Israel–Hamas war: ఇజ్రాయెల్ పగబడితే ఎలా ఉంటుందో హమాస్కు తెలియకేమీ కాదు.. సిన్వర్కి ముందు కూడా పదులు సంఖ్యలో హమాస్ లీడర్లను ఇజ్రాయెల్ దారుణంగా హతమార్చింది. ప్రత్యేంకగా చేసే ఈ ఆపరేషన్ల కోసం ప్రత్యేక టెక్నాలజీతో పాటు, పకడ్బంధీ వ్యూహాలను అమలు చేసింది. హమాస్ గత అధినేత హనియే అయినా.. హిజ్బుల్లా మాజీ చీఫ్ నస్రల్లా అయినా.. ఇజ్రాయెల్ పడగ నీడను దాటి వెళ్లలేకపోయారు. అసలు, ఇజ్రాయెల్ వీళ్లందర్నీ ఎలా హతమార్చింది..? ఎలాంటి వ్యూహాలు పన్నింది..?
హనియే హత్యలో అమెరికా నుండి తెచ్చిన ఆయుధ వ్యవస్థ
వందల కేజీల మందుగుండు సామాగ్రిని నుండి మూడు గ్రాముల పేజర్ బాంబుల వరకూ ఇజ్రాయెల్ చేతిలో ప్రతీ ఆయుధం శత్రువుకి చెమటలు పట్టించాయి. యాహ్యా సిన్వర్ మరణంలో ఆయుధంతో ఉన్న మామూలు వీడియో డ్రోన్తో కాల్పులు జరిపితే.. ఈ ఏడాది జులై 21న ఇస్మాయిల్ హనియేను అంతమొందించడానికి అమెరికా నుండి తెచ్చిన ఆయుధ వ్యవస్థను వినియోగించింది ఇజ్రాయెల్. అలాగే, లెబనాన్లో హిజ్బుల్లాను నాశనం చేయడానికి 3 గ్రాములు పేలుడు పదార్థంతో పేజర్లను, వాకీ టాకీలను బాంబులుగా మార్చి పేల్చేసింది. ఇక, దశాబ్ధాలుగా జరుగుతున్న ఈ యుద్ధంలో శత్రువులను వేటాడటానికి అత్యాధునిక పరికరాల నుండి ఓల్డ్-ఫ్యాషన్ గూఢాచారి వ్యవస్థ వరకూ అన్నింటినీ ఉపయోగించుకుంది. ఇజ్రాయెల్ దాడుల చరిత్ర చూస్తే.. లెటర్ బాంబుల నుండి విషప్రయోగం, బూబీ ట్రాప్లు, సాయుధ డ్రోన్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోటిక్ మెషిన్ గన్లు వంటి రకరకాల ఆయుధాలు కనిపిస్తాయి.
బీరూట్లో డ్రోన్ దాడిలో ఫువాద్ షుక్ర్ హతం
మూడు నెలల క్రితం ఇస్మాయిల్ హనియేను చంపినప్పుడు.. “ఇజ్రాయెల్, ఎవరినైనా.. ఎక్కడున్నా చేరుకోగలదు” అని ప్రకటించింది. అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ దాడి చేసిన తర్వాత ఇజ్రాయెల్ చేసిన యుద్ధంలో ఎవ్వర్నీ వదిలిపెట్టమని కచ్ఛితంగా చెప్పింది. అందులో భాగంగానే వరుసగా ఒకొక్కర్నీ అంతం చేస్తూ వస్తోంది. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యేందుకు ఇస్మాయిల్ హనియే ఇరాన్ రాజధానికి టెహ్రాన్ వెళ్లినప్పుడు అతన్ని హతమార్చింది. ప్రమాణ స్వీకారం కార్యక్రమం తర్వాత టెహ్రాన్లోని తన ప్రధాన కార్యాలయంలో ఉండగా ఇజ్రాయెల్ వాయుసేన ఆ భవనంపై క్షిపణులతో దాడి చేసింది. దీనికి, కొన్ని గంటల ముందు ఇజ్రాయెల్ సైన్యం బీరూట్లో డ్రోన్ దాడిలో ఫువాద్ షుక్ర్ అనే సీనియర్ హిజ్బుల్లా కమాండర్ను చంపేసింది. అలాగే, 2024 జనవరి 2న డిప్యూటీ హమాస్ చీఫ్ సలేహ్ అల్-అరౌరీని డ్రోన్ దాడితో హతమార్చింది. జనవరి 15న గాజా స్ట్రిప్లో హమాస్ అంతర్గత మంత్రి సయీద్ సెయ్యామ్ను వైమానిక దాడిలో చంపారు.
