Eknath Shinde son| మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్ షిండే ఒక దేవాలయంలోని నిషేధిత గర్భగుడిల సతీసమేతంగా ప్రవేశించాడు. ఈ విషయం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. మధ్యప్రదేశ్ లోని ఉజ్జైని నగరంలో ఉన్న మహాకాళేశ్వర దేవాలయంలో సామాన్య భక్తులకు మహాకాళేశ్వర రూపంలో ఉన్న మహాశివుని దర్శనం కోసం గంటల తరబడి క్యూలో నిలబడి ఉండాల్సిన పరిస్థితి. అయితే ఆ మహాకాళేశ్వర దేవాలయంలో భక్తులు లేదా విఐపీలకు ఎవరికీ కూడా గర్భగుడిలో ప్రవేశానికి అనుమతి లేదు. గర్భగుడిలో ప్రవేశంపై నిషేధం ఉంది.
ఈ విషయం తెలిసి కూడా ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే కుమారుడు గురువారం, అక్టోబర్ 17, 2024న మహాకాళేశ్వర దేవాలయం గర్భగుడిలోకి కుటుంబ సమేతంగా ప్రవేశించాడు. జాతీయ మీడియా కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని థానె జిల్లా కల్యాణ్ లోక్ సభ నియోజకవర్గం ఎంపీ అయిన శ్రీకాంత్ షిండే తన భార్య, ఇద్దరు పిల్లలతో మహాకాళేశ్వర ఆలయం గర్భగుడిలో ప్రవేశించి ప్రత్యేక పూజలు చేశారు.
Also Read: మూత్రంతో వంట చేసిన పనిమనిషి.. ఆ విషయం ఎలా బయటపడిందంటే?
ముఖ్యమంత్రి కుమారుడు దేవాలయ గర్భగుడిలో ప్రవేశించే సమయంలో ఆలయం సెక్యూరిటీ ఇన్చార్జి జయంత్ రాథోడ్, గర్భగుడి ఇన్స్పెక్టర్ తో సహా నలుగురు ఆయనతో పాటు ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన పూజలు చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. మహాకాళేశ్వర ఆలయం గర్భగుడిలో ప్రవేశానికి దాదాపు ఏడాది క్రితం నిషేధం విధించారు.
ఈ విషయం మీడియా ద్వారా బహిర్గతం కావడంతో వివాదాస్పదంగా మారింది. ముఖ్యంగా మహారాష్ట్రలోని కాంగ్రెస్ నాయకులు ఎంపీ శ్రీకాంత్ షిండే గర్భగుడిలో ప్రవేశించడాన్ని వ్యతిరేకించారు. “ఒకవైపు నిషేధం ఉన్నా విఐపీలకు గర్బగుడిలో ఎలా అనుమతిస్తారు. మరోవైపు సామాన్యులు మాత్రం గంటల తరబడి క్యూలో నిలబడి దైవ దర్శనం కోసం ఎదురుచూడాలి. ఇది నిబంధనల ఉల్లంఘన కాకపోతే మరేంటి?.. మేము దీన్నీ వ్యతిరేకిస్తున్నాం ” అని కాంగ్రస్ ఎమ్మెల్యే మహేశ్ పర్మార్ చెప్పారు.
మహాశివుని మహాకాళేశ్వర ఆలయం (Mahakaleshwar Temple) దేశంలోని 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి. దీంతో ఈ దేవాలయానికి ఒక విశిష్టత ఉంది. అక్కడ నిత్యం భక్తులు వేల సంఖ్యలో దర్శనానికి వస్తారు.
ఈ ఘటనపై దేవాలయం కమిటీ చైర్మెన్ అయిన ఉజ్జైని జిల్లా కలెక్టర్ నీరజ్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. ”గర్భగుడిలో ఏ ఒక్కరికీ ప్రవేశం లేదు. ఆయన గర్భగుడిలోకి అనుమతులు లేకుండా ప్రవేశించాడు. ఈ విషయంలో చర్యలు తీసుకోవాల్సిందిగా దేవాలయం కార్యదర్శికి నేను ఆదేశాలు జారీ చేశాను.” అని అన్నారు. మరోవైపు దేవాలయం కార్యదర్శి గణేష్ ధాక్కడ్ ఈ ఘటన ఎలా జరిగిందనే విషయంపై విచారణ చేసి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఈ వివాదం రాజకీయం కావడంపై ఎంపీ శ్రీ కాంత్ షిండే (Shrikant Shinde) ప్రతిపక్షాలపై ఎదురుదాడికి దిగారు. “మేము గుడికి వెళ్లినా ప్రతిపక్ష పార్టీల నాయకులకు అలర్జీ వస్తుంది. వాళ్లు దేవాలయాలకు వెళ్లరు. మేము వెళ్లి పూజలు చేస్తే వాళ్లు సహించరు. ఆపడానికి ప్రయత్నిస్తారు,” అని మండిపడ్డారు