KTR on TDP Congress: ఆ పాపం మాది కాదు.. అంతా మీదే. ఎవరో చేసిన పాపాన్ని మాకు అంటగట్టడం తగదు. మేము మూసీ బ్యూటిఫికేషన్ పేరిట.. పలు చర్యలు తీసుకున్నా కూడా ఏనాడు పేదలను తరిమికొట్టిన దాఖలాలు లేవని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు.
కేటీఆర్ శుక్రవారం మూసీ నది ప్రజెంటేషన్ ఇస్తూ తెలంగాణ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. కేటీఆర్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి అనవసర విమర్శలు చేయడం మానుకోవాలన్నారు. 1908లో 15వేల మంది వరదలు వచ్చి మృత్యువాత చెందారన్న కారణంగా, నాడు మీర్ ఉస్మాన్ అలీద్ ఖాన్ నిర్మించారన్నారు. ఆ తర్వాత ప్రఖ్యాత ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య ప్రత్యేక చొరవతో.. హైదారాబాద్ కు వరద ముప్పు రాకూడదని డిజైన్ చేశారన్నారు. 2015 లో సెంట్రల్ పొల్యూషన్ బోర్డు మూసీ నది గురించి కాలుష్యమైన నదిగా గుర్తించిందన్నారు. దేశంలోనే ప్రప్రథమ కాలుష్యనదిగా గుర్రించబడితే, అప్పుడు అధికారంలో ఉన్నది కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలే అన్నారు.
సీఎం రేవంత్ మాట్లాడుతూ గత పాలకుల వల్లనే.. మూసీకి ఈ గతి పట్టిందని విమర్శించారన్నారు. ఆ మాటతో తాను కూడా ఏకీభవిస్తానని, ఎందుకంటే అప్పుడు సీఎం రేవంత్ అవే పార్టీలలో ఉన్నారన్నారు. అందుకు ఆ పాపం వారిదేనన్నారు.
హైదరాబాద్ లో ఎక్కడ చినుకు రాలినా కూడా.. మూసీలో కలవాల్సిందేనన్నారు. హైదరాబాద్ ను వరదల నుండి కాపాడే నది మూసీ అంటూ.. సీఎం రేవంత్ ఢిల్లీకి మూటలు పంపేందుకు మూసీ సుందరీకరణ అంటూ తెరపైకి తీసుకువచ్చారన్నారు. తమ ప్రభుత్వ హయాంలో మూసీ ప్రక్షాళన కోసం తాము ఎన్నో చర్యలు చేపట్టామని, అది కూడా మానవీయ కోణంలో చేశామన్నారు. కానీ నేటి కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ బ్యూటిఫికేషన్ పేరిట లూటిఫికేషన్ చేస్తున్నారన్నారు.
Also Read: Land Scam Case: ముడా ఆఫీసులో ఈడీ సోదాలు.. సీఎం సిద్దరామయ్యకు చిక్కులు తప్పవా?
సీఎం రేవంత్ తన అజ్ఞానాన్ని బయట పెట్టుకొని, చేయని సర్వేను చేసినట్టుగా అబద్ధాలుచెప్పారన్నారు. మూసీ సుందరీకరణ పేరుతో రూ.లక్షన్నర కోట్ల స్కామ్కు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. తమ ప్రభుత్వ హయాంలో రూ.16,634 కోట్లతో మూసీ ప్రక్షాళనకు డీపీఆర్ సిద్ధం చేశామని, కానీ దురదృష్టవశాత్తు తాము ఒడిపోయామని, అందుకే నేడు పేదలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. మూసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేసిన ఘనత తమదేనని, ఈ విషయాన్ని నేటి కాంగ్రెస్ నేతలు గుర్తుంచుకోవాలన్నారు. సీఎం రేవంత్ రోజుకొక తీరులో మాట్లాడుతూ.. అపరచితుడి సినిమా తరహాలో పలు పాత్రలు ప్రజలకు చూపిస్తున్నారన్నారు. తాము ఏనాడూ పేదల గృహాలు పడగొట్టాలని అనుకున్న సంధర్భం లేదని, కానీ నేడు అంతా అదే జరుగుతుందన్నారు.
మూసీ నది పుట్టిన దామగుండం అడవులలో రాడార్ స్టేషన్ పేరిట నది గొంతు నలిమివేస్తున్నారని, ఈ విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు. మూసీ సుందరీకరణ పేరుతో పేద ప్రజలను ఇబ్బందులు పెడుతూ.. సీఎం రేవంత్ సాధించేది ఏముందంటూ ప్రశ్నించారు. ఇప్పటికైనా అసలు మూసీ నది అంటే ఏమిటి ? తాము ఎటువంటి అభివృద్ది పనులు చేపట్టామో తెలుసుకొని సీఎం రేవంత్ మాట్లాడాలని కేటీఆర్ సూచించారు. ఇలా సాగిన కేటీఆర్ ప్రజెంటేషన్ కు కాంగ్రెస్ ఏవిధంగా స్పందిస్తుందో వేచిచూడాలి.