YS Jagan: ఓ వైపు సీఎం నారా చంద్రబాబు నాయుడు మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహిస్తున్న సమయంలోనే.. మరోవైపు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. చంద్రబాబు తన ప్రసంగంలో గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన నేపథ్యంలో.. వాటిపై జగన్ తాజాగా స్పందించారు.
కూటమి ప్రభుత్వ పాలనపై జగన్ మాట్లాడుతూ.. అబద్ధాలు ప్రచారం చేసి కూటమి ఎన్నికల్లో గెలిచిందన్నారు. ప్రజలు మోసపు మాటలను నమ్మి ఓట్లు వేశారని, రాష్ట్రాన్ని కూటమి నిండా ముంచేసిందన్నారు. గత ఐదు నెలలుగా ఎక్కడా డిబిటి విధానం కనిపించలేదని, కూటమి పాలనలో డిబిటి అంటే దోచుకో, పంచుకో, తినుకో అనే రీతిలో ఉందన్నారు.
తాజాగా ప్రవేశపెట్టిన నూతన మద్యం విధానం పై జగన్ మాట్లాడుతూ.. మద్యం టెండర్ల అంశంలో అంతా అవినీతి జరిగిందన్నారు. గత ప్రభుత్వంలో నాసిరకం మద్యం విక్రయించారని ప్రచారం చేశారని, ఇప్పుడు మాత్రం నాణ్యమైన లిక్కర్ అంటూ కూటమినేతలు ఊదరగొడుతున్నట్లు తెలిపారు. వైసిపి హాయంలో ఒక్క డిస్టీలరీకి కూడా లైసెన్స్ ఇవ్వలేదని, మద్యం సాకుగా చూపి రాష్ట్రంలో కుంభకోణానికి తెర లేపారన్నారు. చంద్రబాబు హయాంలోనే కొత్తకొత్త బ్రాండ్లు తీసుకు వచ్చారని, రాష్ట్రంలో మాఫియా రాజ్యమేలుతుందని విమర్శించారు. నూతన మద్యం విధానం అంటూ.. చివరకు మద్యం ప్రియులను కూడా ప్రభుత్వం మోసం చేసిందన్నారు.
సూపర్ సిక్స్ లేదు.. సెవెన్ లేదు..
ఏపీ ఎన్నికల సమయంలో సూపర్-6 అంటూ ఊదరగొట్టిన కూటమి, ఇప్పుడు వాటి అమలును మరచిపోయిందని జగన్ అన్నారు. అలాగే అధికారం వచ్చేంతవరకు ఒక రకం, అధికారం చేజిక్కించుకున్నాక ఇప్పుడు రాష్ట్రం గడ్డుకాలంలో ఉందని చెబుతాన్నరని విమర్శించారు. ఇక సూపర్ సిక్స్ లేదు.. సెవెన్ లేదు.. ఒకటే ఒకటి అబద్దపు హామీలే ప్రజలకు దిక్కయ్యాయని జగన్ అన్నారు. అబద్దపు హామీలు గుప్పించి కూటమి అధికారంలోకి వచ్చిందని, రాష్ట్రాన్ని నిండా ముంచేసిందన్నారు.
ఇసుక ఫ్రీ.. ఎక్కడ..
రాష్ట్రంలో ఇసుక ఫ్రీ అంటూ కూటమి ప్రకటన.. ప్రకటన వరకే ఆగిందన్నారు. కూటమి అధికారంలోకి వస్తే చాలు ఫ్రీ ఫ్రీ అంటూ ప్రకటించి, నేడు ఒక్కొక్క జిల్లాలో రూ.60 వేలు చొప్పున, మరికొన్ని జిల్లాలలో రూ.14 వేల చొప్పున విక్రయిస్తున్నారన్నారు. ఇసుక మాఫియా రాజ్యమేలుతుందని, సాక్షాత్తు చంద్రబాబు ఇంటి ప్రక్కనే ఇసుక అక్రమంగా త్రవ్వుతున్నట్లు ఆరోపించారు. ఇసుక రాష్ట్రానికి జీరో ఆదాయం వచ్చేలా చేసి, టీడీపీ నేతలే దండుకుంటున్నట్లు విమర్శించారు. రాష్ట్రంలో కమీషన్ ఇవ్వనిదే ఏ పనులు సాగడం లేదని, అంతా అవినీతిమయం అయిందంటూ జగన్ అన్నారు.
ఇలా కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు లక్ష్యంగా జగన్ విమర్శలు చేశారు. తన పాలనలో అవినీతికి ఆస్కారం లేకుండా సాగిందని, నేడు ప్రజలు కూటమిని నమ్మి అధికారం ఇస్తే.. అంతా అవినీతిమయం అయిందన్నారు.