Ratapani Wildlife Sanctuary| రైల్వే శాఖ తప్పిదం కారణంగా గత 9 సంవత్సరాలలో 14 చిరుత పులులు, 7 పులులు, 1 ఎలుగుబంటి చనిపోయాయని మధ్యప్రదేశ్ లోని వన్యప్రాణ విభాగం తెలిపింది. అటవీశాఖ నియమాలను రైల్వే శాఖ పాటించకపోవడమే ఈ మరణాలు సంభవించాయని మండిపడింది.
మధ్యప్రదేశ్ లోని రతపాని వైల్డ్ లైఫ్ శాంచువరీ (వన్యప్రాణుల అభయారణ్యం), టైగర్ రిజర్వ్ ఉన్న అటవీ ప్రాంతం మీదుగా బర్ఖేడా, బుధ్నీ రైల్వే లైన్ నిర్మాణం జరిగింది. ఈ రైల్వే లైన్ రూ.991.6 కోట్లతో 26.5 కిలోమీటర్ల పొడవున నిర్మించారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఈ రైల్వే లైన్ కారణంగా వన్య ప్రాణుల ప్రమాదాలకు గురై చనిపోతున్నాయి. ముఖ్యంగా జూలై 14, 2024న ఏకంగా నాలుగు పులి పిల్లలు రైల్వే లైన్ మీద ఉండగా.. ట్రైన్ వాటిని ఢీ కొట్టింది.
గాయాలతో పడి ఉన్న పులి పిల్లలను అటవీశాఖ అధికారులు గుర్తించి వాటిని ఆస్పత్రికి తరలించారు. కానీ చికిత్స పొందుతూ అవి మరణించాయి. ఈ విషయంపై వన్యప్రాణి విభాగం సీరియస్ అయింది. 2015 నుంచి ఇప్పటి వరకు ఈ రైల్వే లైన్ సమీపంలో ప్రమాదాల కారణంగా 7 పులులు, 14 చిరుత పులులు, 1 ఎలుగుబంటి చనిపోయాయని.. ఇదంతా రైల్వే శాఖ నిబంధనలు పాటించకపోవడమే జరిగిందని తెలిపింది.
సెప్టెంబర్ 6, 2024న వన్యప్రాణి విభాగం ఒక రివ్యూ మీటింగ్ చేసింది. ఈ మీటింగ్ లో పర్యావరణ మంత్రిత్వశాఖ, అటవీ శాఖ పేర్కొన్న నియమాలను రైల్వే శాఖ పాటించడం లేదని తేల్చింది. ముఖ్యంగా అటవీ ప్రాంతంలో రైల్వే లైన్ నిర్మించే సమయంలో రైల్వే లైన్ కింద వన్యప్రాణులు ఆ మార్గంలో వెళ్లేందుకు అండర్ పాస్ లు నిర్మించాలి. కానీ రైల్వే శాఖ.. రైల్వే లైన్ పై ఉన్న డ్రైనేజ్ హోల్స్ కింద ఈ అండర్ పాస్ లు నిర్మించింది. దీంతో వర్షాల కారణంగా రైల్వే లైన్ పై ఉన్న నీరంతా ఈ అండర్ పాస్ లలో చేరి అక్కడ మురికి గుంటలు ఏర్పడ్డాయి. దీంతో వన్యప్రాణులు అండర్ పాస్ ల మార్గంలో కాకుండా రైల్వే లైన్ మీదుగా సంచరిస్తున్నాయి.
Also Read: బార్టెండర్లుగా ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్.. రెస్టారెంట్ ప్రమోషన్ కోసం అవతారాలు!
పైగా డ్రైనేజ్ హోల్స్ లో చెత్త పేరుకుపోయి రైల్వే లైన్ పైనే వర్షపు నీరు నిలిచిపోవడంతో ఆ నీటిని తాగేందుకు పులులు అక్కడికి వస్తున్నాయి. వీటికి అదనంగా ఈ మార్గంలో రైలు స్పీడ్ గంటకు 60 కిలోమీటర్ వేగం మించరాదు. కానీ ఈ మార్గంలో ప్రయాణించే రైళ్లన్నీ 70-75 కిలోమీటర్ వేగంతో పరుగుతు తీస్తున్నాయి. రైల్వే లైన్లపై పొడువాటి గడ్డి మొలకలు ఉండడంతో అక్కడ వన్యప్రాణులు ఉన్నప్పుడే ట్రైన్ వస్తే.. ట్రైన్ డ్రైవర్ కు అక్కడ జంతువులు ఉన్నట్లు కనిపించేందుకు సమస్యగా మారింది.
రైల్వే లైన్ సమీపంలో ప్రయాణికులు మిగిలిపోయిన ఆహారం, చెత్త వేయడంతో వాటిని తినడానికి వన్యప్రాణులు అక్కడికి వస్తున్నాయి.
ఈ విషయం గురించి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వికాస్ కుమార్ సులియా మాట్లాడుతూ.. ”రైల్వే అధికారులకు ఈ సమస్యల గురించి సమాచారం అందించాం. వారు రైల్వే లైన్ వద్ద కొత్త అండర్ పాస్ లు, ఫెన్సింగ్ చేస్తామాని చెప్పారు. కానీ నెలలు గడిచిపోయినా చర్యలు చేపట్టలేదు. పై గా రైల్వే లైన్ మీదుగా ప్రయాణించే సమయంలో స్పీడు లిమిట్ 30 కిలోమీటర్ (గంటకు) కు తగ్గించాలని కోరాము.. కానీ రైల్వే అధికారులు తిరస్కరించారు” అని చెప్పారు.
మరోవైపు రైలు ప్రమాదాల్లో పులుల మరణాలపై రైల్వే శాఖ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ సౌరఖ్ కటారియా స్పందించారు. ”ఇది ఒక విషాద ఘటన. ప్రమాదవశాత్తు జరిగింది. కానీ మేము అన్ని భద్రతా చట్టాలను పాటిస్తున్నాము. వన్యప్రాణ విభాగంతో కలిసి సమస్యలు పరిష్కరించడానికి పనిచేస్తాం” అని అన్నారు.