Adani group donation: తెలంగాణలో నూతన సంస్కరణలతో, విధివిధానాలతో ప్రజా సంక్షేమానికి, యువత ఉపాధి కల్పనకు సీఎం రేవంత్ సర్కార్ అధిక ప్రాధాన్యత ఇస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్శిటీ నిర్వహణపై దృష్టి సారించింది. రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలో ఏర్పాటు చేస్తున్న ఈ యూనివర్శిటీకి ప్రభుత్వం తరఫున రూ. 100 కోట్ల నిధులను సీఎం రేవంత్ కేటాయించారు.
ఈ యూనివర్శిటీ లక్ష్యం.. స్వయం ఉపాధిలో రాణించాలనుకున్న యువతకు వారిలో నైపుణ్యతను పెంచి, యువత ఉపాధికి అవకాశాలు అందేలా చేయడమే. అటువంటి సందర్భంలో అన్ని రంగాల్లో కూడా తెలంగాణ యువత అంతర్జాతీయ పోటీని సమర్ధవంతంగా ఎదుర్కొనేలా చేయడం కూడా యూనివర్శిటీ ముఖ్య ఉద్దేశ్యం. ఈ యూనివర్శిటీ ద్వారా పలు కోర్సులు ప్రవేశపెట్టి, యువతను ఉపాధిరంగంలో తిరుగులేని శక్తిగా తయారు చేయాలన్నదే సీఎం రేవంత్ కోరిక. అందుకు అనుగుణంగా ముచ్చర్ల వద్ద 57 ఎకరాల స్థలంలో నిర్మాణపనులు కూడా వేగవంతంగా సాగుతున్నాయి.
సీఎం రేవంత్రెడ్డికి రూ.100 కోట్ల చెక్కు ఇచ్చిన అదానీ
సీఎం రేవంత్తో అదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ మర్యాదపూర్వక భేటీ
యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్శిటీకి అదానీ ఫౌండేషన్ నుంచి విరాళం
రూ.100 కోట్ల విలువైన చెక్కును అందజేసిన గౌతమ్ అదానీ@revanth_anumula @gautam_adani… pic.twitter.com/PJUOb0rAwC
— BIG TV Breaking News (@bigtvtelugu) October 18, 2024
అలాగే తొలివిడతగా ఇటీవల యూనివర్శిటీ కోర్సులకు నోటిఫికేషన్ ను సైతం ప్రభుత్వం విడుదల చేసింది. ఈ కోర్సులలో ప్రవేశం పొందాలనుకున్న అభ్యర్థులు అక్టోబర్ 29 లోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు సమర్పించాలని ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. దీనితో ప్రభుత్వం సాధించాలనుకున్న లక్ష్యం వైపు తొలి అడుగు పడినట్లయింది.
యూనివర్శిటీ నిర్వహణ కోసం దాతలు ముందుకు రావాలని ఇటీవల సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. ఒక మంచి ఉద్దేశ్యంతో ఏర్పాటు చేస్తున్న యూనివర్శిటీకి సంస్థలు సహాకారం అందిస్తే చాలు.. తెలంగాణ వ్యాప్తంగా గల కంపెనీలకు నైపుణ్యత సాధించిన ఉద్యోగులు అందుబాటులోకి వస్తారన్నారు. ఈ క్రమంలోనే తాజాగా అదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ్ అదానీ, సీఎం కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ గురించి తెలుసుకున్న అదానీ, తెలంగాణ ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. అనంతరం రూ. 100 కోట్ల విరాళాన్ని చెక్కు రూపంలో సీఎంకు అందజేశారు. యువత నైపుణ్యత కలిగి ఉన్నప్పుడే ఉపాధి అవకాశాలు దరిచేరుతాయని, ప్రస్తుతమున్న పోటీ ప్రపంచంలో ఇటువంటి యూనివర్సిటీల అవసరముందని అదానీ ఈ సందర్భంగా అన్నారు. దీనితో సీఎం రేవంత్ సైతం రూ. 100 కోట్ల విరాళం ప్రకటించడంపై, అదానీకి కృతజ్ఞతలు తెలిపారు.