Tamil Nadu Governor| తమిళనాడులో ముఖ్యమంత్రి యం కె స్టాలిన్, గవర్నర్ ఆర్ ఎన్ రవి మధ్య మరోసారి చిచ్చు రాజుకుంది. ద్రవిడ సంప్రదాయాన్ని, జాతీయ సమైక్యతను ఉద్దేశపూర్వకంగానే అవమానించారని గవర్నర్ రవిపై ముఖ్యమంత్రి స్టాలిన్ మండిపడ్డారు. ఆయన గవర్నర్ పదవికి అనర్హుడని పేర్కొంటూ.. కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. గవర్నర్ రవిని రీకాల్ చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కోరారు.
తమిళనాడులో ఇటీవల చెన్నై దూరదర్శన్ స్వర్ణోత్సవ వేడుకలు జరిగాయి. ఈ వేడుకలను గవర్నర్ రవి ముఖ్య అతిథిగా వెళ్లారు. ఈ వేడుకల్లో తమిళనాడు రాష్ట్ర గీతం పాడుతున్నప్పుడు గాయకుల బృందం ద్రవిడ అనే పదాన్ని ఉచ్చరించకుండా పాడింది. అయితే తమిళ రాష్ట్ర గీతం అయిన ‘తమిళ థాయి వళ్తు’లో ద్రవిడ పదానికి ప్రాముఖ్యం ఉంది. దక్షిణ భారతీయులకు ద్రవిడ అనే పదం ఓ గుర్తింపు లాంటిది.
అలాంటి ద్రవిడ పదమే ఉచ్చరించకుండా తమిళ రాష్ట్ర గీతం పాడేయడం చాలా పెద్ద తప్పు అని.. ఇది రాష్ట్ర చట్టాలను ఉల్లంఘించడమేనని, గవర్నర్ రవి హిందీ భాషను ప్రోత్సహించడం కోసమే తమిళనాడు ప్రజలను అవమానించారని సిఎం స్టాలిన్ వ్యాఖ్యానించారు. జాతీయ సమైక్యతను అవమానించిన ఆర్ఎన్ రవి.. గవర్నర్ పదవికి అనర్హుడని విమర్శిస్తూ.. జాతీయ గతం జనగణమణలో కూడా ద్రవిడ పదాన్ని తొలగించడానికి రవి అనుమతిస్తారా? అని స్టాలిన్ ఎద్దేవా చేశారు.
Also Read: రూ.60 లక్షలు ఇస్తే.. సినిమాల్లో హీరోయిన్ చాన్స్ అంటూ యువతిపై అత్యాచారం, దోపిడి
అయితే సిఎం స్టాలిన్ వ్యాఖ్యలపై గవర్నర్ రవి ఘాటుగా స్పందించారు. తనపై స్టాలిన్ జాతి వివక్ష ఆరోపణలు చేశారని అన్నారు. తాను ఎప్పుడూ తమిళ రాష్ట్ర గీతాన్ని పాడుతూ ఉంటానని.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కూడా తమిళ సంప్రదాయాలను ప్రోత్సహించేందుకు పలు కార్యక్రమాలు, పథకాలు చేపట్టిందని గుర్తుచేశారు. కానీ సిఎం స్టాలిన్ తన స్థాయి మరిచి వ్యాఖ్యలు చేశారని విమర్శించారు.
మరోవైపు చెన్నై దూరదర్శన్ 50వ వార్షికోత్సవాల్లో తమిళ రాష్ట్ర గీతం పాడటంలో జరిగిన తప్పిదంపై నటుడు, తమిళ మున్నేట్ర కళగం నాయకుడు కమల హాసన్ తప్పుబట్టారు. ద్రవిడ పదాన్ని విస్మరించడం రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు జరిగిన అవమానంగా అభివర్ణించారు. అయితే కమల హాసన్ గవర్నర్ లేదా హిందీ భాషపై ఎటువంటి విమర్శలు చేయకపోవడం గమనార్హం.
ఈ మొత్తం వివాదంపై చెన్నై దూరదర్శన్ కేంద్రం అధికారికంగా ప్రకటన చేసింది. స్వర్ణత్సోవ వేడుకల్లో తమిళ రాష్ట్ర గీతంలో ద్రవిడ పదం విస్మరించడం గాయకులు చేసిన తప్పు అని స్పష్టం చేసింది. వేడుకల్లో తప్పు జరిగింనందుకు అధికారికంగా క్షమాపణలు కోరింది.
తమిళనాడులో హిందీ భాష, తమిళ భాష అంశంపై చాలా సంవత్సరాలుగా రాజకీయం జరుగుతూనే ఉంది. హిందీ భాషను కేంద్ర ప్రభుత్వం తమపై బలవంతంగా రుద్దుతోందని తమిళనాడు రాజకీయ నాయకులు గతంలో కూడా కేంద్రం తీరుపై విమర్శలు చేశారు. హిందీని వ్యతిరేకిస్తూ తమిళనాడులో ఉద్యమాలు కూడా జరిగాయి. దీనికి అదనంగా తమిళనాడులో గవర్నర్ రవి, సిఎం స్టాలిన్ మధ్య తరుచూ మాటల యుద్దం జరుగుతూ ఉంటుంది.