Nara Lokesh: ఎన్టీఏ కూటమి అధికారంలో ఉన్నంత కాలం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని మంత్రి నారా లోకేష్ తేల్చి చెప్పారు. వైసీపీ హయాంలో సొంత ప్రయోజనాల కోసం 700 కోట్లు ఖర్చు చేసి రుషి కొండపై నిర్మాణాలు చేపట్టారని మండిపడ్డారు. రాష్ట్రానికి పెట్టుబడులు వస్తుంటే జగన్ ఓర్వలేకపోతున్నారని అన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా లక్షలాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. గత ఐదేళ్లలో వైసీపీ విధ్వంసం సృష్టించిందన్నారు లోకేష్.
ఓ ఛానల్ పై పరువునష్టం దావా కేసులో విశాఖ కోర్టుకు లోకేష్ హాజరయ్యారు. ఈ కేసును నవంబర్ 15కి వాయిదా వేశారు. పరువునష్టం కేసు గెలుస్తామని.. సదరు మీడియాపై తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. విశాఖ ఐటీ ప్రగతిలో టీసీఎస్ కీలక పాత్ర పోషించనుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. త్వరలోనే పలు కొత్త కంపెనీలు రానున్నాయన్నారు. పెట్టుబడుల ప్రోత్సాహకం, సమస్యల పరిష్కారానికి ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటు చేస్తున్నామని లోకేష్ తెలిపారు.
Also Read: జగన్ తాడేపల్లి ప్యాలెస్.. కొత్త విషయాలు బయటకు
గత ప్రభుత్వంలో చట్టాలు ఉల్లంఘించిన వారందరిపై చర్యలు ఉంటాయన్నారు లోకేష్. రెడ్బుక్ చూస్తే జగన్ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. నవంబర్, డిసెంబర్ నెలల్లో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడతామని లోకేష్ స్పష్టం చేశారు. ఉచిత ఇసుక విధానంలో లోపాలను సరిచేస్తామని.. 2019లో ఏధరకు ఇసుక లభించిందో అదే ధరకు ఇసుక లభ్యమయ్యేలా చూస్తామన్నారు. యూనివర్సిటీల్లో కొత్త వీసీల నియామకానికి సెర్చ్ కమిటీ ఏర్పాటు కావాల్సి ఉందని వెల్లడించారు. త్వరలో ఏజన్సీలోని పాఠశాలలను కూడా సందర్శిస్తానని మంత్రి లోకేష్ చెప్పారు.
గత ఐదు సంవత్సరాలుగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం మీద ఎన్నో ఉద్యమాలు కొనసాగుతూనే ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఉద్యమానికి సంబంధించి.. ఒక క్లారిటీ ఇవ్వడం కోసం ఈ మధ్య కాలంలో స్వయాన ఆ కేంద్ర ఉక్కు శాఖామంత్రి కుమారు స్వామి అక్కడికి వెళ్లి కార్మికులతోను, సీఎండీ తోను మాట్లాడిన సంగతి తెలిసిందే. విశాఖ స్టీల్ ప్లాంట్ దేశానికి అవసరమైన ప్రాజెక్ట్.. ఎట్టి పరిస్థితుల్లోను ప్రైవేటీకరణ కాదని చెప్పారు. అయినా కూడా ప్రైవేటీ కరణ లేదని ప్రకటిస్తూనే ఉద్యోగులపై వేటు వేసింది. తర్వాత వాళ్ల పాస్లు రెన్యువల్ చేయడం, కొన్ని యూనిట్లు ఆగిపోతున్న సమయంలో మళ్లీ వాటిని తిరిగి ప్రారంభించే దిశగా కొంతవరకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఖర్చులు, జమాలు మొత్తం ఎస్బీఐ చూసుకునేలా ఇటీవల రూ.500 కోట్లు రిలీజ్ చేశారు. ఇప్పటికే స్టీల్ ప్లాంట్కు సంబంధించి సెయిల్లో మెర్జ్ చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.
దీన్ని సూత్ర ప్రాయంగా కేంద్ర ప్రభుత్వం, ఉక్కు శాఖ కూడా అంగీకారం తెలిపినట్లు సమాచారం. మరొక రూ.200 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయినా కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం ఇంకా రగులుతూనే ఉంది. ఇది ఎప్పుడు ఏ విధంగా ప్రైవేటీకరణ చేస్తారని ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. లోపల ఉన్నటువంటి దాదాపుగా 8 యూనిట్లకు సంబంధించి ఇప్పటికే నాలుగు యూనిట్లు ఆగిపోయాయి. కాబట్టి గ్యాడ్యూవల్ గా యూనిట్స్ అన్నింటిని కూడా నిలుపులదల చేసి.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం పన్నాగం పన్నుతుందని స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, కార్మికులు, అభిప్రాయ పడుతున్నారు. అయితే వీరి భయాందోళనను మొత్తం పటాపంచల్ చేస్తూ.. మంత్రి నారా లోకేష్ ఓ ప్రకటన చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నంత వరకు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేదని తేల్చి చెప్పారు.
అయితే ఈ ప్రకటన వెనుక ఖచ్చితంగా లోకేష్ సొంత మాటల్లా కనిపించడం లేదు. ఎందుకంటే వారం రోజుల క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ వెళ్లడం.. అక్కడ ప్రధానితో, కీలకమైన శాఖా మంత్రులతో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఒక స్పష్టమైన హామీ వచ్చి ఉంటాదని.. ఆ హామీ రావడం వల్లే నారా లోకేష్ ప్రకటన చేశారనేది ప్రస్తుతం విశాఖలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.