Also Read: ‘ఖలీస్తాన్ ఉగ్రవాది’ హత్యాయత్నం కేసులో నిందితుడిగా భారత ఇంటెలిజెన్స్ అధికారి.. అమెరికా ఆరోపణలు
ఒకవైపు, హమాస్తో యుద్ధం చేస్తూనే, లెబనాన్లో హిజ్బుల్లాను కూడా తుడిచిపెట్టేయడానికి ఇజ్రాయెల్ నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా.. బీరుట్ దక్షిణ శివార్లలోని సెంట్రల్ కమాండ్ ప్రధాన కార్యాలయం వద్ద హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాను చంపేసింది. నస్రల్లాను హతమార్చడానికి అమెరికా తయారుచేసిన గైడెడ్ ఆయుధాన్ని ఇజ్రాయెల్ ఉపయోగించింది. ఈ దాడిలో 900 కిలోల బరువున్న మార్క్ 84 సిరీస్ బాంబును వినియోగించింది. ఇప్పుడు, ఇలాంటి ఆయుధాలు ఇజ్రాయెల్ వద్ద చాలానే ఉన్నాయి. ఇవి చాలా ఖచ్చితత్వంతో-లక్ష్యాన్ని ఛేదించగల ఆయుధాలు. ఇలాంటి దాడిలోనే దక్షిణ లెబనాన్లోని హిజ్బుల్లా టాప్ కమాండర్ అలీ కరాకే కూడా మరణించాడు. అలాగే, ఆ దాడిలో 20 మందికి పైగా హిజ్బుల్లా సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. ఇక, యెమెన్లోని హౌతీల లక్ష్యాలపై కూడా ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఇజ్రాయెల్ సైన్యం ఫైటర్ జెట్లతో సహా పెద్ద సంఖ్యలో విమానాలు శత్రువులు వాడుతున్న పవర్ ప్లాంట్లు, రాస్ ఇస్సా, హోడెయిడా ఓడరేవుల వద్ద ఓడరేవును లక్ష్యంగా చేసుకొని దాడులు చేసింది.
గతంలో కుక్కలకు బాంబు అమర్చి, టార్గెట్ చేసిన ఇజ్రాయెల్
ప్రస్తుతం, ఇజ్రాయెల్ టార్గెట్ స్పష్టంగా ఉంది. హమాస్, హిజ్బుల్లాకు చెందిన అగ్ర నాయకులందర్నీ మట్టుబెట్టడానికి కంకణం కట్టుకుంది. దీని కోసం, గతంలో వాడినట్లు పాత కాల పద్ధతులను పక్కన పెట్టింది. ఒకప్పుడు, కోవర్ట్ ఆపరేషన్లు చేసిన శత్రువులను ఎలిమినేట్ చేసిన ఇజ్రాయెల్ బలగాలు.. ఒక సందర్భంలో కుక్కలకు బాంబులను పెట్టి, టార్గెట్ చేరుకున్న తర్వాత రిమోట్తో పేల్చిన ఘటనలు కూడా ఉన్నాయి. అయితే, 1990లలో ఇజ్రాయెల్ సాయుధ డ్రోన్లను వాడటం మొదలుపెట్టింది. ఇజ్రాయెల్ దళాలు, గూఢచారుల ప్రాణాలను పణంగా పెట్టకుండా, శత్రువులను మట్టుబెట్టడానికి సాధ్యమైనంత వరకూ టెక్నాలజీని వాడటానికే ప్రాధాన్యత ఇచ్చింది. అందుకే, ప్రస్తుతం జరుగుతున్న దాడులు అత్యాధునిక ఆయుధాలతోనే చేస్తోంది. ప్రధానంగా, అత్యంత కచ్ఛితత్వంతో లక్ష్యాన్ని ఛేదించగలిగిన ఎయిర్ స్ట్రేక్స్ను ఇజ్రాయెల్ ఉపయోగిస్తోంది. అయితే, యాహ్యా సిన్వర్ కోసం వాటిని కూడా ఉపయోగించాల్సిన అవసరం ఇజ్రాయెల్కు రాలేదు.
ఇబ్రహిమ్ అకిల్, షౌద్ షుక్ర్, ఆలీ కరాకీ, మహమ్మద్ నస్సెర్
యుద్ధం మొదలైనప్పటి నుండీ ఇజ్రాయెల్ యుద్ధ వ్యూహం చాలా స్పష్టంగా ఉంది. ఒకవైపు, భూతల యుద్ధాన్ని కొనసాగిస్తూనే.. వాయు మార్గంలో ఎయిర్ స్ట్రైక్స్ చేస్తోంది. మరోవైపు, శత్రువుల లీడర్లను ప్రత్యేకంగా టార్గెట్ చేస్తూ ఒకొక్కరినీ ఎలిమినేట్ చేస్తూ వస్తోంది. ఇప్పటి వరకూ హమాస్కు చెందిన ఇద్దరు అధినేతలను చంపగా.. హిజ్బుల్లా చీఫ్ను కూడా హతమార్చింది. ఇక, ఇప్పుడు రాబోయే హమాస్ లీడర్లు కూడా ఇజ్రాయెల్ ఎలిమినేట్ లిస్ట్లో చేరతారు. అలాగే, హిజ్బుల్లా నుండి ఇప్పటికే కమాండర్ ఇబ్రహిమ్ అకిల్, షౌద్ షుక్ర్, ఆలీ కరాకీ, మహమ్మద్ నస్సెర్ వంటి చాలా మంది కీలక నాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఇక, మిగిలిన వారిని కూడా చంపి తీరుతామని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇప్పుడు, ఇరాన్తో ఏ క్షణమైనా పూర్తి స్థాయి యుద్ధం చోటుచేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇదే జరిగితే, ఎలిమినేషన్ లిస్ట్లో ఇరాన్ సుప్రీమ్ ఆలీ ఖమేనీ టార్గెట్ అవుతారు.