Oneplus offline sales : గ్యాడ్జెట్ లవర్స్కు వన్ ప్లస్ ప్రొడక్ట్స్కు సంబంధించి గుడ్ న్యూస్ అందింది! దిగ్గజ స్మార్ట్ ఫోన్ తయారీ అయిన ఈ వన్ ప్లస్ సంస్థకు సౌత్ ఇండియన్ ఆర్గనైజ్డ్ రీటైలర్స్ అసోసియేషన్ (ఓఆర్ఏ)తో ఉన్న వివాదాలు తొలిగాయి. లో- మార్జిన్తో పాటు తమ మధ్య ఉన్న ఇతర సమస్యలను పరిష్కరించుకున్నట్టు ఓఆర్ఏ తెలిపింది. ఈ విషయాన్ని తెలుపుతూ ఓ ప్రకటనను విడుదల చేసింది. వినియోగదారులకు, రీటైలర్లకు, వన్ ప్లస్ పార్ట్నర్స్కు భారీగా లబ్ధి చేకూరుస్తుందని ఓఆర్ఏ ఆశాభావం వ్యక్తం చేసింది.
ఇక ఈ విభేదాలు తొలగడం వల్ల దేశ వ్యాప్తంగా ఉన్న ఓఆర్ఏ మెంబర్స్ ఇకపై వన్ ప్లస్ ప్రాడక్ట్స్ను కొనుగోలు చేసి డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. అలాగే వినియోగదారులు కూడా ఓఆర్ఏ నెట్వర్క్ ద్వారా వన్ ప్లస్కు సంబంధించిన గ్యాడ్జెట్స్ను కొనచ్చు. పండగ సీజన్ టీమ్లో రీటైల్ స్టోర్స్లో వన్ప్లస్ సేల్స్ రీ స్టార్ట్ అవ్వడం వ్యాపారులకు, వినియోగదారులకు మంచి విషయంగా టెక్ వర్గాలు భావిస్తున్నాయి.
“నిర్మాణాత్మక చర్చలు, పరస్పర సహకారం ద్వారా మా మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించుకున్నాము. ఫలితంగా వన్ప్లస్తో తాత్కాలికంగా ఉన్న సమస్యలు తొలిగిపోయాయి.” అని ఆర్గనైజ్డ్ రీటైలర్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఈ నిర్ణయం అక్టోబర్ 1 నుంచే అమల్లోకి వచ్చిందని తెలిపింది.
ALSO READ : ఇన్స్టాలో సరికొత్త ఫీచర్ – సింగిల్ ట్యాప్లో నచ్చిన సాంగ్తో చిల్!
” మా సభ్యులు, వినియోగదారులకు సేవలందించేందుకు, అలానే మా భాగస్వాములతో బంధం మరింత బలోపేతం చేసే దిశగా ఓఆర్ఏ ఎప్పుడూ కృషి చేస్తుంది. భవిష్యత్లో వన్ ప్లస్తో బంధం మరింత ముందుకు సాగుతుందని ఆశిస్తున్నాం.” అని సౌత్ ఇండియన్ ఆర్గనైజ్డ్ రీటైలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ టీ.ఎస్ శ్రీధర పేర్కొన్నారు.
అసలు సమస్య ఏంటంటే? – వన్ ప్లస్కు సంబంధించిన ప్రాడక్ట్స్ ఆఫ్ లైన్ సేల్స్ను ఆపివేయాలని ఈ ఏడాది ప్రారంభంలో ఓఆర్ఏ నిర్ణయం తీసుకుంది. మార్జిన్లు తక్కువగా ఉండటం కూడా ఒక కారణమని తెలిపింది. సర్వీస్ క్లెయిమ్స్, వారెంటీలను వన్ ప్లస్ ఆలస్యం చేస్తుండటం కూడా మరో కారణం అని సమాచారం! అందుకే దేశవ్యాప్తంగా ఉన్న 4500 స్టోర్స్లో వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్స్, వాచ్లతో పాటు ఇతర గ్యాడ్జెట్స్ సేల్స్ను 2024 మే 1 నుంచి నిలిపివేస్తున్నట్టు ఓఆర్ఏ అప్పుడు ప్రకటించింది.
ఏడాదిగా వన్ ప్లస్ గ్యాడ్జెట్స్తో సమస్యలు ఎదురుతున్నాయని, ఆ సమస్యలను పరిష్కరించేందుకు వన్ ప్లస్ ముందుకు రావడం లేదని గతంలో తెలిపింది ఓఆర్ఏ. అందుకే సేల్స్ను నిలిపివేయనున్నట్లు నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. దీంతో రీటైల్ స్టోర్స్లో వన్ ప్లస్ గ్యాడ్జెట్స్ అందుబాటులో లేకపోవడం వల్ల చాలా మంది అమెజాన్ వంటి ఇ-కామర్స్ ప్లాట్ ఫామ్లలో మాత్రమే కొనుగోలు చేసే పరిస్థితి ఏర్పడింది. కాగా, ఈ స్టోర్స్ ఆంధ్రప్రదేశ్తో పాటు తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటకలో ఎక్కువగా ఉన్నాయి.