Karnataka MUDA ED Raids| ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి) అధికారులు కర్ణాటకలోని మైసూరు డెవలప్మెంట్ అథారిటీ (ముడా) ఆఫీసలు శుక్రవారం తనిఖీలు చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఆయన కుటుంబ సభ్యులు ముడా భూముల్లో కేటాయింపుల్లో అవినీతికి పాల్పడ్డారని.. ఈ వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగిందని ఆరోపణలు రావడంతో 12 మంది ఈడీ అధికారుల బృందం.. మైసూరు లోని ముడా ఆఫీసుతో పాటు పలు చోట్ల తనిఖీలు చేశారు.
ఈ తనిఖీల్లో ముడా కమిషనర్ రఘునందన్ తో పాటు స్పెషల్ ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసుకు చెందిన పలువురు అధికారులను ప్రశ్నించారు. ఈ క్రమంలో ఆఫీసుల్లోని పలు కీలక ఫైల్స్ని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ అధికారులందరికీ ముడా భూకుంభకోణంలో పాత్ర ఉందని అధికారులు అనుమానిస్తున్నట్లు జాతీయ మీడియా తెలిపింది.
ఈడీ అధికారుల వెంట కేంద్ర పారామిలిటరీ బలగాలు కూడా తనిఖీల్లో పాల్గొనడం గమనార్హం. ఈడీ అధికారులు తనిఖీలు చేసిన ఆఫీసులన్నింటికీ ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి సిద్దరామయ్య లేదా ఆయన కుటుంబ సభ్యులతో లింక్ ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: ’90 గంటలు బాత్ రూమ్ లో బంధించారు’.. ఉగాండాలో భారత బిలియనీర్ కూతురు ‘కిడ్నాప్’
ముడా భూ కుంభకోణం ఆరోపణలు రావడంతో ముడా చైర్మన్ పదవికి కె మారి గౌడ రెండు రోజుల క్రితమే రాజీనామా చేశారు. ఆయన రాజీనామా చేయగానే ఈడీ విభాగం విచారణ ప్రారంభించడం కీలకంగా మారింది.
ముఖ్యమంత్రి సిద్దరామయ్యతో 40 ఏళ్ల పాటు రాజకీయంగా సన్నిహిత సంబంధాలు ఉన్న మారి గౌడ తన అనారోగ్యం కారణంగా రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. తన రాజీనామా వెనుక ఎటువంటి రాజకీయ ఒత్తిడి లేదని.. ముఖ్యమంత్రి సిద్దరామయ్య అంగీకారంతోనే తాను రాజీనామా చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
ముడా స్కామ్ కేసులో సిఎం సిద్దరామయ్య భార్య బిఎన్ పార్వతి పేరున మైసూరు నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో 14 ప్లాట్ల భూమిని కేటాయించడం జరిగిందని.. ఈ 14 ప్లాట్లకు బదులుగా ఆమె తన ఇతర ప్రాంతంలోని 3.16 ఎకరాల భూమిని ముడాకు అప్పగించారు. ముడా కమిషనర్ ప్రకారం.. ఆ 3.16 ఎకరాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టస్ నిర్మాణం కోసం తీసుకోవడం జరిగింది. అయితే అవినీతి నిరోధక కార్యకర్తలు.. ఇదంతా ప్రభుత్వ ఆస్తులను కాజేయడానికే జరిగిందని.. దీని వల్ల ప్రభుత్వానికి రూ.45 కోట్ల నష్టం జరిగిందని ఆరోపణలు చేశారు. కానీ ముఖ్యమంత్రి భార్య పార్వతి తన పేరు మీద ఉన్న 14 ప్లాట్ల భూమిని తిరిగి ముడాకు అప్పగించేశారు.
ముడా భూ కుంబకోణంలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య పాత్ర ఉందని ఆరోపణలు రావడంతో ఆయనను విచారణ చేసేందుకు కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లోట్ అనుమతులిచ్చారు. గవర్నర్ అనుమతలను వ్యతిరేకిస్తూ.. ముఖ్యమంత్రి సిద్దరామయ్య హై కోర్టులో సవాల్ చేశారు. కానీ ఆయన కోర్టు ఆయన విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇప్పుడు ఈడీ అధికారులు సిద్దరామయ్య అండ్ ఫ్యామిలీపై గురి పెట్టారు.
ముడా స్కామ్ లో సిద్దరామయ్య తనకు వ్యతిరేకంగా ఉన్న ఆధారాలను నిర్వీర్యం చేస్తున్నారని ఈడీ ఇప్పటికే కోర్టుకు తెలిపింది. సిఎం భార్య ముడా భూములను తిరిగి ఇచ్చేసినా విచారణ మాత్రం ఆపేది లేదని ఈడీ అధికారులు తెలిపారు. మరోవైపు ప్రతిపక్ష పార్టీలైన బిజేపీ, జెడిఎస్ ముడా స్కామ్ లో సిబిఐ విచారణకు డిమాండ్ చేస్తున్నాయి. కానీ కర్ణాటక ప్రభుత్వం సిబిఐ విచారణకు రాష్ట్రంలో అనుమతిని నిరాకరించింది.