Lady Aghori: కోరిన కోర్కెలు తీర్చే తల్లి అమ్మవారి ఆలయమిది. అమ్మా అనే పిలుపుకు.. పలికే అమ్మవారి ఆలయంపై ఇటీవల దాడి జరిగింది. అయితే పలువురు నిందితులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ప్రస్తుతం భక్తులతో పాటు పోలీసులు కూడా అధికసంఖ్యలో ఆలయం వద్ద ఉంటున్నారు. ఈ క్రమంలో ఒక కారు సడెన్ గా ఆలయం వద్దకు వచ్చింది. కారులో నుండి దిగిన మహిళ చకచకా నడుస్తూ ఆలయంలోకి వెళ్లారు. పూజలు నిర్వహించారు. అందరూ ఆ మహిళా భక్తురాలిని చూసి ఖంగుతిన్నారు. అసలేం జరుగుతోందన్న విషయం ఎవరికీ అర్థం కాలేదు. దానికి ప్రధాన కారణం వచ్చింది ఎవరో తెలుసా.. మహిళా అఘోరీ నాగసాధువు.
ఇటీవల సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయంపై దాడి జరగడంతో ఆలయం వార్తల్లో నిలిచింది. ఈ దాడిపై హిందూ ధార్మిక సంఘాలు భగ్గుమన్నాయి. పోలీసులు కూడా ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా భావించి ఇప్పటికే పలువురు నిందితులను కూడా అరెస్ట్ చేశారు. ఇలా వార్తల్లో నిలిచిన ఈ ఆలయానికి ఇటీవల భక్తులు భారీగా తరలివస్తున్నారు. అయితే ఆలయం అపవిత్రమైనట్లు గుర్తించిన ఆలయ అర్చకులు.. ప్రత్యేక పూజా కార్యక్రమాలను సైతం నిర్వహిస్తున్నారు. హోమాలు కూడా నిర్వహిస్తుండగా.. ఇతర ప్రాంతాల నుండి కూడా భక్తులు తరలివస్తున్నారు.
అయితే ఇటీవల ఒక మహిళా అఘోరీ ఆలయంలో పూజలు నిర్వహించడం, ఆ వీడియోలు బయటకు రావడంతో వైరల్ గా మారాయి. ఆలయంపై దాడిలో అమ్మవారి విగ్రహాన్ని పెకిలించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సాధారణంగా తపస్సు దీక్షలో ఉండే అఘోరీలు, ఒక్కసారిగా దాడి జరిగిన ఆలయం వద్దకు రావడంతో భక్తులు విస్మయానికి గురయ్యారు.
అసలే దాడి జరిగింది కాబట్టి.. ఏదైనా కీడు జరుగుతుందేమోనన్న ఆలోచనలో ఉన్న భక్తులకు, అఘోరీ రావడం.. ఆలయంలో పూజలు నిర్వహించడంతో ఇక అంతా శుభమేనంటూ భక్తులు భావిస్తున్నారు. అది కూడా కారులో దిగిన సమయం నుండి, మరల తిరిగి వెళ్ళేంత వరకు కూడా మహిళా నాగసాధువు ఒక్క మాట కూడా మాట్లాడలేదట. అయితే కొందరు భక్తులు మాత్రం ఆమెతో సెల్ఫీలు దిగారు.
ఇలా అఘోరీ వచ్చి పూజలు నిర్వహిస్తున్నట్లు తెలుసుకున్న భక్తులు, కొద్ది క్షణాల్లోనే భారీగా ఆలయం వద్దకు చేరుకున్నారు. అయితే అఘోరీ వచ్చిన కారుపై పుర్రె బొమ్మలు ఉండడం, అలాగే అక్కడ డేంజర్ అంటూ రాసి ఉండడం మరో విశేషం. ఏదిఏమైనా దాడి జరిగిన ఆలయం వద్దకు అఘోరీ రావడం, పూజలు నిర్వహించడంతో ఆ అమ్మవారి కరుణ కటాక్షం తమకు దక్కిందని భక్తులు తెలుపుతున్నారు.