల ఏజెంట్లు అక్కడ ఉంటారని అటువంటప్పుడు టాంపరింగ్ ఎలా సాధ్యమని ప్రశ్నించారు.
ఇక ఇప్పుడు హరియాణా ఎన్నికల్లో వరుసగా మూడోసారి బీజేపీ విజయం నమోదు చేసింది. కౌంటింగ్ ప్రారంభంలో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నప్పటికీ.. 90 స్థానాలకు గాను 37 స్థానాలకే పరిమతమైంది. అయితే, ఈ ఫలితాలపై కాంగ్రెస్ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈసీ పనితీరుతో పాటు ఈవీఎంలపైనా పలు ఆరోపణలు చేస్తున్నారు. ఇండియా కూటమికి దగ్గరవ్వాలని చూస్తున్న వైసీపీ అధ్యక్షుడు జగన్ సైతం కాంగ్రెస్తో గొంతు కలుపుతున్నారు. ఎన్నికల్లో పేపర్ బ్యాలెట్ పద్దతి ఫాలో అవ్వాలని ట్వీట్లు చేస్తున్నారు. ఈవీఎంల వ్యవహారంలో అనుమానాలను బయటపెడుతూ.. పలు పార్టీలను సైతం మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. పలు దేశాల్లో సైతం పేపర్ బ్యాలెట్ పద్దతిని కొనసాగిస్తున్నారని ఎగ్జాంపుల్స్ కూడా చెబుతున్నారు.
Also Read: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేదు.. మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన
వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఘోర పరాజయం పాలై నాలుగు నెలలు గడిచింది. ఇప్పటికీ ఆ పార్టీ ఓటమికి కారణాలను విశ్లేషించుకోవడం లేదు. అసలు ఓటమిని అంగీకరించడానికి ఇష్టపడటం లేదు. ఇప్పటికీ వైసీపీ అధినేత జగన్ సహా ఆ పార్టీ నేతలు తమ పార్టీ ఓటమికి ఈవీఎంల ట్యాంపరింగే కారణమని చెబుతున్నారు. ఘోర పరాజయం పాలైన నాలుగు నెలల తరువాత కూడా ఈవీఎంలనే నిందిస్తుండటంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. జగన్తో పాటే తాజాగా ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆంధ్రప్రదేశ్ లో ఈవీఎంలు ట్యాంపర్ అయ్యాయని ఎక్స్ వేదికగా ఆరోపించారు.
ప్రస్తుతమున్న రాజకీయ పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమికి శత్రువుగా మారిని వైసీపీకి ఇండియా కూటమే దిక్కుగా కనిపిస్తుంది. అందుకే కాంగ్రెస్కు దగ్గరవ్వడానికి జగన్ తెగ తాపత్రయపడుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఆ క్రమంలో ఆయన హరియాణా ఫలితాలపై కాంగ్రెస్ అభిప్రాయంలో ఏకీభవిస్తూ ఈవీఎంలపై అనుమానాలతో ట్వీట్ పెట్టారంటున్నారు.. అదే సమయంలో బీజేపీకి వ్యతిరేకంగా ఆయన గొంతు విప్పినట్లు అయింది. హరియాణా ఫలితాల తర్వాత ఇండియా కూటమి పార్టీల నుంచే కాంగ్రెస్ వాదనకు సపోర్ట్ రాలేదు. ఈ నేపథ్యంలో జగన్ ఇచ్చిన స్టేట్మెంట్ ఒక విధంగా బూస్ట్ ఇచ్చినట్లే అనుకోవాలి. అయితే కాంగ్రెస్ పెద్దలు జగన్ స్టేట్మెంట్ను పరిగణలోకి తీసుకున్నట్లు కనిపించలేదు.
అయితే పీసీసీ చీఫ్ షర్మిల మాత్రం జగన్ అభిప్రాయంపై తీవ్రంగా స్పందించారు. హరియాణా, ఏపీ రెండూ ఒక్కటి కావని ఆమె తనదైన శైలిలో ఝలక్ ఇచ్చారు. హర్యానాలో అన్ని సర్వేలు కాంగ్రెస్ గెలుస్తుందని తేల్చి చెప్పాయని కానీ ఫలితాలు వేరేగా వచ్చాయని అందుకే కాంగ్రెస్ అక్కడ పోరాడుతోందన్నారు. ఏపీలో అయితే కేవలం వైసీపీ చేయించుకున్న సొంత సర్వేలు తప్ప మిగిలినవి అన్నీ కూడా కూటమి గెలుస్తుందనే వచ్చాయని ఆమె తేడా ఎత్తి చూపారు. జగన్ ఓటమిని జనాలే రాశారు తప్ప ఈవీఎంలపై అపోహలు పెట్టుకోవద్దని చెప్పకనే చెప్పారు.
షర్మిల తాజా వ్యాఖ్యలతో జగన్పై కాంగ్రెస్ వైఖరి ఏంటో స్పష్టమైందంటున్నారు. పీసీసీ ప్రెసిడెంట్గా ఆ చెల్లెమ్మ తన అన్న పార్టీకి ఇండియా కూటమిలో చోటు లేదని క్లారిటీ ఇచ్చేస్తున్నారు. మొత్తానికి అటు ఎన్డీయేకు కాకుండా ఇటు ఇండియా కూటమికి లేకుండా జగన్ మధ్యలో ఉండిపోవడం ఖాయంగా కనిపిస్తుంది.