Elon Musk, Jeff Bezos As Bartenders| ఈ కాలంలో సోషల్ మీడియా ఊహించని రీతిలో అభివృద్ధి చెందుతోంది. వ్యక్తిగత ప్రచారంతోపాటు బిజినెస్ ప్రచారం కోసం కూడా భలే ఉపయోగపడుతోంది. తాజాగా ఒక కొత్త రెస్టారెంట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ రెస్టారెంట్ చాలా స్పెషల్. ఎందుకంటే ఈ రెస్టారెంట్ ప్రమోషన్ కోసం ఇందులో ప్రపంచ బిలియనీర్లు, అత్యంత సంపన్నులు కూడా లేబర్ గా పనిచేస్తున్నారు. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా. కానీ ఇందులో కొంత శాతమే నిజముంది.
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం ఆస్టిన్ నగరంలో ఇథోస్ అనే కొత్త రెస్టారెంట్ ప్రారంభమైంది. ఈ ఇథోస్ రెస్టారెంట్ గురించి సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది. ఇథోస్ రెస్టారెంట్ పేరుతో దాని యజమానులు ఇన్స్టాగ్రామ్ లో ఒక అకౌంట్ కలిగి ఉన్నారు. ఇథోస్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ తక్కువ కాలంలో విపరీతమైన ఆదరణ లభించింది. కేవలం కొన్ని రోజుల్లోనే ఇన్స్టాగ్రామ్ లో 73000 మంది ఫాలోవర్స్ ఉన్నారు.
Also Read: మూత్రంతో వంట చేసిన పనిమనిషి.. ఆ విషయం ఎలా బయటపడిందంటే?
ఇథోస్ రెస్టారెంట్ యజమానులు తమ వద్ద లభించే ఫుడ్ వెరైటీ, డ్రింక్స్ గురించి ఇన్స్టాగ్రామ్ లో సూపర్ క్లారిటీ ఇమేజ్ లు పోస్ట్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రపంచంలోనే ప్రముఖ బిలియనీర్లు ఫొటోలు కూడా పోస్ట్ చేసింది. ఈ ఫొటోల్లో అమెజాన్ బాస్ జెఫ్ బెజోస్, టెస్లా, స్పేస్ ఎక్స్ బాస్ ఎలన్ మస్క్ కనిపిస్తున్నారు. వీరిద్దరూ తమ రెస్టారెంట్ లో బార్ టెండర్లుగా పనిచేస్తున్నారని.. పోస్ట్ లో ఉంది.
అయితే ఇక్కడే అందరికీ అనుమానం వచ్చింది. ఏంటి అంతపెద్ద లక్షల కోట్ల ఆస్తిపరులు.. జెఫ్ బెజోస్, ఎలన్ మస్క్ ఎందుకు బార్ టెండర్ పనిచేస్తారని సోషల్ మీడియాలో డిబేట్ మొదలైంది. కానీ ఇథోస్ రెస్టారెంట్ పోస్ట్ చేసిన ఫొటోలు నిజం కావు. అవి ఫేక్. ఏఐ ద్వారా జెనరేట్ చేసిన ఇమేజ్ లు. కానీ ఆ ఇమేజ్ లు హైపర్ రియలిస్టిక్ గా కనిపిస్తున్నాయి. చూసినవారంతా ఆ ఫొటోల్లో ఉన్నది జెఫ్ బెజోస్, ఎలన్ మస్క్ అని నమ్మేస్తున్నారు.
ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే ఇంతవరకు చెప్పిన ఇథోస్ రెస్టారెంట్ అసలు నిజజీవితంలో లేదు. కేవలం సోషల్ మీడియాలో దాని గురించి ప్రచారం జరుగుతోంది. రెస్టారెంట్ లో లభించే ఫుడ్ ఐటెమ్స్ ఫొటోలు కూడా ఏఐ ఇమేజ్లు. ఆస్టిన్ నగరంలో నెంబర్ వన్ రెస్టారెంట్ తమదే అని చెప్పుకునే ఇథోస్ యజమానులు.. అందులో లభించే ఐటెమ్స్ హనీకూంబ్ చీజ్ కేక్, క్రాయిసెంట్ ఆకారంలో ఉండే మూ డెంగ్ ఫొటోలు ఎఐ ద్వారా జెనెరేట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతే కాదు రెస్టారెంట్ లో పనిచేసే చెఫ్లు, మేనేజర్లు, దానికి ఎన్నో అవార్డులు వచ్చినట్లు పెట్టిన ఫోటోలన్నీ ఫేక్. అవన్నీ ఏఐ ద్వారా జెనెరేట్ చేసినవి.
ఇథోస్ రెస్టారెంట్ కు ప్రత్యేకంగా వెబ్ సైట్ ఉంది. అందులో ఉదయం 4.30 కే డిన్నర్ లభిస్తుందని.. రిజర్వేషన్ చేసుకోకపోతే ఆర్డర్ చేయలేమని అందులో ఉంటుంది. ఇథోస్ పేరుతో టి షర్ట్స్, క్యాప్స్ లాంటి మర్చెండైజ్ కూడా ఆన్ లైన్ లో విక్రయిస్తున్నారు
ఇదంతా తెలియక చాలామంది సోషల్ మీడియాలో ఇథోస్ రెస్టారెంట్ అకౌంట్ ను ఫాలోఅవుతున్నారు. పైగా రెస్టారెంట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో పెట్టే ప్రతి పోస్ట్ కు వేలల్లో లైక్స్ వస్తున్నాయి. ప్రచారం ఎక్కువ కావడంతో చాలా మంది ఈ రెస్టారెంట్ లో భోజనం చేయాలని వెళ్లి.. నిరాశతో వెనుతిరుగుతున్నారు. ఒక యూజర్ అయితే ఇథోస్ రెస్టారెంట్ లో భోజనం చేయడానికి వెళ్లానని.. కానీ అది ఎక్కుడుంతో వెతికి వెతికి అలసిపోయానని రాశాడు.
కొందరైతే ఇదంతా బిజినెస్ ట్రిక్ అని అభిప్రాయపడుతున్నారు. ఇథోస్ రెస్టారెంట్ పేరుతో బాగా ప్రచారం చేసి.. ఎవరైనా నిజంగా రెస్టారెంట్ బిజినెస్ పెట్టాలనుకుంటే వారికి ఇథోస్ కాపీరైట్స్ విక్రయించేందుకు ఇదంతా జరుగుతోందని చెప్పారు. కానీ మరోవైపు ఏఐ ఇమేజెస్ తో ప్రజలను తప్పుదోవ పట్టించేవారిపై చర్యలు తీసుకోవాలని మండిపడుతున్నారు.