Pm Modi to Visit Russia : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి రష్యా పర్యటనకు వెళ్తున్నారు. ఈనెల 22, 23 తేదీల్లో కజాన్ వేదికగా 16వ బ్రిక్స్ సమ్మిట్ జరగనున్నాయి. ఈ సందర్బంగా మోదీని స్వయంగా పుతిన్ ఆహ్వానించినట్లు తెలుస్తోంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానం మేరకు మోదీ ఆ దేశానికి కదలనున్నారు.
ఇది రెండోసారి…
ఇక గడిచిన నాలుగు నెలల్లో ప్రధాని నరేంద్ర మోదీ రష్యాకు వెళ్లడం ఇది రెండోసారి కావడం గమనార్హం. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం తర్వాత మాస్కోలో తొలిసారిగా ఈ ఏడాది జులైలో ప్రధాని పర్యటన చేపట్టారు. అప్పుడు 22వ భారత్–రష్యా శిఖరాగ్ర భేటీని నిర్వహించారు. ఇంకోవైపు రష్యాలోని భారత సంతతి ప్రజలతో మోదీ భేటీ కావడం గమనార్హం.
రష్యాలో కీలక చర్చలు…
‘ప్రపంచ అభివృద్ధి, భద్రత కోసం ప్రపంచ దేశాల మద్ధతు కూడగట్టి దాన్ని బలోపేతం చేయడం’ అనే థీమ్తో ఈ సమ్మిట్ నిర్వహించనున్నారు. దీంతో ప్రపంచ సమస్యలపైనా కీలకమైన చర్చలు చేపట్టనున్నారు.
బ్రిక్స్ పురోగతి…
ఇక బ్రిక్స్ ప్రారంభించిన కార్యక్రమాల పురోగతిని అంచనా వేయడం, భవిష్యత్ సహకారం కోసం ఈ శిఖరాగ్ర సమావేశం ఉపయోగపడుందని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ, బ్రిక్స్ సభ్య దేశాల అధినేతలతో ద్వైపాక్షిక చర్చలు చేపడతారని వివరించింది. భవిష్యత్ లోనూ ఇరు దేశాల మధ్య సహకారం కోసం పని చేసేందుకు చర్చించనున్నారు.
మొదట్లో 4, తర్వాత 1, ఆపై 5…
2006లో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా దేశాలు కలిసి బ్రిక్ గ్రూపును ప్రారంభించాయి. 2010లో సౌత్ ఆఫ్రికా చేరికతో గ్రూప్ పేరు బ్రిక్స్గా మారింది. 2024 జనవరిలో ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలు వచ్చి చేరాయి. దీంతో ప్రస్తుతం ఈ బ్రిక్స్ గ్రూపులో పది దేశాలు సభ్యులుగా ఉండటం కొసమెరుపు.
also read : జైల్లో బోరుమన్న బోరుగడ్డ అనిల్, ఇకపై ఎలాంటి తప్పు చేయను